స్పెక్ట్రమ్ వేలం: లాభం 65 వేల కోట్లు, తప్పిన అంచనాలు!

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన 4G స్పెక్ట్రమ్ పూర్తయింది. భారీ మొత్తంలో 4G స్పెక్ట్రమ్ ని వేలానికి పెట్టిన ప్రభుత్వానికి అంచనా వేసినంత భారీ ఆదాయం మాత్రం దక్కలేదు. కొన్ని కేటగిరీలలోని స్పెక్ట్రమ్ ని కంపెనీలు అసలు ముట్టుకొనే లేదు. బేస్ ధర చాలా ఎక్కువగా ఉన్నదని కంపెనీలు పెదవి విరిచాయి. మొత్తం మీద వేలంలో 65,789 కోట్ల మేర స్పెక్ట్రమ్ కొనుగోలు జరిగింది. అందులో ఈ సంవత్సరం రు 32,000/- ప్రభుత్వానికి ఆదాయంగా రానుంది. 

అమ్మకానికి పెట్టిన స్పెక్ట్రమ్ మొత్తం అమ్ముడు పొతే 5.65 లక్షల కోట్లు  ఆదాయం రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. మొత్తం 2354.55 మెగా హర్ట్జ్ ల స్పెక్ట్రాన్ని అమ్మకానికి పెట్టారు. అందులో 965 MHz కు మాత్రమే కంపెనీల నుండి బిడ్లు అందాయి. ఇది మొత్తం స్పెక్ట్రంలో 41 శాతం మాత్రమే. 59% శాతం స్పెక్ట్రమ్ కు అసలు బిడ్ లు అందలేదు. 

700, 800, 900, 1800, 2100, 2300, 2500 MHz ల ఫ్రిక్వెన్సీల స్పెక్ట్రమ్ లు వేలానికి పెట్టగా వాటిలో 700, 900 MHz ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కు ఒక్క బిడ్ కూడా రాలేదని తెలుస్తోంది. తక్కువ ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ అత్యధిక విలువ కలిగి ఉంటుంది. ఈ ఫ్రీక్వెన్సీ తరంగాలు గోడల గుండా చొచ్చుకు వెళ్లగల శక్తిని కలిగి ఉంటాయి. ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలవు. కాబట్టి టవర్లు  ఎక్కువగా నిర్మించవలసిన అవసరం లేదు. బేస్ ధర అధికంగా ఉండటంతో తాము కొనలేకపోయామని కంపెనీలు ఆరోపిస్తున్నాయి.

4G స్పెక్ట్రమ్ వేలం ద్వారా రు 98,995/- కోట్ల ఆదాయం వస్తుందని ఆర్ధిక మంత్రి బడ్జెట్ లో అంచనా వేశారు. 5.63 లక్షల కోట్ల స్పెక్ట్రమ్ ధరకు గాను ముందస్తు ఫీజు కింద ఈ ఆదాయం వస్తుందని అంచనా వేశారు. కానీ 41% స్పెక్ట్రమ్ మాత్రమే అమ్ముడు కావడంతో ముందస్తు ఫీజు కూడా తగ్గిపోయింది. 700, 800, 900 MHz ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ కు ముందస్తు ఫీజు 25% గా నిర్ణయించగా ఇతర అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్ లకు ముందస్తు ఫీజు 50% గా నిర్ణయించారు. 

చిత్రంగా, ఆదాయం అంచనాకు తగ్గిపోయినప్పటికీ, కేవలం 41% మాత్రమే స్పెక్ట్రమ్ వేలంలో పోయినప్పటికీ వేలం విజయవంతం అయిందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రు 32,000 కోట్ల ఆదాయం రావటం తక్కువ మొత్తం కాదని టెలికం మంత్రి మనోజ్ సిన్హా గొప్పలు పోయారు. “5 ఏళ్లలో ఇదే అత్యధిక ముందస్తు ఫీజు” అని ఆయన భుజం చరుచుకున్నారు. బడ్జెట్ లో అంచనా వేసిన దాదాపు లక్ష కోట్లకు రు 32,000 కోట్లు మాత్రమే రావడం తక్కువ కాకుండా ఎలా పోయింది? ఎంత సేపూ వాస్తవాలకు మసిపూసి మారేడు కాయ చేయడమే గాని, వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరిస్తూ  దాన్ని జనానికి చెప్పడం మంత్రులకు ఎప్పటికి సాధ్యం అయ్యేను? 

 

ఈసారి స్పెక్ట్రమ్ వేలం 5 రోజుల్లో పూర్తి కావడం గమనార్హం. అక్టోబర్ 1 న మొదలై సెప్టెంబర్ 5 తో బిడ్ లు పూర్తయ్యాయి. వాస్తవానికి సెప్టెంబర్ 29 నే వేలం మొదలు కావలసి ఉన్నది. కానీ దుర్ముహూర్తం అని ఎవరో చెప్పటంతో అక్టోబర్ 1 కి వాయిదా వేశారు. దుర్ముహూర్తాన్ని తప్పించినా వేలం వైఫల్యం (అనుకున్నంత ఆదాయం రాకపోవడం) మాత్రం తప్పలేదు అని అనుకోవచ్చా? 

2010 లో 2G స్పెక్ట్రమ్ వేలం వేసినప్పుడు 30 రోజులకు పైగా వేలం కొనసాగింది. 2010 లో 3G స్పెక్ట్రమ్ వేలం వేసినప్పుడు 10 రోజులకు పైగా వేలం కొనసాగింది. 4G స్పెక్ట్రమ్ వేలానికి వచ్చేసరికి 5 రోజులతో ముగిసిపోయింది. ఇదంతా దుర్ముహూర్తానికి అంటగట్ట వచ్చా? 

భారత దేశంలో అతి పెద్ద టెలికం కంపెనీగా పేరు పొందిన ఎయిర్ టెల్ కంపెనీ, తాము రు 14,244 కోట్లు ఖర్చు పెట్టి 173.8 MHz ల స్పెక్ట్రమ్ కొనుగోలు చేశామని ప్రకటించింది. 1800, 2100, 2300 MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేశామని చెప్పింది. “ఈ వేలం ద్వారా వచ్ఛే 20 సం.లకు సరిపడా స్పెక్ట్రమ్ అవసరాలను కొనుగోలు చేసాము. ఈ కొనుగోలుతో 4G, 3G స్పెక్ట్రమ్ లకు సంబంధించి అన్ని సర్కిళ్లలోను ఇప్పుడు మేము స్పెక్ట్రమ్ సంపాదించినట్లయింది” అని ఎయిర్ టెల్ చెప్పింది. 

వోడా ఫోన్ కంపెనీ తాము రు 20,000 కోట్లకు పైగా పెట్టుబడితో తాజా వేలంలో కొనుగోళ్లు జరిపామని తెలిపింది. 

రు 13,672 కోట్లు పెట్టి 22 సర్వీస్ ఏరియాలలో 269 MHz ల స్పెక్ట్రమ్ కొనుగోలు చేశామని రిలయన్స్ జియో తెలిపింది. “ఈ కొనుగోలుతో మా స్పెక్ట్రమ్ పాద ముద్రలను దేశ వ్యాపితంగా విస్తరించుకున్నాము. భారత దేశాన్ని ప్రపంచ డిజిటల్ లీడర్ గా అభివృద్ధి చెందేలా తీర్చి దిద్దెందుకు రిలయన్స్ జియో కట్టుబడి ఉన్నది” అని రిలయన్స్ జియో తన సొంత బాజా మోగించుకుంది. 

దేశ వ్యాపితంగా వైర్ లెస్ బ్రాడ్ బంద్ సేవలు అందించే శక్తిని ఈ వేలం ద్వారా సంపాదించామని ఐడియా సెల్యులార్ ప్రకటించింది. తాము రు 12,798 కోట్లతో 349.20 MHz ల స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేశామని కంపెనీ తెలిపింది. “4G LTE టెక్నలాజి రంగంలో మేము ప్రధానంగా కేంద్రీకరిస్తాం. 100 కోట్ల మందికి పైగా భారతీయులకు ఈ టెక్నలాజి అందించాలని మా లక్ష్యం” అని ఐడియా కంపెనీ ప్రకటించింది.  

