Q4 జి‌డి‌పి 4% కు పతనం -అధికారులు

డీమానిటైజేషన్ / పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు చెప్పారు. జి‌డి‌పి మహా అయితే అర శాతం లేకుంటే అంతకంటే తక్కువ మాత్రమే తగ్గుతుందని ఆర్ధిక మంత్రి జైట్లీ నమ్మబలికారు. ప్రతిపక్షాలు, బి‌జే‌పి వ్యతిరేక ఆర్ధికవేత్తలు చెబుతున్నట్లు ఉత్పత్తి భారీగా పడిపోదని హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంచనా వేసినట్లు 2% పతనం కావడం జరగనే జరగదన్నారు.

కానీ కేంద్ర ప్రభుత్వ అధికారుల మాట ఇప్పుడు అందుకు విరుద్ధంగా ధ్వనిస్తున్నది. లేదా కేంద్ర మంత్రులే (ప్రధాని, ఆర్ధిక మంత్రి మొ.వారు) అధికారుల ద్వారా చిన్నగా ఉప్పు అందిస్తున్నారు. నిన్నటి దాకా “అబ్బే, తగ్గే సమస్యే లేదు” అని ఠలాయించిన జైట్లీ ఇప్పుడు హఠాత్తుగా “ప్చ్! తగ్గుతుంది” అని చెబితే విపక్షాలకు ఆయన విందు భోజనం అవుతారు. పత్రికలకు ‘పుల్కాలో చికెన్’ అయిపోతారు. అందుకని చిన్నగా అధికారుల చేత చెప్పించి చిన్న జి‌డి‌పి అంకెకు ఇప్పటి నుండే పత్రికలను, విశ్లేషకులను, కాస్తో కూస్తో పట్టించుకునే జనాన్ని అలవాటు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

రాయిటర్స్ వార్తా సంస్ధతో పేరు చెప్పకుండా మాట్లాడినా ప్రభుత్వ అధికారుల ప్రకారం 2016-17 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4 – జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో భారత దేశ జి‌డి‌పి 4 శాతానికి పడిపోతుంది. మొదటి త్రైమాసికంలో వార్షిక వృద్ధి రేటు 7.1 శాతం నమోదు కాగా, రెండవ త్రైమాసికంలో వార్షిక వృద్ధి రేటు (వాస్తవ త్రైమాసిక వృద్ధి రేటును 4 తో హెచ్చిస్తే అది ఆ త్రైమాసిక కాలానికి వార్షిక వృద్ధి రేటు అవుతుంది) 7.3 శాతం నమోదయింది. మూడో త్రైమాసికంలో ఇది భారీగా పతనమై 3.5 % నమోదు కావచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ నవంబర్ 29 తేదీన ప్రచురించిన విశ్లేషణలో అంచనా వేసింది.

కాగా జనవరి నుండి మార్చి వరకు విస్తరించే నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు కేవలం 4 శాతం మాత్రమే నమోదు కావచ్చని ప్రభుత్వమే అంచనా వేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఫలితంగా ఫిబ్రవరి 1 తేదీన ప్రతిపాదించనున్న కేంద్ర బడ్జెట్ లో పాపులిస్టు చర్యలు ప్రకటించడానికి ప్రధాని మోడీకి అవకాశాలు లేవని వారు సెలవిచ్చారు.

“రైతులకు రుణాల మాఫీ, పేద ప్రజల ఖాతాల లోకి డబ్బు జమ చేయడం లాంటి బిగ్-టికెట్ ఖర్చులకు బడ్జెట్ లో అవకాశం ఉండదు” అని అధికారులు చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

అయితే జి‌డి‌పి లో బడ్జెట్ లోటు వాటా టార్గెట్ అయిన 3.5 శాతం లక్ష్యాన్ని చేరడానికి వీలుగా పెట్టుబడులకు, మౌలిక నిర్మాణాలకు ఖర్చులు కొనసాగించే అవకాశం ఉన్నదని అధికారులు చెప్పారు. 2018 మార్చి నాటికి బడ్జెట్ లోటు జి‌డి‌పి లో 3% ఉండేలా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. మార్చి 2017 నాటికి బడ్జెట్ లోటు జి‌డి‌పిలో 3.5 శాతానికి తగ్గించాలని మోడి ప్రభుత్వం లక్ష్యం. ఈ లక్ష్యం సిద్ధించాలంటే పేద ప్రజల జన్ ధన్ ఖాతాలకు ఎంతో కొంత డబ్బు జమ చేసే లక్ష్యానికి తిలోదకాలు ఇస్తున్నారని కేంద్ర అధికారులు చెబుతున్నారు.

