పాచికలో ఒపెక్ పాత్ర -ద హిందూ…

ప్రపంచ చమురు మార్కెట్ లో సరఫరా, గిరాకీ (డిమాండ్) ల మధ్య సమతూకం నెలకొల్పే ప్రయత్నంలో రోజుకి 700,000 బ్యారెళ్ల మేర చమురు ఉత్పత్తిని ఉమ్మడిగా తగ్గించడానికి అల్జీర్స్ లో జరిగిన అసాధారణ సమావేశంలో చమురు ఎగుమతి దేశాల సంఘం (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్ -ఒపెక్) కుదుర్చుకున్న ఒప్పందం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. రెండేళ్లుగా దిగజారుతున్న ప్రపంచ క్రూడ్ ధరలు మరింత పడిపోకుండా నిలబెట్టడానికి ఈ గ్రూపు నిశ్చయాత్మకమైన చర్యలు తీసుకోవాలని అందరూ అంగీకరిస్తున్నారు. ఈ జారుడు వలన 2014 ఆగస్టు  చివర్లో బ్యారెల్ కు 103 డాలర్లు పలికిన బ్రెంట్ క్రూడ్ ఈ ఏడు సెప్టెంబర్ 1 నాటికి సగానికి పైగా పడిపోయి 45.5 డాలర్లకు చేరింది. అయినప్పటికీ ఉత్పత్తి కోతలకు సంబంధించి విభేదాలతో, వివక్షలతో నిండిన ఒపెక్ సభ్య దేశాల మధ్య అర్ధవంతమైన ఏకాభిప్రాయం ఉన్నది లేనిది అస్పష్టంగానే ఉన్నది -ఈ గ్రూపులో అతి చిన్నదే అయినా సంపన్నవంతమైన పశ్చిమాఫ్రికా దేశం గాబన్ -సంక్షోభాలలో మునిగి తేలుతున్న వెనిజులా, ఇరాన్, సౌదీ అరేబియా లాంటి ముఠాలతో నిండిన పశ్చిమాసియా దేశాలు ఈ గ్రూపులో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఒక్కో దేశం నిర్దిష్టంగా ఉత్పత్తిలో ఎంత కోత విధించుకోవాలన్న అంశాన్ని నవంబర్ లో జరగనున్న సమావేశానికి వదిలివేసినప్పటికీ, 56 ఏళ్ళ వయసు గల ఈ సంస్ధలోని అత్యధిక చమురు ఉత్పత్తి దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు పరిస్ధితి ఎంతటి నిస్పృహాత్మకంగా మారిందో ఈ ఒప్పందం తెలియజేస్తున్నది. గత 8 ఏళ్లలో మొట్టమొదటి సారిగా ప్రకటించిన ఉత్పత్తి కోత, ఒపెక్ లో అతి పెద్ద ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియా అనుసరించిన ‘ఇష్టారీతిన ఉత్పత్తి తీసే’ విధానాన్ని, తాను ప్రధానంగా ఏ ఉత్తర అమెరికా దేశాలనైతే -అమెరికా షేల్ ఉత్పత్తి ప్రయోజనాలతో సహా- లక్ష్యంగా పెట్టుకుని అనుసరించిందో ఆ దేశాలను ఎంతగా నష్టపరిచిందో, తనను కూడా అంతే నష్టపరిందని -బహుశా అంతకంటే ఎక్కువే నష్టపరిచి వుండవచ్చుఁ కూడా- ఆ దేశం పరోక్షంగా అంగీకరించినట్లే.   