పాచికలో ఒపెక్ పాత్ర -ద హిందూ…

ప్రపంచ చమురు మార్కెట్ లో సరఫరా, గిరాకీ (డిమాండ్) ల మధ్య సమతూకం నెలకొల్పే ప్రయత్నంలో రోజుకి 700,000 బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని ఉమ్మడిగా తగ్గించడానికి అల్జీర్స్ లో జరిగిన అసాధారణ సమావేశంలో చమురు ఎగుమతి దేశాల సంఘం (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ -ఒపెక్) కుదుర్చుకున్న ఒప్పందం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రెండేళ్లుగా దిగజారుతున్న ప్రపంచ క్రూడ్ ధరలు మరింత పడిపోకుండా నిలబెట్టడానికి ఈ గ్రూపు నిశ్చయాత్మకమైన చర్యలు తీసుకోవాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ జారుడు వలన 2014 ఆగస్టు  చివర్లో బ్యారెల్ కు 103 డాలర్లు పలికిన బ్రెంట్ క్రూడ్ ఈ ఏడు సెప్టెంబర్ 1 నాటికి సగానికి పైగా పడిపోయి 45.5 డాలర్లకు చేరింది. అయినప్పటికీ ఉత్పత్తి కోతలకు సంబంధించి విభేదాలతో, వివక్షలతో నిండిన ఒపెక్ సభ్య దేశాల మధ్య అర్ధవంతమైన ఏకాభిప్రాయం ఉన్నది లేనిది అస్పష్టంగానే ఉన్నది -ఈ గ్రూపులో అతి చిన్నదే అయినా సంపన్నవంతమైన పశ్చిమాఫ్రికా దేశం గాబన్ -సంక్షోభాలలో మునిగి తేలుతున్న వెనిజులా, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి ముఠాలతో నిండిన పశ్చిమాసియా దేశాలు ఈ గ్రూపులో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఒక్కో దేశం నిర్దిష్టంగా ఉత్పత్తిలో ఎంత కోత విధించుకోవాలన్న అంశాన్ని నవంబర్ లో జరగనున్న సమావేశానికి వదిలివేసినప్పటికీ, 56 ఏళ్ళ వయసు గల ఈ సంస్ధలోని అత్యధిక చమురు ఉత్పత్తి దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు పరిస్ధితి ఎంతటి నిస్పృహాత్మకంగా మారిందో ఈ ఒప్పందం తెలియజేస్తున్నది. గత 8 ఏళ్లలో మొట్టమొదటి సారిగా ప్రకటించిన ఉత్పత్తి కోత, ఒపెక్ లో అతి పెద్ద ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియా అనుసరించిన ‘ఇష్టారీతిన ఉత్పత్తి తీసే’ విధానాన్ని, తాను ప్రధానంగా ఏ ఉత్తర అమెరికా దేశాలనైతే -అమెరికా షేల్ ఉత్పత్తి ప్రయోజనాలతో సహా- లక్ష్యంగా పెట్టుకుని అనుసరించిందో ఆ దేశాలను ఎంతగా నష్టపరిచిందో, తనను కూడా అంతే నష్టపరిందని -బహుశా అంతకంటే ఎక్కువే నష్టపరిచి వుండవచ్చుఁ కూడా- ఆ దేశం పరోక్షంగా అంగీకరించినట్లే.   

అమెరికా బడా షేల్ ఉత్పత్తిదారులు తీవ్ర ప్రతిఘటన ధోరణితో తమ నిర్ణయానికి అంటిపెట్టుకుని ఉండగా -ఈ ఏడు మరిన్ని ఎకరాలలో పెట్టుబడిని విస్తరించారు కూడాను- సౌదీ అరేబియా బడ్జెట్ లో పెద్ద కంత ఏర్పడింది. 2015 లో కోశాగారా లోటు (బడ్జెట్ లోటు) ఆ దేశ జీడీపీ లో 16% గా నమోదు కాగా ఈ ఏడు కాస్త తగ్గి 13% మేర నమోదు కావొచ్చని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా తన ఖర్చులను తగ్గించుకోక తప్పలేదు; ఉద్యోగుల వేతనాలు, సబ్సిడీలను సైతం అది తగ్గించుకోవలసి వచ్చింది. ఈ సంవత్సరం, గత పదేళ్లలో మొట్టమొదటి సారిగా సౌదీ రాజు విదేశీ రుణాలు -వచ్చే ఐదేళ్ళలో 10 బిలియన్ డాలర్లు- సేకరించేందుకు పూనుకోవలసి వచ్చింది. 2016 లో సౌదీ ఆర్ధిక వృద్ధి 1 శాతానికి నెమ్మదించనున్న నేపథ్యంలో ఆ దేశం తన ఆర్ధిక వ్యవస్ధకు ప్రధాన ఇంజన్ అయిన క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి వైపుకే తిరిగి రావటం తప్ప మరో దారి లేదు. ఈ (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలోని ఘర్షణలతో నిండా మునిగి ఉన్నందున -యెమెన్ లో ప్రత్యక్షంగానూ, సిరియాలో పరోక్షంగానూ- ప్రతి బ్యారెల్ చమురుకు మరింత ఆదాయం పిండుకోవాలని, బహుశా సౌదీ పాలకులు నిర్ణయించుకుని ఉండవచ్చు. ఒప్పందంలో ఇరాన్ ని కూడా భాగస్వామిని చేయడం కోసం తక్షణ ఉత్పత్తి కోత నుండి ఇరాన్ కి మినహాయింపు ఇవ్వడానికి ఒపెక్ అంగీకరించినట్లు  తెలుస్తున్నది. చమురు డిమాండ్ గతంలో అంచనా వేసినదాని కంటే వేగంగా క్షీణిస్తుండడంతో చమురు ధరలను పునరుద్ధరించడంలో ఉత్పత్తి కోత చర్య యొక్క విజయం, నిర్ణయాన్ని పాటించడంలో గ్రూఫు సభ్య దేశాల క్రమ శిక్షణ పైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నది -గతంలో ఈ క్రమ శిక్షణే లోపించడం గమనించవలసిన విషయం.

*********

రెండేళ్ల నుండి అమెరికా షేల్ గ్యాస్ క్షేత్రాల నుండి చమురు, సహజ వాయువుల నుండి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నది. అమెరికా ఉత్పత్తి సౌదీ అరేబియాకు పోటీగా మారిందని, అమెరికా షేల్ ఉత్పత్తిని నిరుత్సాహపరిచేందుకు సౌదీ అరేబియా ‘చిత్తానుసారం ఉత్పత్తి తీసే’ ఎత్తుగడను అనుసరిస్తున్నదని అందువల్లనే చమురు ధరలు అమాంతం పడిపోయాయని ద హిందూ సంపాదకీయం చెబుతున్నది. ఈ వాదనలో నిజం పాళ్ళు చాలా తక్కువ. సౌదీ అరేబియాలో చమురు వెలికి తీసున్నది ప్రధానంగా అమెరికా కంపెనీలే. కనుక అమెరికా షేల్ క్షేత్రాల వల్ల నష్టం అంటూ జరిగితే దానివల్ల అమెరికా కంపెనీలే ఎక్కువగా ప్రభావితం అవుతాయి. కనుక చమురు ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గించడంలో అమెరికాకు వ్యతిరేకంగా సౌదీ పాల్పడుతున్న కుట్రదే పాత్ర అని చెప్పడం వాస్తవాలతో పొసగడం లేదు. 

చమురు ధరల పతనం వల్ల సౌదీ అరేబియా బాగా నష్టపోయింది అనడంలో సందేహం లేదు. కానీ ఆ నష్టాన్ని అమెరికా షేల్ క్షేత్రాల కంపెనీలు కూడా అంతే స్ధాయిలో ఎదుర్కొంటున్నాయి. అలాంటప్పుడు కుట్ర నుండి అమెరికాను మినహాయించడం నమ్మదగ్గది కాదు. అది కాక అమెరికా-సౌదీలు నమ్మకమైన మిత్ర దేశాలు. ఇటీవలి కాలంలో అమెరికా ఆర్ధిక శక్తి బలహీన పడుతూ భౌగోళిక రాజకీయాలలో రష్యా-చైనాల ప్రాబల్యం పెరుగుతున్నందున సౌదీ లాంటి దేశాలు అమెరికా శిబిరంలో కొనసాగడమా లేదా అని ఊగిసలాడుతుండడం కూడా ఒక వాస్తవమే. కానీ ఇది ఊగిసలాట వరకే ఉన్నది తప్ప పూర్తిగా శిబిరం మారడం మాత్రం జరగలేదు. ఒక జంఝాటంలో సౌదీ లాంటి దేశాలు ఉండడం నిజమే అయినా, అది పరస్పరం వాణిజ్య కొట్లాటకు దారి తీసే పరిస్ధితిగా మారలేదు. అమెరికాతో వాణిజ్య తగాదా మాములుగా ఉండదు. అమెరికాతో తగాదా వస్తే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు నిశ్శబ్దంగా ఉండవు. తగాదా పడుతున్న దేశం పైన ఏడేడు సముద్రాలకు సరిపోని విషాన్ని కుమ్మరిస్తాయి. అలాంటిది అమెరికా-సౌదీ వాణిజ్య తగాదా పైన పశ్చిమ పత్రికలు సాదా సీదా విశ్లేషణలతో సరిపెట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. 

