వడ్డీలో మార్పు లేదు, జీడీపీ అంచనా తగ్గింపు

 

RBI జెల్ల కొట్టింది. వడ్డీ రేటు తగ్గింపు కోసం బడా కంపెనీలు, బడా బాబులు ఆశగా ఎదురు చూస్తుంటే వారి ఆశల్ని వమ్ము చేసింది. వడ్డీ రేట్లలో మార్పులు లేవు పొమ్మంది. పైగా 2016-17 సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు విషయమై గతంలో వేసిన అంచనాను తగ్గించేసుకుంది. వృద్ధి రేటు 7.1 శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం రేపో రేటు (స్వల్ప కాలిక వడ్డీ రేటు – దీనినే క్లుప్తంగా బ్యాంకు రేటు / వడ్డీ రేటు అంటారు) 6.25% గా ఉంది. దీనిని 6%కి తగ్గిస్తారని కొన్ని సంస్ధలు అంచనా వేస్తె మరి కొందరు 5.75% కి తగ్గిస్తారని అంచనా వేశారు. ఎవరి అంచనా కూడా నిజం కాలేదు. 

వీరి అసలు, అంచనాకు ప్రధాన కారణం బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున డిపాజిట్లు ఉండడం (12.6 లక్షల కోట్లు జమ అయినట్లు బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ చెప్పింది. 11.55 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు   ఈ రోజు RBI తన సమీక్షా ప్రకటనలో పేర్కొంది.) డబ్బు చలామణి తగ్గిపోవడం, కనుక ధరలు తగ్గడం. 

వడ్డీ రేటు యధాతధంగా కొనసాగించడానికి RBI చెప్పిన కారణాలు: అమెరికా ఎన్నికల అనంతరం ప్రపంచంలో నెలకొన్న పరిస్ధితులు; ఇంట నెలకొన్న ఆందోళనకరమైన ద్రవ్య (ఫైనాన్షియల్) పరిస్ధితులు; రెండో క్వార్టర్ లో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు తక్కువగా నమోదు కావడం. 

భారత బ్యాంకుల్లో భారీగా ద్రవ్య నిల్వలు చేరినప్పటికీ “ఇంట నెలకొన్న ఆందోళనకరమైన ద్రవ్య (ఫైనాన్షియల్) పరిస్ధితుల”ను వడ్డీ రేటు తగ్గించకపోవడానికి కారణాల్లో ఒకటిగా చెప్పడం అంటే ఏమిటి అర్ధం? వడ్డీ రేట్లు తగ్గుతాయని, తేలికగా రుణాలు అందుబాటులోకి వస్తాయని, పెట్టుబడులు వృద్ధి అవుతాయని, కొత్త ఉద్యోగాలు వఛ్చి ఉపాధి పెరుగుతుందని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చెప్పిన మాటలు నిజాలు కావా? 

డీమానిటైజేషన్ వలన జీడీపీ పెద్దగా ఏమి పడిపోదని, మహా అయితే 0.2 తగ్గుతుందని ఇదేమంత విషయం కాదని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. ఛానెళ్ల  చర్చల్లో బీజేపీ ప్రతినిధులు కూడా ఇదే చెప్పారు. అయితే జీడీపీ వృద్ధి రేటు ముందు అనుకున్నట్లు 7.6 % కాకుండా  7.1 శాతంగా నమోదు అవుతుందని సమీక్షా ప్రకటనలో RBI తెలిపింది. ఈ తగ్గుదలకు డీమానిటైజేషన్ కారణం అని కూడా చెప్పింది. ఇక్కడ కూడా బీజేపీ నేతల లెక్క తప్పింది.        

“వడ్డీ రేటు యధాతధంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది” అని RBI ప్రకటించింది. అనగా RBI నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం చొరబడిందని చెప్పవచ్చని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

“దొంగ నోట్లు, నల్ల డబ్బు, టెర్రరిజం ఫైనాన్సింగ్ లను అరికట్టేందుకుకే డీమానిటైజేషన్ ప్రక్రియ చేపట్టారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు” అని RBI గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఇది వింత ప్రకటన. RBI గవర్నర్ చెప్పవలసింది తాము చేపట్టిన డీమానిటైజేషన్ చర్యకు కారణాలు ఏమిటన్నది గాని ప్రజలు ఏమనుకుంటున్నారన్నది కాదు. జనం ఏమి అనుకుంటున్నారో జనానికి చెప్పాల్సిన బాధ్యత RBI గవర్నర్ కి ఎవరు అప్పజెప్పారు? 