అమెరికా బడా షేల్ ఉత్పత్తిదారులు తీవ్ర ప్రతిఘటన ధోరణితో తమ నిర్ణయానికి అంటిపెట్టుకుని ఉండగా -ఈ ఏడు మరిన్ని ఎకరాలలో పెట్టుబడిని విస్తరించారు కూడాను- సౌదీ అరేబియా బడ్జెట్ లో పెద్ద కంత ఏర్పడింది. 2015 లో కోశాగారా లోటు (బడ్జెట్ లోటు) ఆ దేశ జీడీపీ లో 16% గా నమోదు కాగా ఈ ఏడు కాస్త తగ్గి 13% మేర నమోదు కావొచ్చని అంచనాలు వెలువడుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా తన ఖర్చులను తగ్గించుకోక తప్పలేదు; ఉద్యోగుల వేతనాలు, సబ్సిడీలను సైతం అది తగ్గించుకోవలసి వచ్చింది. ఈ సంవత్సరం, గత పదేళ్లలో మొట్టమొదటి సారిగా సౌదీ రాజు విదేశీ రుణాలు -వచ్చే ఐదేళ్ళలో 10 బిలియన్ డాలర్లు- సేకరించేందుకు పూనుకోవలసి వచ్చింది. 2016 లో సౌదీ ఆర్ధిక వృద్ధి 1 శాతానికి నెమ్మదించనున్న నేపథ్యంలో ఆ దేశం తన ఆర్ధిక వ్యవస్ధకు ప్రధాన ఇంజన్ అయిన క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి వైపుకే తిరిగి రావటం తప్ప మరో దారి లేదు. ఈ (మధ్య ప్రాచ్యం) ప్రాంతంలోని ఘర్షణలతో నిండా మునిగి ఉన్నందున -యెమెన్ లో ప్రత్యక్షంగానూ, సిరియాలో పరోక్షంగానూ- ప్రతి బ్యారెల్ చమురుకు మరింత ఆదాయం పిండుకోవాలని, బహుశా సౌదీ పాలకులు నిర్ణయించుకుని ఉండవచ్చు. ఒప్పందంలో ఇరాన్ ని కూడా భాగస్వామిని చేయడం కోసం తక్షణ ఉత్పత్తి కోత నుండి ఇరాన్ కి మినహాయింపు ఇవ్వడానికి ఒపెక్ అంగీకరించినట్లు  తెలుస్తున్నది. చమురు డిమాండ్ గతంలో అంచనా వేసినదాని కంటే వేగంగా క్షీణిస్తుండడంతో చమురు ధరలను పునరుద్ధరించడంలో ఉత్పత్తి కోత చర్య యొక్క విజయం, నిర్ణయాన్ని పాటించడంలో గ్రూఫు సభ్య దేశాల క్రమ శిక్షణ పైనే ప్రధానంగా ఆధారపడి ఉన్నది -గతంలో ఈ క్రమ శిక్షణే లోపించడం గమనించవలసిన విషయం.

*********

రెండేళ్ల నుండి అమెరికా షేల్ గ్యాస్ క్షేత్రాల నుండి చమురు, సహజ వాయువుల నుండి పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నది. అమెరికా ఉత్పత్తి సౌదీ అరేబియాకు పోటీగా మారిందని, అమెరికా షేల్ ఉత్పత్తిని నిరుత్సాహపరిచేందుకు సౌదీ అరేబియా ‘చిత్తానుసారం ఉత్పత్తి తీసే’ ఎత్తుగడను అనుసరిస్తున్నదని అందువల్లనే చమురు ధరలు అమాంతం పడిపోయాయని ద హిందూ సంపాదకీయం చెబుతున్నది. ఈ వాదనలో నిజం పాళ్ళు చాలా తక్కువ. సౌదీ అరేబియాలో చమురు వెలికి తీసున్నది ప్రధానంగా అమెరికా కంపెనీలే. కనుక అమెరికా షేల్ క్షేత్రాల వల్ల నష్టం అంటూ జరిగితే దానివల్ల అమెరికా కంపెనీలే ఎక్కువగా ప్రభావితం అవుతాయి. కనుక చమురు ధరలను ఉద్దేశపూర్వకంగా తగ్గించడంలో అమెరికాకు వ్యతిరేకంగా సౌదీ పాల్పడుతున్న కుట్రదే పాత్ర అని చెప్పడం వాస్తవాలతో పొసగడం లేదు. 