చమురు ధరల పతనం వెనుక అమెరికా-సౌదీల ఉమ్మడి కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్ర లక్ష్యం రష్యాతో పాటు వెనిజులా లాంటి దక్షిణ అమెరికా చమురు ఉత్పత్తి దేశాలు. అమెరికాకు పక్కలో బల్లెంగా మారిన వెనిజులా, చమురు ధరల పతనం వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఆ దేశంలో ఆర్ధిక, రాజకీయ, సామాజిక సంక్షోభాలు అత్యంత తీవ్ర స్ధాయిలో కొనసాగుతున్నాయి. అమెరికా అనుకూల ప్రతిపక్షం వెనిజులా ప్రభుత్వాన్ని దాదాపు చక్ర బంధంలో పట్టి ఉంచగలుగుతోంది. పార్లమెంటు ఎన్నికలలో చావెజ్ పార్టీ ఓటమిని సైతం ఎదుర్కొన్నది. ఆ మేరకు అమెరికా కుట్ర లక్ష్యం చాలా వరకు నెరవేరినట్లే. ఒక్క రష్యా మాత్రమే అమెరికా ఊహించినట్లు లొంగి రాలేదు. అందుకు చైనా వాణిజ్య సహకారం మెండుగా తోడ్పడింది. 

పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో ప్రతీకార చర్యలు అమలు చేసిన వారికే ఎదురు తిరగడం సాధారణం. ప్రపంచ దేశాల మార్కెట్లు పరస్పరం పెనవేసుకుని ఉన్న నేపథ్యంలో ఒక చర్య ప్రభావం అలల వలే (ripple effect ) మల్లి బయలుదేరిన చోటికే తిరిగి వస్తుంది. అమెరికా, సౌదీ అరేబియాలకు చమురు ధరల పతనం ప్రభావం తమ వరకు వస్తుందని తెలియకుండా ఏమి పోలేదు. కానీ ఆ ప్రభావాన్ని, తమకు తాకే లోపు, అధిగమించవచ్చని అవి అంచనా వేసి ఉండవచ్చు. అనగా తాము లక్ష్యంగా  చేసుకున్న చోటికి వెళ్లి తమను తాకే లోపు ప్రత్యర్థి దేశం నష్టపోతాయని, ఆ తర్వాత తమ చర్యలను వెనక్కి తీసుకోవచ్చని అంచనా వేసాయి. ఆ మేరకు, వెనిజులా విషయంలో, వాటి అంచనా తప్ప లేదనే భావించవలసి ఉంటుంది. 

అలాగని అమెరికా – సౌదీల మధ్య పూర్తిగా స్నేహమే ఉన్నదని భావించనవసరం లేదు. పెట్టుబడిదారీ ప్రపంచంలో శాశ్వత శత్రుత్వం, మిత్రత్వం ఉండలేవు. వివిధ శక్తుల మధ్య, శిబిరాల మధ్య పరిస్ధితిని బట్టి ఐక్యత, ఘర్షణలు సహజమే. కనుక పెట్టుబడిదారీ దేశాల మధ్య రీ గ్రూపింగ్ జరుగుతున్న క్రమంలో దాని ప్రభావం అమెరికా-సౌదీల సంబంధాల పైన కూడా పడుతున్నది. అయితే అటువంటి రీ గ్రూపింగ్ పాత్ర చమురు ధరల పట్నంలో అమెరికా-సౌదీల మధ్య ఘర్షణగా మారే విధంగా పని చేసింది అనటానికి తగిన పరిణామాలు ఏవి కనపడలేదు. కనుక ద హిందూ విశ్లేషణలో, పైన చెప్పినట్లు  వాస్తవాల మద్దతు, నామమాత్రంగా కనిపిస్తున్నది.

 

ఎట్టకేలకు చమురు ఉత్పత్తి కోతకు ఒపెక్ నిర్ణయం!

చమురు ఉత్పత్తిలో కోత పెట్టుకునేందుకు చమురు ఉత్పత్తి – ఎగుమతి దేశాల కూటమి OPEC (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్)  నిర్ణయించింది. కూటమి నిర్ణయించిన కోత పరిమాణం స్వల్పమే అయినప్పటికీ ఉత్పత్తి తగ్గించేందుకు ఇన్నాళ్లు సౌదీ అరేబియా నిరాకరించిన నేపథ్యంలో ఈ చర్య తదుపరి చర్యలకు ప్రారంభం అవుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. 

గత నాలుగైదు ఏళ్లుగా చమురు ధరలు అత్యంత అధమ స్ధాయిలో కొనసాగుతున్నాయి. ధరలు ఎంతగా తగ్గినప్పటికీ ఆ తగ్గుదల భారత దేశం లాంటి చోట్ల ప్రజలకు అందకుండా ఆయా కేంద్ర ప్రభుత్వాలే అడ్డు పడ్డాయి. చమురు ధరలు తగ్గిన మేర కస్టమ్స్ సుంకాలు, ఇంకా అనేక తరహా పన్నులు జనం నుండి వసూలు చేశాయి. ఇండియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు పన్నులు మోది ధరల తగ్గుదల కాస్త కూడా జనానికి అందకుండా చేశాయి. 

చమురు ధరలు భారీ మొత్తంలో తెగ్గోయడానికి కారణం భౌగోళిక ఆధిపత్య రాజకీయాలు. మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో తన ఆధిపత్య, సామ్రాజ్యవాద విస్తరణ యుద్ధాలకు, ఎత్తులకు అడుగడుగునా అడ్డు పడుతున్న రష్యా, అమెరికా ల ఆర్ధిక వ్యవస్ధలను నష్టపరిచేందుకు, దక్షిణ అమెరికాలో తన ఆధిపత్యానికి సవాలుగా అవతరించిన వెనిజులా, ఈక్వడార్ తదితర దేశాల ఆర్ధిక వ్యవస్ధలను నాశనం చేసేందుకు సౌదీ అరేబియా, అమెరికా దేశాలు అత్యధిక మొత్తంలో చమురు ఉత్పత్తి మొదలు పెట్టాయి. అమెరికా తన భూభాగంపై షేల్ గ్యాస్ తవ్వకాలు జరుపుతూ మార్కెట్ ని ముంచెత్తింది. దానితో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. రష్యా ఒపెక్ దేశం కానప్పటికీ ఆ ప్రభావాన్ని అనివార్యంగా ఎదుర్కొంటుంది. 

అమెరికా ఆశించినట్లుగానే రష్యా, వెనిజులా, ఈక్వడార్ లు తీవ్ర ఆర్ధిక సమస్య ఎదుర్కొన్నాయి. చైనాతో భారీ చమురు, గ్యాస్ సరఫరా ఒప్పొందాలు చేసుకోవడం ద్వారా రష్యా ఆర్ధిక సమస్యలను అధిగమించే ప్రయత్నం చేసింది. కానీ అమెరికా ఆసించినట్లుగా మధ్య ప్రాచ్యంలో (సిరియా, టర్కీ) గాని, ఉక్రెయిన్ లో గాని అమెరికా అదిలింపులకు లొంగలేదు. వెనిజులా మాత్రం ఇప్పటికీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజల ఆదాయాలు పడిపోయి, దిగుమతులు తగ్గి, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి ప్రజలను అమెరికా అనుకూల ప్రతిపక్షాలు అల్లర్లకు రెచ్చగొట్టే వరకు పరిస్ధితి వెళ్ళింది. 

చమురు ఉత్పత్తి తగ్గితే ఆ మేరకు ధరలు పెరుగుతాయి. తద్వారా రష్యా, వెనిజులా తదితర దేశాల ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయంతో దిగుమతులు పెంచుకుని సరుకుల కొరత (వెనిజులా) తీర్చుకునే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు ప్రకటించిన ఉత్పత్తి కోత అంత ఎక్కువేమీ కాదు. రోజుకు 700,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని మాత్రమే తగ్గిస్తారు. ప్రస్తుత ఉత్పత్తి అంచనా 33.24 మిలియన్ బ్యారెళ్లతో పోల్చితే ఈ తగ్గింపు చాలా తక్కువ. 33.24 మిలియన్ బ్యారెళ్ల నుండి 32.5 మిలియన్ బ్యారెళ్లకు ఉత్పత్తి తగ్గిస్తామని ఒపెక్ కూటమి ప్రకటించింది. 