డీమానిటైజేషన్ ద్వారా 3 లక్షల కోట్ల నల్ల ధనాన్ని ఆదా చేసి జన్ ధన్ ఖాతాలలో కనీసం 50 వేలు జమ చేయాలని, తద్వారా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూకుమ్మడిగా ఓట్లు కుమ్ముకోవాలని మోడి పధకం వేశారు. (డీమానిటైజేషన్ – రీమానిటైజేషన్ లు ముగిశాక ఒక్కో జన్ ధన్ ఖాతాలో 50 వేల నుండి లక్ష వరకు మోడి జమ చేస్తారని ఉత్తర ప్రదేశ్ లో బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ తదితర హిందూత్వ కార్యకర్తలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. -ఫ్రంట్ లైన్)

కానీ రద్దయిన 1000/- 500/- నోట్లు మొత్తం 15.4 లక్షల కోట్లకు గాను ఇప్పటికే 14.6 కోట్లు జమ అయ్యాయని ఆర్‌బి‌ఐ నిర్ధారించినట్లుగా కొన్ని పత్రికలు చెప్పాయి. పాత నోట్ల డిపాజిట్ కు ఎన్‌ఆర్‌ఐ లకు జూన్ 2017 వరకు గడువు ఇచ్చారు కనుక ఇది ఇంకా పెరగవచ్చు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వానికి డీమానిటైజేషన్ ద్వారా కేవలం 50 వేల కోట్లు మాత్రమే గిట్టనున్నాయని అధికారులను ఉటంకిస్తూ పత్రికలు చెప్పాయి. ఇంత హడావుడి చేసి, జనాన్ని నానా అగచాట్లకు గురి చేసి మోడి కూడగట్టిన నల్ల ధనం కేవలం 50 వేల కొట్లే అని అధికారికంగా తెలిసాక జనం స్పందన ఏమిటో చూడవలసే ఉన్నది.

నిజానికి 50 వేల కోట్లు కూడా మిగల కూడదు. కేష్ రిజర్వ్ రేషియో కింద ఆర్‌బి‌ఐ వద్ద ఉన్న డబ్బు కూడా కలిపితే 15.4 లక్షల కోట్ల కంటే ఇంకా ఎక్కువే రద్దయిన నోట్లు జమ అయినట్లు తేలాలి. కానీ ఈ లెక్కలను కేంద్రం బైటికి రానివ్వడం లేదు. ప్రతి వారం ఆర్‌బి‌ఐ చేత జమ అయిన పాత నోట్ల మొత్తానికి లెక్క చెప్పించిన కేంద్రం జమలు  ఎక్కువ కావడంతో లెక్కలు చెప్పడం మానిపించింది. అనగా లెక్కలను తారుమారు చేసేపనిలో పెద్దలు మునిగి ఉన్నారని స్పష్టం అవుతోంది. ఎంత తారుమారు చేసినా 14.6 లక్షల కోట్లు జమ అయినట్లు చెప్పక తప్పలేదులా ఉంది.

ఈ 50 వేల కోట్లు బడ్జెట్ లోటు తగ్గించుకోవడానికి జమ చేసి, కొంత డబ్బు పెరిగిన పన్నుల ఆదాయంగా చూపించి (ఈ మేరకు పన్నుల ఆదాయం పెరిగిందని జైట్లీ ఇప్పటికే ప్రకటించారు. ఎంత పెరిగిందో మాత్రం చెప్పలేదు) మొత్తం మీద జనానికి ఇస్తానన్న దానిని హుళక్కి చేసేస్తున్నారు.

కనుక మోడి ప్రభుత్వం బడ్జెట్ లోటును అనుకున్నట్లుగా తగ్గించేసి ఐ‌ఎం‌ఎఫ్, బహుళజాతి ఫైనాన్స్, రేటింగ్ కంపెనీలను సంతృప్తిపరచడానికే ప్రాధాన్యత ఇస్తున్నది తప్ప పేద ప్రజలకు కాస్తయినా సహాయం చేసే ఉద్దేశం ఏ మాత్రం లేదన్నమాట!