చమురు ధరల పతనం వల్ల సౌదీ అరేబియా బాగా నష్టపోయింది అనడంలో సందేహం లేదు. కానీ ఆ నష్టాన్ని అమెరికా షేల్ క్షేత్రాల కంపెనీలు కూడా అంతే స్ధాయిలో ఎదుర్కొంటున్నాయి. అలాంటప్పుడు కుట్ర నుండి అమెరికాను మినహాయించడం నమ్మదగ్గది కాదు. అది కాక అమెరికా-సౌదీలు నమ్మకమైన మిత్ర దేశాలు. ఇటీవలి కాలంలో అమెరికా ఆర్ధిక శక్తి బలహీన పడుతూ భౌగోళిక రాజకీయాలలో రష్యా-చైనాల ప్రాబల్యం పెరుగుతున్నందున సౌదీ లాంటి దేశాలు అమెరికా శిబిరంలో కొనసాగడమా లేదా అని ఊగిసలాడుతుండడం కూడా ఒక వాస్తవమే. కానీ ఇది ఊగిసలాట వరకే ఉన్నది తప్ప పూర్తిగా శిబిరం మారడం మాత్రం జరగలేదు. ఒక జంఝాటంలో సౌదీ లాంటి దేశాలు ఉండడం నిజమే అయినా, అది పరస్పరం వాణిజ్య కొట్లాటకు దారి తీసే పరిస్ధితిగా మారలేదు. అమెరికాతో వాణిజ్య తగాదా మాములుగా ఉండదు. అమెరికాతో తగాదా వస్తే పశ్చిమ కార్పొరేట్ పత్రికలు నిశ్శబ్దంగా ఉండవు. తగాదా పడుతున్న దేశం పైన ఏడేడు సముద్రాలకు సరిపోని విషాన్ని కుమ్మరిస్తాయి. అలాంటిది అమెరికా-సౌదీ వాణిజ్య తగాదా పైన పశ్చిమ పత్రికలు సాదా సీదా విశ్లేషణలతో సరిపెట్టడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి. 

చమురు ధరల పతనం వెనుక అమెరికా-సౌదీల ఉమ్మడి కుట్ర దాగి ఉన్నది. ఆ కుట్ర లక్ష్యం రష్యాతో పాటు వెనిజులా లాంటి దక్షిణ అమెరికా చమురు ఉత్పత్తి దేశాలు. అమెరికాకు పక్కలో బల్లెంగా మారిన వెనిజులా, చమురు ధరల పతనం వల్ల తీవ్రంగా నష్టపోయింది. ఆ దేశంలో ఆర్ధిక, రాజకీయ, సామాజిక సంక్షోభాలు అత్యంత తీవ్ర స్ధాయిలో కొనసాగుతున్నాయి. అమెరికా అనుకూల ప్రతిపక్షం వెనిజులా ప్రభుత్వాన్ని దాదాపు చక్ర బంధంలో పట్టి ఉంచగలుగుతోంది. పార్లమెంటు ఎన్నికలలో చావెజ్ పార్టీ ఓటమిని సైతం ఎదుర్కొన్నది. ఆ మేరకు అమెరికా కుట్ర లక్ష్యం చాలా వరకు నెరవేరినట్లే. ఒక్క రష్యా మాత్రమే అమెరికా ఊహించినట్లు లొంగి రాలేదు. అందుకు చైనా వాణిజ్య సహకారం మెండుగా తోడ్పడింది. 

పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్ధలో ప్రతీకార చర్యలు అమలు చేసిన వారికే ఎదురు తిరగడం సాధారణం. ప్రపంచ దేశాల మార్కెట్లు పరస్పరం పెనవేసుకుని ఉన్న నేపథ్యంలో ఒక చర్య ప్రభావం అలల వలే (ripple effect ) మల్లి బయలుదేరిన చోటికే తిరిగి వస్తుంది. అమెరికా, సౌదీ అరేబియాలకు చమురు ధరల పతనం ప్రభావం తమ వరకు వస్తుందని తెలియకుండా ఏమి పోలేదు. కానీ ఆ ప్రభావాన్ని, తమకు తాకే లోపు, అధిగమించవచ్చని అవి అంచనా వేసి ఉండవచ్చు. అనగా తాము లక్ష్యంగా  చేసుకున్న చోటికి వెళ్లి తమను తాకే లోపు ప్రత్యర్థి దేశం నష్టపోతాయని, ఆ తర్వాత తమ చర్యలను వెనక్కి తీసుకోవచ్చని అంచనా వేసాయి. ఆ మేరకు, వెనిజులా విషయంలో, వాటి అంచనా తప్ప లేదనే భావించవలసి ఉంటుంది. 