 

ఉత్పత్తి తగ్గుదలకు ఉన్న మరో ఆటంకం సౌదీ అరేబియా – ఇరాన్ ల మధ్య విభేదాలు. అమెరికా, ఇరాన్ ల మధ్య కుదిరిన ఒప్పందం రీత్యా అంతర్జాతీయ మార్కెట్ లో సాపేక్షికంగా స్వేచ్ఛగా ప్రవేశించే అవకాశం ఇరాన్ కు లభించింది. ఇది సౌదీకి ఇష్టం లేదు. ప్రాంతీయంగా ఇరాన్ ను పోటీదారుగా పరిగణించే సౌదీ అరేబియా ఇజ్రాయెల్, యూరప్, అమెరికాలతో కలిసి ఇన్నాళ్లు కుట్రలు చేసింది. చమురు ఉత్పత్తి తగ్గించాలంటే అది సౌదీ అరేబియా చేయాలని ఇరాన్, కాదు ఇరాన్ చేయాలని సౌదీ పోటీ పెట్టుకున్నాయి. ఈ కారణం కూడా చమురు ధరల్లో, ఉత్పత్తి తగ్గింపులో ప్రతిష్టంభన ఏర్పడేందుకు దారి తీసింది. 

ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ ఏ దేశం ఎంత తగ్గించాలి అన్నది ఇంకా నిర్ణయించలేదు. వచ్చే నవంబర్ లో మరో సారి సమావేశమై నిర్ణయిస్తామని కూటమి దేశాలు చెబుతున్నాయి. 

చమురు ధరలు పెరిగితే ఇండియా లాంటి చోట్ల ధరలు ఇంకా పెరుగుతాయా? లెక్క ప్రకారం చుస్తే ధరలు పెరిగినంత మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులను తగ్గించి వినియోగదారులకు ధరల్లో తేడా రాకుండా చూడాలి. అలా కాకుండా ధరలు పెంచడానికే మోడీ, బాబు ప్రభుత్వాలు నిర్ణయిస్తే ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కడం ఖాయం. పెట్రోలు ధర లీటర్ కి రు 100 దాటినా ఆశ్చర్యం లేదు. 

ఒపెక్ ప్రకటనతో చమురు ధరలు ఇప్పటికి 5 శాతం పెరిగి బ్యారెల్ కు 48 డాలర్లకు చేరింది. ఒపెక్ దేశాలు ఒక ఒప్పందానికి రావడం పట్ల వాణిజ్య కంపెనీలు సంతోషం ప్రకటిస్తున్నాయి. 8 సం.ల తర్వాత ఒపెక్ కూటమి ఒక మాట మీదికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారి సంతోషం ధరలు పెరిగేందుకు దోహదం చేసింది. ఇరాన్, లిబియా, నైజిరియాలు వాటి గరిష్ట సామర్ధ్యం మేరకు ఉత్పత్తి చేసేందుకు అనుమతిస్తామని సౌదీ ఎనర్జీ మంత్రి ప్రకటించడంతో మార్కెట్ మరింత ఉత్సాహాన్ని పుంజుకుంది. 

ఉత్పత్తి తగ్గింపు సౌదీ అరేబియా ను కూడా నష్టపరిచింది. సౌదీ ఆర్ధిక వ్యవస్ధ స్తంభనకు గురి కాగా 98 బిలియన్ డాలర్ల మేర బడ్జెట్ లోటు ఎదుర్కొంటున్నది. సౌదీ చమురు సంపదలు సౌదీ రాజు సొంతం. దానితో బడ్జెట్ లోటును పూర్తిగా ప్రజల మీదికి నిర్నిరోధంగా తరలిస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు సైతం తగ్గించేశారు. రాజు మాత్రం నష్టాన్ని భరించడం లేదు. కొన్ని విదేశీ ఆస్తుల్ని అమ్మినప్పటికీ వాటిని పూడ్చుకోవటం సౌదీ రాజుకు పెద్ద సమస్య కాదు.  

పాక్ పై ఇండియా ఎకనమిక్ వార్!

యూరి దాడికి ప్రతీకారంగా ఇండియా, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది; భౌతిక మిలటరీ యుద్ధం కాదు, ఆర్ధిక యుద్ధం! అమెరికా నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ బాగానే పాఠాలు నేర్చుకుంటున్నారు సుమీ!

ఎకనమిక్ వార్ అని భారత ప్రభుత్వం సూచిస్తున్న చర్యలలో కొన్ని అంశాలు: 

1. సాప్తా ఒప్పందం కింద ఇచ్చిన రాయితీలను ఉపసంహరించడం: సాప్తా (SAPTA ) అంటే దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం అని అర్ధం. సార్క్ కూటమి దేశాలు (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు) తమ దేశాల పరిధుల్ని స్వేచ్ఛా వాణిజ్య మండలంగా ప్రకటించాయి. దీని కింద కొన్ని పన్నులు, దిగుమతి సుంకాల పైన రాయితీ ఇవ్వబడుతుంది. 

2. MFN స్టేటస్ పైన WTO కు ఫిర్యాదు చేయటం: MFN అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ -అత్యంత సానుకూల దేశం- అని అర్ధం. ఒక దేశం మరొక దేశానికి ఈ స్టేటస్ ఇస్తే, ఇచ్చిన దేశంలో ఇవ్వబడిన దేశానికి కొన్ని రాయితీలు సిద్ధిస్తాయి. ఈ స్టేటస్ ని ఇండియా పాకిస్తాన్ కి ఇచ్చింది గానీ, పాకిస్తాన్ ఇండియాకు ఇవ్వలేదు. ఈ స్టేటస్ గురించిన వివాదాలపై WTO కు ఫిర్యాదు చేసి తీర్పు కోరవచ్చు. 

ఎకనామిక్ వార్ లో భాగంగా MFN స్టేటస్ ని ఇండియా ఉపసంహరించవచ్చు. కానీ మోడీ ప్రభుత్వం అలా చేయటం లేదు. అది కొనసాగనిస్తు  తమకు అదే స్టేటస్ ఇవ్వకపోవటం గురించి WTO కు ఫిర్యాదు చేయాలని తలపెడుతున్నది. ఇది నిజానికి ఎకనామిక్ వార్ కాజాలదు. పాక్ కి తాము ఇస్తున్న బెనిఫిట్స్ మాకు ఇప్పించాలని ఫిర్యాదు చేయటం వార్ ఎందుకు అవుతుంది? 

సిమెంటు కంపెనీలు పాక్ నుండి దిగుమతి అవుతున్న సిమెంటు ఆగిపోవాలని కోరుకుంటాయి. యూరి దాడి అవకాశంగా సిమెంటు దిగుమతులు నిలిపేయాలని అవి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. ‘ఇల్లు కాలితే చుట్టకి నిప్పు దొరికిందని సంతోషించడం’ అన్నమాట! దీనిని ఎకనామిక్ వార్ లో కలిపేస్తున్నారు. 

3. IWT ని తిరగదోడటం: IWT అంటే ఇండస్ వాటర్ ట్రీటీ అని. ఈ ఒప్పందం ద్వారా నది జలాలను ఇరు దేశాలు పంపిణి చేసుకుంటున్నాయి. ఈ ఒప్పందం లేకపోతె పాక్ కే ఎక్కువ నష్టం అని భారత ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి ట్రీటీని పాటించడం మానేస్తే పాక్ దారికి వస్తుందని వారు భావిస్తున్నారు. దీనివల్ల పాక్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకోవడం తధ్యం. అందుకే నిన్ననో మొన్ననో ప్రధాని మోడీ పాక్ పాలకులు ఎంత చెడ్డవాళ్ళో పాక్ జనానికి చెబుతున్నారు. తద్వారా “పాపం మోడిదేమి తప్పు లేదు, మన పాలకులే తప్పులు చేస్తూ మనకి ఈ దుర్గతి తెచ్చి పెడుతున్నారు” అని అనుకోవాలని ప్రధాని ఆశ కావచ్చు. అది గొప్ప స్ట్రేటజీ అని మనము అనుకోవాలి. 

ఈ వార్ వల్ల ఏ మాత్రం ఫలితం ఉంటుంది?       

2014-15 లో ఇరు దేశాల వాణిజ్యం కేవలం 2.35 బిలియన్ డాలర్లు. అది 2015-16 లో 11 శాతం పెరిగి 2.61 బిలియన్లకు చేరుకుంది. ఇది తక్కువే అయినా పాక్ పైన పట్టు బిగించడానికి ఇది చాలు అని ప్రభుత్వ పెద్దల నమ్మకం. 