ఆయన బ్యూరోక్రాట్ అధికారి. చట్టబద్ధంగా ఆయన కొన్ని విధులు నిర్వర్తించాలి. అంతవరకే ఆయన ప్రకటన పరిమితం కావాలి. జనం మదిలోని భావాలను కనిపెట్టి ద్రవ్య సమీక్షా విధానంలో ప్రకటించటం ఆయన విధి కాదు. అయినా ఆయన జనం గురించి చెప్పారంటే అది రాజకీయ నాయకులు ప్రేరేపించిన ప్రకటనను విడుదల చేశారని అర్ధం అవుతున్నది.    

రాజకీయ నాయకులు లేదా కేంద్ర ప్రభుత్వమూ మరియు మంత్రులు RBI విధుల్లోకి చొరబడి ఆ సంస్ధ ప్రకటనలను కూడా ప్రభావితం చేయడం దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎంతమాత్రం మంచిది కాదు. ప్రజలకు అసలే మంచిది కాదు. 

 

సంక్షోభాన్ని దాటుతున్న భారత బ్యాంకులు -మూడీస్

భారత బ్యాంకింగ్ రంగం ఎన్‌పి‌ఏ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో పురోగమన బాటలో వెళుతోందని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ మూడిస్ చెప్పింది.

రఘురాం రాజన్ నేతృత్వం లోని ఆర్‌బి‌ఐ బ్యాంకులపై విధించిన కొత్త నిబంధనతో బ్యాలన్స్ షీట్ల నుండి మాయం అయిన మొండి బాకీలన్నీ ప్రత్యక్షం తిరిగి పుస్తకాల్లో అయ్యాయి. దానితో భారతీయ బ్యాంకులు అమాంతం మొండి బాకీల సంక్షోభంలో పడినట్లు లోకానికి తెలిసి వచ్చింది.

గతంలో మొండి బాకీలను లేదా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ను బ్యాలన్స్ షీట్ లో చూపించకుండా దాచి పెట్టే వెసులుబాటు ఉండేది. దానివల్ల మొండి బాకీలను బ్యాలన్స్ షీట్ లో చూపేవారు కాదు. ఫలితంగా బ్యాంకు బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తోందని చూపించేవారు. మొండి బాకీ కాస్తో కూస్తో వసూలైతే అప్పుడే లాభంగా పుస్తకంలో చూపేవారు.

ఈ వెసులుబాటు రుణాల ఎగవేతదారులకు గొప్ప వరం అయింది. (అసలు వాళ్ళకు వరం ఇవ్వడం కోసమే బాకీలు దాచిపెట్టే దారుణాన్ని ప్రారంభించారన్న ఆరోపణలూ ఉన్నాయి.) పుస్తకాలలో కనపడని బాకీలు వసూలు చేయాలన్న ధ్యాసే ఉండేది కాదు. పొరబాటున వసూలు అయినవి పోగా మిగిలిన మొండి బాకీలను కొన్నేళ్ళ తర్వాత రద్దు చేసేసేవాళ్ళు. అప్పు రద్దు చేస్తే బాకీదారులకు వరమే కదా!

రఘురాం రాజన్ ఈ వెసులుబాటు లేకుండా చేశారు. ఎన్‌పి‌ఏ లు అన్నింటినీ పుస్తకాల్లో చూపాల్సిందే అని నిబంధన విధించారు. దానితో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. భారత బ్యాంకుల సంక్షోభం గురించి పశ్చిమ పత్రికలు కూడా మాట్లాడటం మొదలెట్టాయి.