అలాగని అమెరికా – సౌదీల మధ్య పూర్తిగా స్నేహమే ఉన్నదని భావించనవసరం లేదు. పెట్టుబడిదారీ ప్రపంచంలో శాశ్వత శత్రుత్వం, మిత్రత్వం ఉండలేవు. వివిధ శక్తుల మధ్య, శిబిరాల మధ్య పరిస్ధితిని బట్టి ఐక్యత, ఘర్షణలు సహజమే. కనుక పెట్టుబడిదారీ దేశాల మధ్య రీ గ్రూపింగ్ జరుగుతున్న క్రమంలో దాని ప్రభావం అమెరికా-సౌదీల సంబంధాల పైన కూడా పడుతున్నది. అయితే అటువంటి రీ గ్రూపింగ్ పాత్ర చమురు ధరల పట్నంలో అమెరికా-సౌదీల మధ్య ఘర్షణగా మారే విధంగా పని చేసింది అనటానికి తగిన పరిణామాలు ఏవి కనపడలేదు. కనుక ద హిందూ విశ్లేషణలో, పైన చెప్పినట్లు  వాస్తవాల మద్దతు, నామమాత్రంగా కనిపిస్తున్నది.

 

ఎట్టకేలకు చమురు ఉత్పత్తి కోతకు ఒపెక్ నిర్ణయం!

చమురు ఉత్పత్తిలో కోత పెట్టుకునేందుకు చమురు ఉత్పత్తి – ఎగుమతి దేశాల కూటమి OPEC (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్)  నిర్ణయించింది. కూటమి నిర్ణయించిన కోత పరిమాణం స్వల్పమే అయినప్పటికీ ఉత్పత్తి తగ్గించేందుకు ఇన్నాళ్లు సౌదీ అరేబియా నిరాకరించిన నేపథ్యంలో ఈ చర్య తదుపరి చర్యలకు ప్రారంభం అవుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. 

గత నాలుగైదు ఏళ్లుగా చమురు ధరలు అత్యంత అధమ స్ధాయిలో కొనసాగుతున్నాయి. ధరలు ఎంతగా తగ్గినప్పటికీ ఆ తగ్గుదల భారత దేశం లాంటి చోట్ల ప్రజలకు అందకుండా ఆయా కేంద్ర ప్రభుత్వాలే అడ్డు పడ్డాయి. చమురు ధరలు తగ్గిన మేర కస్టమ్స్ సుంకాలు, ఇంకా అనేక తరహా పన్నులు జనం నుండి వసూలు చేశాయి. ఇండియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు పన్నులు మోది ధరల తగ్గుదల కాస్త కూడా జనానికి అందకుండా చేశాయి. 

చమురు ధరలు భారీ మొత్తంలో తెగ్గోయడానికి కారణం భౌగోళిక ఆధిపత్య రాజకీయాలు. మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో తన ఆధిపత్య, సామ్రాజ్యవాద విస్తరణ యుద్ధాలకు, ఎత్తులకు అడుగడుగునా అడ్డు పడుతున్న రష్యా, అమెరికా ల ఆర్ధిక వ్యవస్ధలను నష్టపరిచేందుకు, దక్షిణ అమెరికాలో తన ఆధిపత్యానికి సవాలుగా అవతరించిన వెనిజులా, ఈక్వడార్ తదితర దేశాల ఆర్ధిక వ్యవస్ధలను నాశనం చేసేందుకు సౌదీ అరేబియా, అమెరికా దేశాలు అత్యధిక మొత్తంలో చమురు ఉత్పత్తి మొదలు పెట్టాయి. అమెరికా తన భూభాగంపై షేల్ గ్యాస్ తవ్వకాలు జరుపుతూ మార్కెట్ ని ముంచెత్తింది. దానితో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. రష్యా ఒపెక్ దేశం కానప్పటికీ ఆ ప్రభావాన్ని అనివార్యంగా ఎదుర్కొంటుంది. 