అయితే కొన్ని అంశాలు గుర్తించాలి. WTO నిబంధనల ప్రకారం, ఒక దేశం మరొక దేశానికి MFN స్టేటస్ ఇస్తే ఇచ్చిన దేశం ఒక సరుకు పైన సుంకం తగ్గిస్తే అవతలి దేశం కూడా ఆ స్ధాయికి తగ్గించాలి. ఈ నిబంధన ప్రకారం WTO కి ఫిర్యాదు చేస్తే మనం లాభ పడతామని భావిస్తున్నారు. 

కానీ MFN స్టేటస్ ఇవ్వకుండా తప్పించుకోగల నిబంధన కూడా ఉన్నది. భద్రతా (సెక్యూరిటీ) కారణాల రీత్యా MFN స్టేటస్ ఇవ్వకుండా నిరాకరించవచ్చు. కనుక ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉన్న తమ దేశ పరిస్ధితుల రీత్యా స్టేటస్ ఇవ్వలేమని, సుంకాలు తగ్గించలేమని పాక్ వాదించవచ్చుఁ. దానితో భారత్ తలపెట్టిన వార్ పదును కోల్పోతుంది. 

సాప్తా రాయితీలు ఇవ్వకుండా నిలిపివేయాలంటే అది సార్క్ దేశాలన్నీ అనుకోవాలి. ఏ ఒక్క దేశం నిరాకరించినా భారత్ చర్యకు ఆమోదం దక్కదు. సార్క్ దేశాలు ఇటీవల ఇండియాకు మద్దతు రావటం నిజమే గానీ సాప్తా రాయితీల ఉపసంహరణ వరకు వారి మద్దతు వస్తుందా అన్నది అనుమానం.

కాబట్టి మోడీ ప్రభుత్వం తలపెట్టిన ‘ఎకనమిక్ వార్’ వాస్తవంలో ఆచరణకు రాకపోయినా, ఆశించిన ఫలితాలు చూపలేకపోయినా ఆశ్చర్యం లేదు. విఫలం అయితే తలవంపులు తప్పవు. అసలు ఒక దేశ పాలకులు చేసే చర్యలకు ఆ దేశ ప్రజలను బలి చేస్తామనడం దుర్నీతి. నాగరిక ప్రపంచం దానికి ఒప్పుకోదు. అమెరికా అనాగరిక పాలకుల చేతుల్లో ఉన్నది గనుకనే అది ఎన్ని దుర్నీతులకైనా పాల్పడుతుంది. దాని సరసన చేరాలని అంత కోరికగా ఉంటే ముందుకు వెళ్ళవచ్చు. కానీ అందుకు పాక్ ప్రజల నుండి మద్దతు ఉంటుంది అనుకుంటే పొరపాటు. భారత ప్రజలు కూడా ఇలాంటి వెర్రి మొర్రి ఎత్తులను వ్యతిరేకించాలి.

వీసా పోటీ: ఐరోపాకు విస్తరిస్తున్న రష్యా చెల్లింపు వ్యవస్ధ

రష్యా ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్ధ ఐరోపాకు విస్తరించడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తున్నది. పశ్చిమ దేశాలకు ఈ రంగంలో ఇప్పటి వరకు ఆధిపత్యంలో ఉండడంతో అమెరికా, ఐరోపాలు ఆడింది ఆటగా చెల్లిపోయింది. ఈ పరిస్ధితిని మార్చే లక్ష్యంతో రష్యా, చైనాలు మొదలు పెట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. 

మిర్ నేషనల్ పేమెంట్ సిస్టం (మిర్ జాతీయ చెల్లింపుల వ్యవస్ధ) పేరుతొ రష్యా తన సొంత జాతీయ మరియు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్ధను గత ఏడు ప్రారంభించింది. ఏప్రిల్ 1, 2015 తేదిన రష్యాలో ప్రారంభం అయిన ఈ వ్యవస్ధ ఇప్పుడు అంతర్జాతీయ చెల్లింపులకు కూడా విస్తరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు వీసా, మాస్టర్ కార్డు లతో చర్చలు జరుగుతున్నాయని నేషనల్ కార్డు పేమెంట్ సిస్టం (NSPK) అధిపతి వ్లాదిమిర్ కొమ్లెవ్ తెలిపాడు. 

ఉక్రెయిన్ లో అమెరికా, ఈయూ ప్రవేశ పెట్టిన  కృత్రిమ తిరుగుబాటుకు సహకరించడానికి రష్యా నిరాకరించడంతో పాటు క్రిమియా రిఫరెండంను గౌరవించి రష్యాలో కలిపేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యపై అమెరికా, ఈయూ లు ఆగ్రహించాయి. రష్యాపై ఆంక్షలు ప్రకటించి అమలు చేశాయి. ఆంక్షలలో భాగంగా అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్ధలో రష్యా వాణిజ్య చెల్లింపులను కొనసాగకుండా నిరోధించింది. ఫలితంగా రష్యా, తన సొంత ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్ధను అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించింది. రష్యాను కష్ట పెట్టి నష్టం తలపెట్టిన అమెరికా చివరికి రష్యాకు మేలు చేసింది. ఇప్పుడిక అంతర్జాతీయ ఆంక్షలతో రష్యా వాణిజ్యానికి నష్టం తెస్తానని అమెరికా బెదిరించేందుకు -ఒక కోణంలో- అవకాశం లేకుండా పోయింది. 

అమెరికా ఆంక్షలతో రష్యా వాణిజ్య చెల్లింపులను సాగకుండా నిరోధించిన పశ్చిమ చెల్లింపుల వ్యవస్ధలు వీసా, మాస్టర్ కార్డు తదితర వ్యవస్ధలు ఇప్పుడు తామే స్వయంగా రష్యన్ NSPK వ్యవస్ధతో సంబంధాలు పెట్టుకోవడానికి ముందుకు వస్తుండటం గమనార్హం. 

“మేము వీసా తో చర్చలు జరుపుతున్నాము. ప్రపంచ చెల్లింపుల వ్యవస్ధలు ఇప్పటికే మమ్ములను ఆకర్షణీయ భాగస్వాములుగా గుర్తిస్తున్నాయి. ఒక సంవత్సర కాలంలోనే మా కార్డు విస్తృతమైన నెట్ వర్క్ కలిగిన కార్డుగా అవతరించడం దానికి కారణం. ఇప్పుడు మూడు పెద్ద యూరోపియన్ ప్రాసెసర్ కంపెనీలు, ఉదాహరణకి ఫ్రాన్స్, జర్మనీలు, NSPK తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వారంతట వారే మమ్మల్ని సంప్రతించారు. యూరోపియన్ రిటైలర్ కంపెనీలు NSPK ద్వారా రష్యన్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని కొమ్లెవ్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పారు (-ఇజ్వేస్తియా). 

NSPK ఇప్పటికే మాస్టర్ కార్డు, జేసీబీ, ఆమెక్స్, యూనియన్ పే తదితర చెల్లింపు వ్యవస్ధలతో ఒప్పందానికి వఛ్చినట్లు తెలుస్తున్నది. కేవలం రిటైలర్ కంపెనీల వరకే కాకుండా రిటైలర్ కంపెనీలతో కార్యకలాపాలు నిర్వహించే భారీ అగ్రిగేటర్ కంపెనీలతో కూడా కార్యకలాపాలు నిర్వహించే దశకు NSPK చేరుకున్నది. 

రష్యాపై ఆంక్షలను సంజ్ఞగా/సందేశంగా స్వీకరించిన చైనా సైతం తన సొంత చెల్లింపుల వ్యవస్ధను -CIPS (చైనా ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టం) – అభివృద్ధి చేస్తున్నది. ఈ వ్యవస్ధ దన్నుతో స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధగా తనను రుజువు చేసుకునేందుకు చైనా ప్రయత్నం చేసి సఫలం అవుతున్నది. అందులో భాగంగా IMF నిర్వహించే వివిధ అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్ లో ఒకటిగా చైనా కరెన్సీ రెన్ మిన్ బి / యువాన్ ను IMF గుర్తించింది.

వచ్చే అక్టోబర్ 1 నుండి IMF నిర్వహించే SDR బాస్కెట్ లో యువాన్ ఉనికిలోకి రానున్నది. SDR అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని అర్ధం. వీటిని అత్యంత భద్రమైన లిక్విడ్ ఆస్తులుగా ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి. ఆయా దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వలలో ఇవి కూడా కలిసి ఉంటాయి. కాబట్టి యువాన్ SDR లో భాగం కావటం చైనా సాధించిన ఆర్ధిక విజయం. కాగా ఈ విజయం చైనా ప్రజల ప్రయోజనాలను, కార్మికవర్గం హక్కులను ఫణంగా పెట్టడం ద్వారా మాత్రమే సాధ్యం అయింది.