 

నోట్ల రద్దు: సేవలు, తయారీల జీడీపీ పతనం

డీమానిటైజేషన్ ప్రభావం డిసెంబర్ నెల జీడీపీ పైన కూడా తీవ్రంగా పడిందని నిక్కీ PMI సూచిక తెలియజేస్తున్నది. తయారీ రంగం (మాన్యుఫాక్చరింగ్) తో పాటు సేవల రంగం కూడా భారీగా పతనం అయిందని నిక్కీ PMI సూచిక ద్వారా తెలుస్తున్నది. 

PMI అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అని అర్ధం. ఆర్ధిక సర్వే సంస్ధలు ఆయా ఉత్పత్తి రంగాల లోని కంపెనీల మేనేజర్లను సర్వే చేసి సదరు రంగాల ఉత్పత్తి పనితనాన్ని అంచనాల రూపంలో సేకరిస్తాయి. సర్వే వివరాల ద్వారా PMI స్ధాయిని లెక్క కడతాయి. కంపెనీలనే నేరుగా సంప్రదించి సేకరించిన వివరాలు కనుక ఈ సూచిక అంచనాలు, అధికారిక ఫలితాల ప్రకటనతో దాదాపు సరిపోలుతాయి. అందువలన ఆర్ధిక సర్వే సంస్ధల PMI లను ఆర్ధిక విశ్లేషకులు, మార్కెట్ పండితులు, ప్రభుత్వ అధికారులు విశ్వాసం లోకి తీసుకుంటారు. 

PMI సూచిక 50 పాయింట్ల వద్ద భిన్న ధోరణులను ప్రతిబింబిస్తుంది. 50 పాయింట్లకు తక్కువ నమోదు అయితే ఆ రంగంలో జీడీపీ వృద్ధి (growth) లేదా విస్తరణ (expansion) చెందడానికి బదులు కుచించుకున్నదని (contraction) అర్ధం. 50 పాయింట్లకు ఎక్కువగా PMI నమోదైతే ఆ రంగం వృద్ధి చెందిందని లేదా విస్తరించిందని అర్ధం. 

డిసెంబర్ నెలకు గాను భారత సేవల రంగం యొక్క PMI, 46.8 పాయింట్లుగా నమోదు అయిందని నిక్కీ తెలియజేసింది. నవంబర్ నెలలో సేవల రంగం PMI , 46.7 గా నమోదైందని నిక్కీ గత నెలలో తెలిపింది. అనగా నవంబర్ నెలకూ, డిసెంబర్ నెలకూ సేవల రంగం జీడీపీ లో ఏ మాత్రం తేడా లేదు. నవంబరు నెలలో వలెనె డిసెంబర్ లో కూడా సేవల రంగ జీడీపీ పతనం కానున్నది. 

భారత దేశ జీడీపీలో సేవల రంగానిదే అత్యధిక వాటా. 55 శాతం నుండి 60 శాతం వరకూ సేవల రంగం నుండే భారత జీడీపీ సమకూరుతుంది. సాఫ్ట్ వేర్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, వ్యాపార సేవలు, హోటళ్లు, రెస్టారెంట్లు, రియల్ ఎస్టేట్, స్టోరేజి మొ.న రంగాలు సేవల రంగం కిందికి వస్తాయి. డీమానిటైజేషన్ వాళ్ళ హోటళ్లు, రెస్టారెంట్ల వ్యాపారం కుదేలయింది. భీమా రంగంలో చెల్లింపులు, కొత్త వ్యాపారం తీవ్రంగా దెబ్బ తిన్నాయి. బ్యాంకుల్లో డిపాజిట్లు ప్రజల నుండి బ్యాంకులకు చేరడమే తప్ప కొత్తగా ఫైనాన్స్ ఉత్పత్తి జరగలేదు. అనగా కొత్త రుణాల పంపిణి జరగలేదు. ప్రజల లిక్విడిటీని 86% రద్దు చేయడంతో వ్యాపారాలు నడవలేదు. ప్రయాణాలు కొన్ని వాయిదా పడ్డాయి; కొన్ని రద్దయ్యాయి. ఇవన్నీ అనివార్యంగా సేవల రంగం జీడీపీ వృద్ధిని దెబ్బ తీశాయని నిక్కీ ఇండియా సర్వీసెస్ సంస్ధ తెలిపింది. 