అమెరికా ఆశించినట్లుగానే రష్యా, వెనిజులా, ఈక్వడార్ లు తీవ్ర ఆర్ధిక సమస్య ఎదుర్కొన్నాయి. చైనాతో భారీ చమురు, గ్యాస్ సరఫరా ఒప్పొందాలు చేసుకోవడం ద్వారా రష్యా ఆర్ధిక సమస్యలను అధిగమించే ప్రయత్నం చేసింది. కానీ అమెరికా ఆసించినట్లుగా మధ్య ప్రాచ్యంలో (సిరియా, టర్కీ) గాని, ఉక్రెయిన్ లో గాని అమెరికా అదిలింపులకు లొంగలేదు. వెనిజులా మాత్రం ఇప్పటికీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజల ఆదాయాలు పడిపోయి, దిగుమతులు తగ్గి, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి ప్రజలను అమెరికా అనుకూల ప్రతిపక్షాలు అల్లర్లకు రెచ్చగొట్టే వరకు పరిస్ధితి వెళ్ళింది. 

చమురు ఉత్పత్తి తగ్గితే ఆ మేరకు ధరలు పెరుగుతాయి. తద్వారా రష్యా, వెనిజులా తదితర దేశాల ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయంతో దిగుమతులు పెంచుకుని సరుకుల కొరత (వెనిజులా) తీర్చుకునే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు ప్రకటించిన ఉత్పత్తి కోత అంత ఎక్కువేమీ కాదు. రోజుకు 700,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని మాత్రమే తగ్గిస్తారు. ప్రస్తుత ఉత్పత్తి అంచనా 33.24 మిలియన్ బ్యారెళ్లతో పోల్చితే ఈ తగ్గింపు చాలా తక్కువ. 33.24 మిలియన్ బ్యారెళ్ల నుండి 32.5 మిలియన్ బ్యారెళ్లకు ఉత్పత్తి తగ్గిస్తామని ఒపెక్ కూటమి ప్రకటించింది. 

 

ఉత్పత్తి తగ్గుదలకు ఉన్న మరో ఆటంకం సౌదీ అరేబియా – ఇరాన్ ల మధ్య విభేదాలు. అమెరికా, ఇరాన్ ల మధ్య కుదిరిన ఒప్పందం రీత్యా అంతర్జాతీయ మార్కెట్ లో సాపేక్షికంగా స్వేచ్ఛగా ప్రవేశించే అవకాశం ఇరాన్ కు లభించింది. ఇది సౌదీకి ఇష్టం లేదు. ప్రాంతీయంగా ఇరాన్ ను పోటీదారుగా పరిగణించే సౌదీ అరేబియా ఇజ్రాయెల్, యూరప్, అమెరికాలతో కలిసి ఇన్నాళ్లు కుట్రలు చేసింది. చమురు ఉత్పత్తి తగ్గించాలంటే అది సౌదీ అరేబియా చేయాలని ఇరాన్, కాదు ఇరాన్ చేయాలని సౌదీ పోటీ పెట్టుకున్నాయి. ఈ కారణం కూడా చమురు ధరల్లో, ఉత్పత్తి తగ్గింపులో ప్రతిష్టంభన ఏర్పడేందుకు దారి తీసింది. 

ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ ఏ దేశం ఎంత తగ్గించాలి అన్నది ఇంకా నిర్ణయించలేదు. వచ్చే నవంబర్ లో మరో సారి సమావేశమై నిర్ణయిస్తామని కూటమి దేశాలు చెబుతున్నాయి. 

చమురు ధరలు పెరిగితే ఇండియా లాంటి చోట్ల ధరలు ఇంకా పెరుగుతాయా? లెక్క ప్రకారం చుస్తే ధరలు పెరిగినంత మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులను తగ్గించి వినియోగదారులకు ధరల్లో తేడా రాకుండా చూడాలి. అలా కాకుండా ధరలు పెంచడానికే మోడీ, బాబు ప్రభుత్వాలు నిర్ణయిస్తే ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కడం ఖాయం. పెట్రోలు ధర లీటర్ కి రు 100 దాటినా ఆశ్చర్యం లేదు. 

ఒపెక్ ప్రకటనతో చమురు ధరలు ఇప్పటికి 5 శాతం పెరిగి బ్యారెల్ కు 48 డాలర్లకు చేరింది. ఒపెక్ దేశాలు ఒక ఒప్పందానికి రావడం పట్ల వాణిజ్య కంపెనీలు సంతోషం ప్రకటిస్తున్నాయి. 8 సం.ల తర్వాత ఒపెక్ కూటమి ఒక మాట మీదికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారి సంతోషం ధరలు పెరిగేందుకు దోహదం చేసింది. ఇరాన్, లిబియా, నైజిరియాలు వాటి గరిష్ట సామర్ధ్యం మేరకు ఉత్పత్తి చేసేందుకు అనుమతిస్తామని సౌదీ ఎనర్జీ మంత్రి ప్రకటించడంతో మార్కెట్ మరింత ఉత్సాహాన్ని పుంజుకుంది. 