కస్టమర్ డేటా అమ్మేస్తున్న రిలయన్స్ జియో -ఎనోనిమస్

వచ్చే డిసెంబర్ చివరి వరకు ఉచిత డేటా ఆఫర్ తో 4G మార్కెట్ లో తొక్కిసలాట సృష్టించిన రిలయన్స్ జియో తన అప్లికేషన్స్ ద్వారా సేకరించే యూజర్ (కస్టమర్ల) డేటాను ప్రకటనల కంపెనీలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లుగా హ్యాకర్ గ్రూఫు హ్యాక్టివిస్ట్ సంస్ధ ‘ఎనోనిమస్’ ప్రకటించి సంచలనం సృష్టించింది. 

గూగుల్ కంపెనీ లాగానే భారీ మొత్తంలో ఉచిత సేవలు, ఉచిత యాప్స్ ను యూజర్స్ కు ఇవ్వజూపుతున్న రిలయన్స్ కంపెనీ తన ఉచిత సేవలు వాస్తవానికి మరింత లాభాలు సంపాదించేందుకేనని, తన కస్టమర్ల ప్రయివసీని తాకట్టు పెట్టి మరి అధిక లాభాలు సంపాదించడమే దాని లక్ష్యమని హ్యాక్టివిస్ట్ గ్రూపు వెల్లడి చేసిన వాస్తవాల ద్వారా స్పష్టం అవుతున్నది. 

దేశ వ్యాపితంగా 4G స్పెక్ట్రంలో అత్యధిక భాగాన్ని వేలంలో కొనుగోలు చేసిన రిలయన్స్ కంపెనీ ఇటీవలనే చాలా ఆలస్యంగా 4G కంయూనికేషన్, డేటా సేవలను ప్రారంభించింది. వచ్చి రావడంతోనే కస్టమర్లకు భారీ బొనాంజా ఇస్తున్నట్లు  ప్రకటించింది. ప్రత్యర్థి కంపెనీలు గుక్క తిప్పుకోకుండా చేసింది. రిలయన్స్ జియో ప్రకటించిన పధకంలో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి. 

  1. జీవితాంతం ఉచిత వాయిస్, SMS సేవలు
  2. డిసెంబర్ 31, 2016 వరకు అన్ని సేవలు ఉచితం
  3. జనవరి 1, 2017 నుండి ఇతర కంపెనీల బేస్ డేటా రేటులో జియో డేటా బేస్ రేటు 10 శాతం (1GB = రు. 50/-)

ఈ మూడు అంశాల ప్రధాన లక్ష్యం ఇతర కంపెనీల నుండి కస్టమర్లను భారీ ఎత్తున ఆకర్షించడమే అని చూడగానే అర్ధం అవుతుంది. అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్లు  (యాండ్రాయిడ్, యాపిల్ స్టార్ రెండింటి లోను) ఇప్పటికే వాయిస్, SMS సేవలు ఇచితంగా అందిస్తున్నాయి. కేవలం డేటా ప్రవాహానికి మాత్రమే డబ్బు వసూలు చేస్తున్నాయి. అయితే వాయిస్, SMS సేవలను డేటా మార్కెట్ కు అనుసంధానం చేయడం ద్వారా తమ రెవిన్యూ వసూళ్లు తగ్గకుండా కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. 

థర్డ్ పార్టీ అప్లికేషన్లు  ప్రపంచ వ్యాపితంగా ఉచిత వాయిస్, SMS సేవలు అందిస్తున్న దృష్ట్యా మొబైల్ మార్కెట్ అనివార్యంగా ఆ దిశలోనే నడుస్తున్నది. అనగా ఇండియాలో అధికారిక సర్వీసులు కూడా రేపో, మాపో వాయిస్, SMS లను ఉచితంగా అందించాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ రోజుని ముందుకు జరపడం మాత్రమే రిలయన్స్ జియో చేస్తున్నది తప్ప అది కొత్తగా వినియోగదారులకు చేస్తున్న మేలు ఏమి లేదు. 

ఈ ఉచిత తొక్కిసలాటలో అసలు విషయం మరుగున పడుతోంది. అది: ఉచిత సర్వీసుల మాటున కాటికి వెళ్లిపోతున్న వినియోగదారుల ప్రయివసీ. ఉచితం అని చేప్పేవి ఏవి వాస్తవానికి ఉచితం కాదు. కాకపొతే ఆ డబ్బును కంపెనీలు ఇతర రూపాల్లో వసూలు చేయడం కంపెనీలు, ముఖ్యంగా ఇంటర్నెట్ కంపెనీలు అనుసరిస్తున్న ఎత్తుగడ. 

ఇంటర్నెట్ సేవలు పొందడానికి తప్పనిసరి అవసరం అన్న నమ్మకంతో వినియోగదారులు కంపెనీలు/అప్లికేషన్లు  ఏ వివరం అడిగినా వెనకా ముందు చూడకుండా ఇచ్ఛేస్తున్నారు. T&C పేరుతొ వినియోగదారులు చదవవలసి వచ్చే అనేక పేజీల ప్రయివసీ ఒప్పందాన్ని చదవ లేక దానిని చదవకుండానే యాప్స్ అడిగే అనుమతులు అన్నింటికి వినియోగదారులు ఓ కె చెప్పేస్తున్నారు. దీనినే కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. 

ఈ అనుమతుల్లోనే వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు కూడా యాప్స్ అనుమతి తీసుకుంటున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు మూడో వ్యక్తికీ / సంస్ధకు / కంపెనీకి ఇవ్వబోమని యాప్స్ గట్టి హామీ కూడా ఇస్తాయి. కానీ వాస్తవంలో అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకే, వాటితో వ్యాపారం చేసేందుకే యాప్స్ లేదా కంపెనీలు వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న సంగతిని అడపా దడపా హ్యాకర్లు, విజిల్ బ్లోయర్లు, ప్రయివసీ కార్యకర్తలు వెల్లడి చేస్తూనే ఉన్నారు. 

ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ కంపెనీ కూడా ఇదే పని చేస్తున్నాడని హ్యాక్టివిస్ట్ అనే హ్యాకర్ల సంస్ధ ‘ఎనోనిమస్’ వెల్లడి చేసిన సమాచారం తెలియజేస్తున్నది. రిలయన్స్ జియో కంపెనీ నిర్వహిస్తున్న అప్లికేషన్లు  (యాప్స్) ‘మై జియో’ ‘జియో డయలర్’. ఈ రెండు యాప్స్ సేకరించే వినియోగదారుల వ్యక్తిగత వివరాలను అమెరికా, సింగపూర్ లలోని ప్రకటనల కంపెనీలకు రిలయన్స్ కంపెనీ అమ్మేస్తున్నాడని అనానిమస్ తెలిపింది. ఇండియాలో ఎనోనిమస్ సంస్ధ @redteamin అనే పేరు గల ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కార్యకలాపాలు ప్రకటిస్తుంది. 

అనానిమస్ హ్యాకర్లను తాము ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి వివరాలు కనుక్కున్నామని, సంస్ధ ప్రకటించిన వివరాలను ధృవీకరించుకున్నామని ద హిందూ బిజినెస్ లైన్ పత్రిక తెలిపింది. “RJio వెబ్ సైట్ ను హ్యాక్ చేసి మేము ఈ వివరాలు తెలుసుకున్నాము. టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు వినియోగదారుల వివరాలు రిలయన్స్ కంపెనీ అమ్మేస్తున్నది” అని ఎనోనిమస్ సంస్ధ తెలిపిందని బిజినెస్ లైన్ వివరించింది. 

RJio  కంపెనీ వినియోగదారుల వివరాలను ఏ విధంగా అమ్ముతున్నది తెలియజేస్తూ ఎనోనిమస్ సంస్ధ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా వివరంగా తెలియజేసింది పత్రిక తెలిపింది. వెబ్ సైట్ ను హ్యాక్ చేసే పధ్ధతి గురించి కూడా బ్లాగ్ పోస్ట్ ద్వారా సంస్ధ వివరించినట్లు  తెలుస్తున్నది. 