రఘురాం రాజన్ చర్య ఫలితాన్ని తెలుసుకోవాలంటే ఒక అంశాన్ని చూడొచ్చు. 2015 మార్చి నాటికి మొత్తం రుణాల్లో మొండి బాకీలు 4.6 శాతం ఉండేవి. కొత్త నిబంధన విధించాక అది ఈ యేడు జూన్ నాటికి అమాంతం 8.7 శాతానికి పెరిగింది (ఆర్‌బి‌ఐ).  దాదాపు రెట్టింపు అయిందన్నమాట!

రీ షెడ్యూల్ చేసిన రుణాలు, వాయిదా వేసిన రుణాలు కూడా కలిపితే మొత్తం బాకిల్లో మొండి బాకీలు, ఈ యేడు జూన్ చివరి నాటికి, 12 శాతంగా తేలాయి.

ఈ సంక్షోభం నుండి భారతీయ బ్యాంకులు బైట పడుతున్నాయని మూడిస్ ‘సర్టిఫికేట్’ ఇచ్చింది. బ్యాంకుల రేటింగ్ ని ‘నెగిటివ్’ నుండి ‘స్టేబుల్’ కి మార్చినట్లు ప్రకటించింది. ఈ రేటింగు వచ్చే 12 నుండి 18 నెలల దాకా ఉంటుందని హామీ ఇచ్చింది.

ఈ కాలంలో మొండి బాకీల పరిణామం పెరగడం కొనసాగినప్పటికీ, పెరుగుదల రేటు గతం కంటే తక్కువ ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. అందుకే రేటింగ్ ని పెంచింది.

BIS in Switzerland
BIS in Switzerland

బేసెల్ III స్టాండర్డ్ ని చేరుకోవడానికి ఇండియన్ బ్యాంకులు 2019 లోపల మరో 1.2 ట్రిలియన్ రూపాయలు (ట్రిలియన్ = లక్ష కోట్లు) లేదా 18 బిలియన్ డాలర్లు సమీకరించాల్సి ఉంటుందని మూడీస్ తేల్చింది.

బేసెల్ అనేది స్విట్జర్లాండ్ లో ఓ నగరం. ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు బేసెల్ నగరం వద్ద కలుస్తాయి.  ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులకు ప్రమాణాలను నిర్దేశించే ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఈ నగరంలోనే ఉన్నది.

2008-09 నాటి ద్రవ్య ఆర్ధిక సంక్షోభం తర్వాత అటువంటి పరిస్ధితి మళ్ళీ రాకుండా ఉండేందుకు అని చెబుతూ ఈ బి‌ఐ‌ఎస్ సరికొత్త ప్రమాణాలను నిర్దేశించింది. ఆ ప్రమాణాల కలయికని బేసెల్ III గా పిలుస్తారు.
ఈ ప్రమాణాలు సంక్షోభాల నివారణకు అని చెప్పడం పూర్తి వాస్తవం కాదు. వాస్తవం ఏమిటి అంటే ఈ ప్రమాణాల అసలు లక్ష్యం ప్రపంచ వ్యాపిత ద్రవ్య వనరులను ఒక పద్ధతి ప్రకారం సమీకరించి అంతర్జాతీయ ఫైనాన్స్ కేపిటల్ కు సేవ చేసేదిగా మార్చడం. మూడో ప్రపంచ దేశాల ద్రవ్య వ్యవస్ధలు ఈ తరహా సేవ చేయటానికి వీలు లేకుండా వెనకబడి ఉన్నాయి. తమకు అందుబాటులో ఉండటానికి వీలుగా మూడో ప్రపంచ దేశాల ద్రవ్య మార్కెట్ ను రూపొందించుకోవటానికి పశ్చిమ ఫైనాన్స్ కేపిటల్ బేసెల్ III ప్రమాణాలను రూపొందించింది.

బేసెల్ III ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్ధను మార్చేందుకు మొదట 2015 గడువుగా విధించారు. అది సాధ్యం కాదని 2017 కి జరిపారు. అదీ కుదరదని గ్రహించి మార్చి 2019కి జరిపారు. మూడిస్ చెబుతున్న 2019 మార్చి లక్ష్యం ఈ కోణంలో నుండి చూడాలి.