ఉత్పత్తి తగ్గింపు సౌదీ అరేబియా ను కూడా నష్టపరిచింది. సౌదీ ఆర్ధిక వ్యవస్ధ స్తంభనకు గురి కాగా 98 బిలియన్ డాలర్ల మేర బడ్జెట్ లోటు ఎదుర్కొంటున్నది. సౌదీ చమురు సంపదలు సౌదీ రాజు సొంతం. దానితో బడ్జెట్ లోటును పూర్తిగా ప్రజల మీదికి నిర్నిరోధంగా తరలిస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు సైతం తగ్గించేశారు. రాజు మాత్రం నష్టాన్ని భరించడం లేదు. కొన్ని విదేశీ ఆస్తుల్ని అమ్మినప్పటికీ వాటిని పూడ్చుకోవటం సౌదీ రాజుకు పెద్ద సమస్య కాదు.  

WTO: అమెరికా చేతిలో ఇండియాకు మరో ఓటమి

సోలార్ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి తలెత్తిన వివాదంలో ఇండియాకు మరో ఓటమి ఎదురయింది. అమెరికాకు అనుకూలంగా WTO ఇచ్చిన తీర్పుపై ఇండియా అప్పీలుకు వెళ్లగా అప్పిలేట్ బోర్డు కూడా అమెరికా వాదనకు మద్దతుగా వచ్చింది. దానితో అమెరికా సోలార్ విద్యుత్ కంపెనీలు ఇండియాలో ముడి సరుకులను వినియోగించి ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేయాలన్న ఇండియా వాదన మరో ఓటమి ఎదుర్కొంది. 

జవహర్ లాల్ నెహ్రు నేషనల్ సోలార్ మిషన్ పధకం కింద కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ప్రోత్సాహాకాలు ప్రకటించింది. ఈ పధకం కింద దేశీయ సోలార్ పరిశ్రమలను ప్రోత్సహించడం మానుకుని ‘పబ్లిక్ ప్రయివేట్ పార్ట్నర్షిప్’ (పీపీపీ) పేరుతొ దొడ్డి దారిన విదేశీ కంపెనీలకు స్వాగతం పలికింది. దానితో ‘ఒంటె గుడారం’ సామెత తరహాలో మొత్తం సోలార్ విద్యుత్ మార్కెట్ ప్రక్రియను తమ చేతుల్లో తీసుకునేందుకు విదేశీ కంపెనీలు ఉపక్రమించాయి. 

అమెరికన్ కంపెనీలు పధకం లోని లొసుగులను ఉపయోగించుకుని సోలార్ విద్యుత్ మార్కెట్ ను చేజిక్కించుకునే కృషిలో నిమగ్నం కావడంతో ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తున్న భారత కంపెనీలు మూసివేతకు గురయ్యే ప్రమాదం ఏర్పడింది. మోజర్ బేర్, ఇండో సోలార్ తదితర కంపెనీలు తమకు ఎదురవుతున్న ప్రతికూల పరిస్ధితుల గురించి కేంద్రానికి మొర పెట్టుకున్నాయి. 

దానితో దేశీయ కంపెనీలకు కొంతయినా తోడ్పడాలన్న ఉద్దేశంతో భారత ప్రభుత్వం కొన్ని షరతులు ప్రవేశపెట్టింది. అమెరికా లేదా ఇతర విదేశీ కంపెనీలు సరఫరా చేసే సోలార్ ప్యానెళ్ల తయారీలో కనీసం 8 శాతం అయినా దేశీయంగా సేకరించిన ముడి సరుకుల ద్వారా ఉత్పత్తి అయి ఉండాలని నిర్దేశించింది. అనగా భారత ప్రభుత్వం లక్శ్యంగా నిర్దేశించిన 1,00,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిలో కేవలం 8,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి భారతీయ సరుకుల ద్వారా తయారయిన సోలార్ విద్యుత్ పరికరాల ద్వారా ఉత్పత్తి కావాలని పేర్కొన్నది. 