ఎనోనిమస్ వెల్లడి చేసిన అంశాన్ని రిలయన్స్ కంపెనీ తిరస్కరించింది. తాము అలాంటిది ఏమి చేయడం లేదని తెలిపింది. ఎనోనిమస్ ప్రకటనను ఖండించింది. “వినియోగదారుల వివరాల భద్రతకు, వారి ప్రయివసీకి తాము అత్యంత భద్రతా, ప్రాధాన్యత ఇస్తాము” అని యధావిధి ప్రకటన చేసింది. కంపెనీ అంతకంటే గొప్పగా చెప్పేది ఏమి ఉండదు. వాళ్ళు నిజం చెబుతారని ఆశించడమే దండగ!

రిలయన్స్ జియో అందజేస్తున్న ఉచిత తాయిలాలు చూసి ఆశపడుతున్న వినియోగదారులు ఈ అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఒక్క జియో మాత్రమే కాదు, ఎయిర్ టెల్, ఐడియా, టెలినార్ తదితర ఇతర ప్రయివేటు కంపెనీలు కూడా ఇంతకంటే భిన్నంగా వ్యవహరిస్తామని ఆశించలేము. మనం ఇచ్ఛే వివరాలు సాధ్యమైనంత క్లుప్తంగా ఉంటేనే మేలు. తప్పుడు వివరాలు ఇవ్వగలిగితే ఇంకా మంచిది.

రాఫెలే ఫైటర్: ఫ్రాన్స్ తో ఒప్పందం ఖరారు!

36 రాఫెలే ఫైటర్ జెట్ లను కొనుగోలు చేసేందుకు శుక్రవారం ఫ్రాన్స్ తో ఇండియా ఒప్పందం ఖరారు చేసుకుంది. యూ‌పి‌ఏ హయాంలోనే కుదిరిన ఈ ఒప్పందాన్ని మోడి ప్రభుత్వం ఖరారు చేసింది.

7.87 బిలియన్ యూరోలు చెల్లించి 36 రాఫెలే ఫైటర్ జెట్ యుద్ధ విమానాలని ఇండియా కొనుగోలు చేస్తుంది. మన కరెన్సీలో ఇది రమారమి 58.94 వేల కోట్లకు రూపాయలకు సమానం.

రాఫెలే జెట్, MMRCA తరహా యుద్ధ విమానం. అనగా మీడియం మల్టీ-రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని అర్ధం. రాఫెలేతో నాలుగు ఐరోపా దేశాల (జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ) ఉమ్మడి ఉత్పత్తి అయిన యూరో ఫైటర్ టైఫూన్, బోయింగ్ (అమెరికా) కంపెనీకి చెందిన సూపర్ హార్నెట్, లాక్ హిడ్ మార్టిన్ (అమెరికా) కు చెందిన F-16 ఫాల్కన్, రష్యాకు చెందిన MiG-35, స్వీడన్ కు చెందిన సాబ్ జే‌ఏ‌ఎస్ 39 గ్రిపెన్ లు పోటీ పడ్డాయి.

ఇండియా, యూ‌పి‌ఏ హయాం లోనే, యూరో ఫైటర్, డసాల్ట్ రాఫెలే లను షార్ట్ లిస్ట్ చేసింది. అంతిమంగా రాఫెలే ను ఎంపిక చేసుకుంది. అమెరికా కంపెనీలు రెండింటినీ తప్పించినప్పుడు అమెరికా మండిపడటం కూడా జరిగింది. కానీ ఇండియన్ ఆర్మీ రాఫెలే వైపే మొగ్గు చూపడంతో అదే కాంట్రాక్టు గెలుచుకుంది.

Multi Role of Rafale
Multi Role of Rafale

ఫ్రెంచి రక్షణ మంత్రి జీన్ వేస్ ల డ్రియాన్, భారత రక్షణ మంత్రి మనోహర పరికర్ లు ఒప్పందం పైన ఢిల్లీలో సంతకాలు చేసారు. డసాల్ట్ కంపెనీ సి‌ఈ‌ఓ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఒప్పందంలో 36 ఫైటర్ జెట్ లు, ఆయుధాలు, విడిభాగాలు, మద్దతు మరియు నిర్వహణ… అన్నీ భాగంగా ఉంటాయి.

ప్రస్తుతం జరిగింది ప్రభుత్వాల మధ్య ఒప్పందం మాత్రమే. అసలు కాంట్రాక్టు పైన సంతకాలు జరగాల్సి ఉన్నది. కాంట్రాక్టు సంతకం అయిన 3 యేళ్లకు మొదటి జెట్ మనకు అందుతుంది. 30 నెలల లోపు చివరి ఫైటర్ జెట్ అందాలి. ఒప్పందం ప్రకారం, విమానాల సరఫరా పూర్తయ్యాక, ఏ సమయంలో నైనా కనీసం 75 శాతం విమానాలు (27) ఆపరేషన్ కు సిద్ధంగా ఉండాలి.

అలాగే కాంట్రాక్టు మొత్తంలో సగం విలువని తిరిగి ఇండియాలో పెట్టుబడిగా పెట్టాలని మరో షరతు. దీని అర్ధం సగం వెనక్కి ఇవ్వడం కాదు. కనీసం 30 వేల కోట్ల మేర ఇండియాలో ఎఫ్‌డి‌ఐలు గా రావాలని అర్ధం. ఎఫ్‌డి‌ఐల మోజు ఉన్నోళ్ళకి ఇది గొప్పగా కనిపిస్తుంది. ఎఫ్‌డి‌ఐలు దేశానికి చేస్తున్న నష్టం తెలిసిన వాళ్ళకి మన వేలితో మన కంటినే పొడుచుకోవడంగా అర్ధం అవుతుంది.

ఆరంభంలో 126 ఫైటర్ జెట్ ల కొనుగోలుకి (2007లో) టెండర్ లు ఆహ్వానించారు. చర్చలు వివిధ కారణాలతో కొనసాగుతూ పోవడంతో మోడి ప్రభుత్వం వచ్చిన తోడనే 36 జెట్ లను నేరుగా కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. మిగిలిన 90 జెట్ ల కొనుగోలుని ఇండియాలో తయారు చేయాలన్న షరతుతో కొత్త టెండర్ ఆహ్వానానికి మోడి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.

 

అమెరికన్ ‘నెట్ ఫ్లిక్స్’ కు ప్రవేశం ఇవ్వని చైనా!

అదే భారత పాలకవర్గాలైతే ఎగిరి గంతేసి ఉండేవాళ్లు. చట్టాలు నిర్దేశించిన నియమ నిబంధనలను అన్నింటినీ తుంగలో తొక్కేసి ‘రండి రండి రండి దయ చేయండీ! తమరి రాక మాకెంతో సంతోషం సుమండీ!’ అని పాడుతూ స్వాగత సత్కారాలు పలికేవాళ్లు.

“చైనాలోకి జొరబడడం ఎంతవరకు వచ్చింది?” అని రాయిటర్స్ వార్తా సంస్ధ ‘నెట్ ఫ్లిక్స్ ఇంక్.’ కంపెనీ సి‌ఈ‌ఓ రీడ్ హేస్టింగ్స్ ని అడిగింది. దానికాయన నిరాశగా పెదవి విరిచి “ప్చ్! ఎలాంటి పురోగతి లేకుండా పోయింది” అని పాపం నిస్పృహతో బదులిచ్చాడు.

నెట్ ఫ్లిక్స్ ఇంక్ అంటే అమెరికాకు చెందిన వీడియో స్ట్రీమింగ్ కంపెనీ. హాలీవుడ్ సినిమాలను, టి.వి సీరియళ్లను ప్రసారం చేసే అమెరికా సినిమా ఛానెళ్లు ఉన్నట్లే వాటిని ఇంటర్నెట్ మాధ్యమంలో స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేసేందుకు నెట్ ఫ్లిక్స్ కంపెనీ వెలిసింది.

ఇంటర్నెట్ అంటే ప్రపంచంలో అన్ని చోట్లా ఉంటుంది గనక పెద్దగా పెట్టుబడి లేకుండానే ప్రపంచం లోని నలుమూలలకీ చొరబడి లాభాలు గుంజుకునే వెసులుబాటు నెట్ ఫ్లిక్స్ కి ఉంటుంది.  ఈ కంపెనీకి గత కొంత కాలంగా అమెరికాలో లాభాలు పడిపోతున్నాయి. వృద్ధి మందగించింది. దానితో అది కొత్త మార్కెట్ వెతుకులాటలో పడిపోయింది.