సేవల రంగంలోని ఉప విభాగాలు అన్నింటిలో హోటళ్లు, రెస్టారెంట్ల రంగం అత్యధికంగా కుచించుకుపోయిందని నిక్కీ తెలిపింది. సేవల రంగ కుచింపు కేవలం ఒకటి రెండు ఉప అంగాలకు పరిమితం కాలేదని, దాదాపు ఉప అంగాలన్నీ డీమానిటైజేషన్ ప్రభావానికి గురయ్యాయని కనుక ఇది తిరిగి వృద్ధి బాట పట్టడం వెంటనే జరిగేది కాదని నిక్కీ తెలిపింది. 

అనగా కొందరు ఆర్ధిక విశ్లేషకుల అంచనాలను నిక్కీ ధ్రువపరుస్తున్నది. డీమానిటైజేషన్ ప్రభావం స్వల్ప కాలం మాత్రమే ఉంటుందని, వ్యవస్ధలో నోట్ల చెలామణి పుంజుకున్న వెంటనే ఆర్ధిక వృద్ధి తిరిగి గాడిన పడుతుందని ప్రధాని మోడీ, ఆర్ధిక మంత్రి జైట్లీ, వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్ తదితరులు నమ్మ బలికారు. 

అయితే అరుణ్ కుమార్ లాంటి ఆర్ధికవేత్తలు వారి విశ్లేషణతో విభేదించారు. డీమానిటైజేషన్ ప్రభావం ఆర్ధిక వ్యవస్ధ లోతులకు విస్తరించిందని, ఆర్ధిక చక్ర గమనాల గమనాన్ని ఆటంకపరిచి నిలిపివేసింది, అది తిరిగి వేగం పుంజుకోవాలంటే సమయం పడుతుందని వారు చెప్పారు. నిక్కీ కూడా అదే చెబుతున్నది. డీమానిటైజేషన్ ప్రభావం వివిధ ఉత్పత్తి రంగాల వ్యాపితంగా విస్తరించినందున, అవి తిరిగి ఉత్పత్తి సైకిల్ లో ప్రవేశించడానికి సమయం పడుతుందని నిక్కీ స్పష్టం చేసింది. ఆర్ధిక మంత్రి జైట్లీ ఈ అంశాలను పరిగణించక తప్పదు. లేనట్లయితే ఆర్ధిక వ్యవస్ధకు మరింత హాని చేసినవారవుతారు.             

సేవల రంగంతో పాటు ఫ్యాక్టరీ ఉత్పత్తి PMI సూచిక కూడా పతనాన్ని సూచిస్తున్నది నిక్కీ తెలిపింది. ఫలితంగా కీలక రంగాల ఉమ్మడి సూచిక నవంబర్ నెలతో పోల్చితే బాగా తక్కువ నమోదు చేసిందని తెలిపింది. నిక్కీ ఇండియా కాంపోజిట్ PMI ఉత్పత్తి సూచిక నవంబర్ లో 49.1 పాయింట్లు నమోదు కాగా అది డిసెంబర్ నెలలో 47.6 పాయింట్లకు పడిపోయిందని తెలిపింది. 

“మాన్యుఫాక్చరింగ్ PMI తో కూడా కలిపి చూస్తే, భారత జీడీపీ మూడవ క్వార్టర్ లో (అక్టోబర్-నవంబర్-డిసెంబర్ 2016) వృద్ధిని నమోదు చేస్తుంది గాని, అది బాగా తగ్గిపోతుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే సేవల ప్రొవైడర్ల వ్యాపార నమ్మకం (మోడీ తరచూ చెప్పే బిజినెస్ కాన్ఫిడెన్స్) గత 11 సంవత్సరాలలో అత్యల్ప స్ధాయికి పడిపోయింది. కాబట్టి డీమానిటైజేషన్ ప్రభావం నుండి త్వరగా కోలుకోవడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదు” అని నిక్కీ PMI నివేదిక తయారు చేసిన పాలియన్నా డి లిమా చెప్పారని ద హిందూ బిజినెస్ లైన్ పత్రిక తెలిపింది. 