ఇది కూడా అమెరికా కంపెనీలకు ఇష్టం లేకపోయింది. ఒకసారి భారతీయ కంపెనీలకు అవకాశం ఇస్తే అవి తమ కంపెనీలకు పోటీగా తయారు అవుతాయని అమెరికా కంపెనీలకు బాగానే తెలుసు. అందుకే, భారత ప్రభుత్వం విధించిన షరతులు WTO ఒప్పందం నిర్దేశించిన వాణిజ్య సూత్రాలకు విరుద్ధం అంటూ WTO కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును విచారించిన WTO విచారణ విభాగం అమెరికా వాదనకు మద్దతు ఇస్తూ తీర్పు ఇచ్చింది. భారత ప్రభుత్వం విధించిన షరతు “విదేశీ కంపెనీలకు కూడా స్వదేశీ కంపెనీల లాగానే చూడాలన్న” సూత్రానికి విరుద్ధంగా ఉన్నదని, కాబట్టి షరతును ఎత్తివేయాలని తీర్పు చెపింది. 

WTO తీర్పుకు వ్యతిరేకంగా ఇండియా అప్పీలుకు వెళ్ళింది. అప్పిలేట్ బోర్డు కూడా అదే తీర్పు చెబుతూ పాత తీర్పును సమర్ధించింది. దానితో ఇపుడిపుడే వృద్ధిలోకి వస్తున్న భారతీయ సోలార్ విద్యుత్ కంపెనీలు అభివృద్ధి చెందడానికి దారులు మూసుకుపోయినట్లు అయింది. ఇక చచ్చినట్లు  కొత్తగా ఉత్పత్తిలోకి ప్రవేశించిన భారతీయ కంపెనీలు, ఇప్పటికే అభివృద్ధి సాధించిన, పెట్టుబడి వనరులు దండిగా కలిగిన అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్ కంపెనీలతో పోటీ పడవలసిన అగత్యం ఏర్పడింది. 

పశ్చిమ కంపెనీలు తమ పెట్టుబడి వనరుల సాయంతో ఆరంభంలో తక్కువ ధరలకు సోలార్ పరికరాలను అందుబాటులోకి తెస్తాయి. దానితో భారతీయ కంపెనీలు అనివార్యంగా అంటాము తమకు లాభదాయకం కాని ధరలకు మార్కెట్ చేయాల్సి వస్తుంది. లాభాలు లేనప్పుడు పరిశ్రమ మూసుకోవడం తప్ప మరో దారి ఉండదు. ఆ విధంగా విదేశీ కంపెనీలు స్వదేశీ కంపెనీల నుండి ఎదురయ్యే పోటీని మోసపూరితంగా తప్పిస్తాయి. పోటీ కంపెనీలు మూత పడ్డాక ఇక మార్కెట్ ప్రక్రియలను అమెరికా, విదేశీ కంపెనీలే శాసిస్తాయి. ఆ కంపెనీలు ఏ ధర చెబితే అదే ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవలసి వస్తుంది. 

ఒక వేళ ప్రతికూల పరిస్ధితులలో కూడా దేశీయ కంపెనీలు నిలదొక్కుకోవచ్చు. మెరుగైన ఉత్పత్తి ప్రక్రియలను కనుగొని, చౌక ధరలకు సోలార్ విద్యుత్ పరికరాలను తయారు చేసే పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుని తద్వారా విదేశీ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగల స్ధితికి అభివృద్ధి కావచ్చు. అటువంటి పరిస్ధితి ఏర్పడితే బహుళజాతి కంపెనీలు మెర్జర్ & అక్విజిషన్ ఎత్తుగడ ద్వారా పోటీని లేకుండా చేసుకుంటాయి. అనగా పోటీ ఇవ్వగల కంపెనీలను తామే కొనుగోలు చేస్తాయి. తగిన ధర కంటే ఎక్కువే చెల్లించి ప్రత్యర్థి కంపెనీలను కైవసం చేసుకుంటాయి. 