నెట్ ఫ్లిక్స్ వినియోగదారుడికి కంప్యూటర్ అయితే గనక బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఏ ల్యాప్ టాప్ గానీ, టాబ్లెట్ గానీ చివరికి స్మార్ట్ ఫోన్ అయినా సరే, 3G లేదా 4G కనెక్షన్ ఉంటే సరిపోతుంది. నెట్ ఫ్లిక్స్ కి నెలకి ఇంత అని గానీ, సినిమాకి ఇంత అని గాని చెల్లిస్తే దానిని స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేస్తారు.

సినిమాని డౌన్ లోడ్ చేసుకుంటే ఒక రేటు, స్త్రీమింగ్ ద్వారా ఒకసారి మాత్రమే చూడదలిస్తే ఒక రేటు వసూలు చేస్తారు. నెట్ ఫ్లిక్స్ అప్లికేషన్ ని యాండ్రాయిడ్ ఓ‌ఎస్ అయితే గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ లాంటివి అయితే యాపిల్ కంపెనీకి చెందిన ఆప్ స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఈ వ్యవహారంలో నెట్ ఫ్లిక్స్ కంపెనీ పెట్టే పెట్టుబడి దాదాపు ఏమీ ఉండదు. ప్లే స్టోర్, ఆప్ స్టోర్ వాళ్ళకి ఎంతో కొంత ఫీజు చెల్లించడం తప్ప వ్యవస్ధాగత ఖర్చులు దాదాపు నిల్.

ఇలాంటి కంపెనీకి అమెరికాలో వృద్ధి మందగించడంతో చైనా మార్కెట్ పైన కన్ను పడింది. కానీ చైనా అంత తేలికగా పర్మిషన్ ఇవ్వదు. మొదట తన ప్రయోజనం చూసుకున్నాకనే విదేశీ కంపెనీలను అనుమతిస్తుంది. పైసా కూడా పెట్టుబడి తేని నెట్ ఫ్లిక్స్ కి అనుమతి ఇవ్వాల్సిన అవసరం చైనాకు అసలే లేదు. అందుకని కంపెనీకి చైనా ప్రభుత్వం తన షరతులు పాటిస్తేనే అనుమతి ఇస్తాం అని చెబుతోంది.

netflix-logo
Netflix logo

ఇండియాలో ప్రవేశానికి మనవాళ్లు ఎప్పుడో ఒప్పేసుకున్నారు. మన సినిమాలకు గిరాకీ పడిపోతుందనీ, మన సినిమా వాళ్ళ వ్యాపారం దెబ్బ తింటుందనీ తెలిసినా కూడా అడిగిందే తడవుగా పర్మిషన్ ఇచ్చేశారు. హాలీవుడ్ సినిమాల దూకుడుతో అంత స్ధాయిలో సినిమాలు తీయలేని భారతీయ సినిమాలు కొండెక్కుతున్నాయి.

‘రాజుని చూసిన కంటితో మొగుడ్ని చూస్తే మొత్తబుద్ధి అవుతుంది’ అన్నట్లుగా టికెట్ కొని చూసేవాడు కంటికి ఇంపుగా ఉన్న సినిమా చూస్తాడు గానీ ‘మన సినిమా, మనవాళ్లని ప్రోత్సహించాలి’ అనుకోడు కదా! ఇది గ్రహించని సినిమా నిర్మాతలు పైరసీ తమ లాభాల్ని నాశనం చేస్తోందని వాపోతూ, జనం పైన దాడి చేయడం, చిన్న చిన్న వ్యాపారుల మీదికి దండెత్తడం చేస్తున్నారు.

ఆ మధ్య మన హీరో మహేష్ గారు వరంగల్ లో సి‌డి షాపు మీద దాడి చేసి వీర ఫోజు కొట్టడం గుర్తుండే ఉంటుంది. ఈ అరివీర శత్రు భయంకర హీరోలు హాలీవుడ్ సినిమాలని విచ్చలవిడిగా అనుమతించడం పైన ఒక్క ముక్కా మాట్లాడరు. దాదాపు సమస్త భారతీయ భాషలలోకి డబ్బింగ్ చేసుకుని మరీ మార్కెట్ ని కబళిస్తుంటే అదేమని అడిగిన పాపాన పోరు. తమ సమస్త కష్టాలకీ ఉదర పోషణ కోసం కక్కుర్తి పడే చిన్న వ్యాపారుల మీదికి మాత్రం సినిమా హీరోలకు మల్లేనే విరుచుకుపడటం మాత్రం చేతనవుతుంది.

చైనాకు మర్మం తెలుసు గనక, తన మార్కెట్ ని తన కోసం ఎలా భద్రపరుచుకోవాలో తెలుసు గనక నెట్ ఫ్లిక్స్ కి ఏకాఎకిన అనుమతి ఇవ్వడం లేదు. ఆ దేశం స్పెషల్ ఎకనమిక్ జోన్ (సెజ్) లు పెట్టినా కూడా ‘దేశీయ గడ్డ పైన విదేశీ ప్రాంతం లాగా ఉండాలి’ అంటూ వెర్రి మొర్రి చట్టాలు చేయలేదు. తన మానవ వనరులను పెట్టుబడిగా పెట్టి, తన షరతుల ప్రకారమే సెజ్ లు ఏర్పాటు చేసింది. పేరు పొందిన మహా మహా కంపెనీలన్నీ పరుగెట్టుకుని వచ్చేలా చేసింది. యేటేటా వాణిజ్య మిగులు పోగేసుకుంది. ఆ మిగులుతోనే ఆర్ధిక శక్తిగా అవతరించింది.

“లేదు. మేము ఇంకా ఆ విషయంలో పని చేస్తూనే ఉన్నాం. సమస్య ఏమిటి అంటే… ఇప్పటికే ఎప్పటి సమస్యే, ప్రభుత్వ అనుమతి లేదు. చైనాలో ప్రవేశించాలంటే మేము నిర్దిష్ట లైసెన్స్ పొందవలసి ఉంటుంది” అని రాయిటర్స్ ప్రశ్నకు నెట్ ఫ్లిక్స్ కంపెనీ సి‌ఈ‌ఓ సమాధానం ఇచ్చాడు.

మనవాళ్లేమో మన చట్టాలను మనమే ‘లైసెన్స్ రాజ్’ అంటూ అవహేళన చేసుకుని చట్టాలన్నీ రద్దు చేసుకుని, నిబంధనలన్నీ సరళీకరించేసి, గేట్లు బార్లా తెరుచుకుని ‘రండి బాబూ రండి!’ అని ఎలుగెత్తి పిలుస్తున్నారు. ఏం లాభం? మన ప్రభుత్వాలు ప్రజల కొనుగోలు శక్తిని పెంచి ఉంటే ఆ మార్కెట్ కోసం కంపెనీలు పరుగెట్టుకుని వచ్చేవి. కానీ 69 యేళ్ళ స్వాహాతంత్రంలో విదేశాలకు దోచి పెట్టి, అందులో తామూ భాగం పంచుకోవడం తప్ప అశేష ప్రజానీకపు ఆర్ధిక వనరులను అభివృద్ధి చేసిన పాపానికి ఎప్పుడు ఒడిగట్టారు?

చైనాలో 1949లో అక్కడి ప్రజలు నూతన ప్రజాస్వామిక విప్లవం’ ను విజయవంతం చేసుకున్నారు. సోషలిస్టు ప్రభుత్వం 40 యేళ్ళ పాటు పని చేసి ప్రజల ఆర్ధిక శక్తిని ఇనుమడింపజేయడమే కాకుండా శక్తివంతమైన రాజ్య వ్యవస్ధలను, ఆర్ధిక నిర్మాణాలను నిర్మించి పెట్టింది. ఇప్పటి చైనా సక్సెస్ కు పునాది ఆనాటి సోషలిస్టు నిర్మాణం వేసినదే.

ఇండియాలో జరిగింది అది కాదు కదా! ప్రజలు తిరుగుబాటు చేశారు కానీ వాళ్ళు తెల్లవాడి జేబులో ఉన్న కాంగ్రెస్ ని నమ్మారు. వాళ్లేమో ప్రజల తిరుగుబాటుని భద్రంగా దారి మళ్లించి, బ్రిటిష్ ఆర్ధిక దోపిడితో పాటు ఇతర సామ్రాజ్యవాద దేశాల దోపిడి కూడా నిరాఘాటంగా కొనసాగేందుకు దోహదం చేసే ‘అధికార మార్పిడి’కి మాత్రమే ఒప్పుకుని జనం ప్రయోజనాలను నట్టేట ముంచారు.

నెట్ ఫ్లిక్స్ కి ఇండియా ఎగురుకుంటూ అనుమతి ఇవ్వడానికీ, చైనా ఆచితూచి అడుగు వేయడానికి మధ్య తేడా ఇందు వల్లనే ఏర్పడింది.