కొనుగోలుకు ఒప్పుకోకపొతే ఒప్పుకోక తప్పని పరిస్ధితిని కల్పిస్తాయి. భారత అధికారులను కొనుగోలు చేసి వారి చేతనే ఒత్తిడి తెస్తాయి. లేదా పారిశ్రామిక కుట్రలకు (industrial sabotage) చర్యలకు పాల్పడతాయి. మార్కెటీకరణ కష్టం అయేలా చేస్తాయి. ఈ గొడవంతా ఎందుకు లెమ్మని దేశీయ కంపెనీలు ఇష్టం లేకపోయినా తమ వ్యాపారాన్ని, సంస్ధను బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పేస్తాయి.  

కనీసం 8 శాతం దేశీయ వనరుల నుండి ప్రొక్యూర్ మెంట్ జరిగినా కూడా దేశీయ కంపెనీలకు గ్యారంటీ కలిగిన మార్కెట్ సమకూరుతుంది. దేశీయ కంపెనీలు ఆ కనీస మార్కెట్ తోనే నిలదొక్కుకోగలుగుతాయి. ఆ మాత్రం మార్కెట్ మన కంపెనీలకు ఇవ్వడానికి అమెరికా ఒప్పుకోలేదంటే బహుళజాతి కంపెనీల వ్యూహాలు, ఎత్తుగడలు ఏ స్ధాయిలో పక్కాగా, ఎలాంటి అవకాశం ఇవ్వకుండా అమలు చేస్తాయో ఒక అవగాహనకు రావచ్చు. 

అప్పిలేట్ బోర్డు తీర్పు ఇచ్చిన తర్వాత తీర్పు ఇచ్చిన 15 నెలల లోపు దానిని అమలు చేయాల్సి ఉంటుంది. మరి ప్రత్యేక పరిస్ధితులు ఉన్నట్లయితే ఈ గడువు 18 నెలల వరకు ఉండవచ్చు. కాని పత్రికల కధనం ప్రకారం చూస్తే 15 నెలలకు కూడా అమెరికా కంపెనీలు ఒప్పుకోవని తెలుస్తున్నది. WTO రూలింగ్ ఆయుధం చేసుకుని అమెరికా కంపెనీలు మరింత కఠినంగా వ్యవహరిస్తామని భారత వాణిజ్య అధికారులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. 

జవహర్ లాల్ నెహ్రు నేషనల్ సోలార్ మిషన్ కింద ఉత్పత్తి చేసే విద్యుత్ ను భారత ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కనుక సోలార్ విద్యుత్ బ్యాటరీలు, ప్యానెల్ల ఉత్పత్తి ‘కాంపిటీటివ్ రిలేషన్ షిప్’ కిందకు వస్తుందని, కాబట్టి కనీస మొత్తంలో ముడి సరుకులను దేశీయంగా సేకరించాలన్న WTO షరతులను వర్తింపజేయాలని భారత్ వాదించగా WTO ప్యానెల్ ఈ వాదనకు అంగీకరించలేదు. పధకం ఏదైనప్పటికీ విద్యుత్ అనే సరుకు సదరు షరతుల కిందికి రాదనీ ప్యానెల్ తేల్చింది. 

ఇండియా-అమెరికాల మధ్య తలెత్తిన వివాదాలలో మెజారిటీ అమెరికాకు అనుకూలంగానే పరిష్కారం కావడం ఈ సందర్భంగా గుర్తించవలసిన అంశం. ఒకటి రెండు కేసుల్లో ఇండియాకు అనుకూలంగా తీర్పు వఛ్చినప్పటికీ ఆ తీర్పులను అమలు చేయకుండా భారత అధికారులను, ప్రభుత్వంలో పలుకుబడిని వినియోగించడంలో అమెరికా కంపెనీలు సఫలం అవుతున్నాయి.  

WTO ఒప్పందం ఉనికిలోకి వచ్చ్చిందే మూడో ప్రపంచ దేశాలలో పారిశ్రామిక అభివృద్ధిని నిరోధించే లక్ష్యంతో. కనుక WTO ఫిర్యాదుల వ్యవస్ధను ఉపయోగించుకుని అమెరికా, పశ్చిమ బహుళజాతి కంపెనీలపై పై చేయి సాధించవచ్చుఁ అనుకోవడమే ఒక భ్రాంతి.