బ్లాక్ మని పై పోరాటం అంటూ అబద్ధాలు చెప్పి, చివరికి ‘క్యాష్ లెస్ ఎకానమీ’ అంటూ ఊదరగొడుతున్న మోడీ, జైట్లీలు తమ తుగ్లక్ చర్య ద్వారా ప్రజలకే కాకుండా భారత ఆర్ధిక వ్యవస్ధకు ఎంతటి కష్టాలు, నష్టం తెచ్చారో ఇప్పటికైనా గ్రహిస్తారా అన్నది అనుమానమే.      

వడ్డీలో మార్పు లేదు, జీడీపీ అంచనా తగ్గింపు

 

RBI జెల్ల కొట్టింది. వడ్డీ రేటు తగ్గింపు కోసం బడా కంపెనీలు, బడా బాబులు ఆశగా ఎదురు చూస్తుంటే వారి ఆశల్ని వమ్ము చేసింది. వడ్డీ రేట్లలో మార్పులు లేవు పొమ్మంది. పైగా 2016-17 సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు విషయమై గతంలో వేసిన అంచనాను తగ్గించేసుకుంది. వృద్ధి రేటు 7.1 శాతం మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. 

ప్రస్తుతం రేపో రేటు (స్వల్ప కాలిక వడ్డీ రేటు – దీనినే క్లుప్తంగా బ్యాంకు రేటు / వడ్డీ రేటు అంటారు) 6.25% గా ఉంది. దీనిని 6%కి తగ్గిస్తారని కొన్ని సంస్ధలు అంచనా వేస్తె మరి కొందరు 5.75% కి తగ్గిస్తారని అంచనా వేశారు. ఎవరి అంచనా కూడా నిజం కాలేదు. 

వీరి అసలు, అంచనాకు ప్రధాన కారణం బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున డిపాజిట్లు ఉండడం (12.6 లక్షల కోట్లు జమ అయినట్లు బ్లూమ్ బర్గ్ వార్తా సంస్ధ చెప్పింది. 11.55 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ అయినట్లు   ఈ రోజు RBI తన సమీక్షా ప్రకటనలో పేర్కొంది.) డబ్బు చలామణి తగ్గిపోవడం, కనుక ధరలు తగ్గడం. 

వడ్డీ రేటు యధాతధంగా కొనసాగించడానికి RBI చెప్పిన కారణాలు: అమెరికా ఎన్నికల అనంతరం ప్రపంచంలో నెలకొన్న పరిస్ధితులు; ఇంట నెలకొన్న ఆందోళనకరమైన ద్రవ్య (ఫైనాన్షియల్) పరిస్ధితులు; రెండో క్వార్టర్ లో ప్రపంచ జీడీపీ వృద్ధి రేటు తక్కువగా నమోదు కావడం. 

భారత బ్యాంకుల్లో భారీగా ద్రవ్య నిల్వలు చేరినప్పటికీ “ఇంట నెలకొన్న ఆందోళనకరమైన ద్రవ్య (ఫైనాన్షియల్) పరిస్ధితుల”ను వడ్డీ రేటు తగ్గించకపోవడానికి కారణాల్లో ఒకటిగా చెప్పడం అంటే ఏమిటి అర్ధం? వడ్డీ రేట్లు తగ్గుతాయని, తేలికగా రుణాలు అందుబాటులోకి వస్తాయని, పెట్టుబడులు వృద్ధి అవుతాయని, కొత్త ఉద్యోగాలు వఛ్చి ఉపాధి పెరుగుతుందని కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు చెప్పిన మాటలు నిజాలు కావా? 

డీమానిటైజేషన్ వలన జీడీపీ పెద్దగా ఏమి పడిపోదని, మహా అయితే 0.2 తగ్గుతుందని ఇదేమంత విషయం కాదని బీజేపీ నేతలు చెబుతూ వచ్చారు. ఛానెళ్ల  చర్చల్లో బీజేపీ ప్రతినిధులు కూడా ఇదే చెప్పారు. అయితే జీడీపీ వృద్ధి రేటు ముందు అనుకున్నట్లు 7.6 % కాకుండా  7.1 శాతంగా నమోదు అవుతుందని సమీక్షా ప్రకటనలో RBI తెలిపింది. ఈ తగ్గుదలకు డీమానిటైజేషన్ కారణం అని కూడా చెప్పింది. ఇక్కడ కూడా బీజేపీ నేతల లెక్క తప్పింది.        

“వడ్డీ రేటు యధాతధంగా కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది” అని RBI ప్రకటించింది. అనగా RBI నిర్ణయంలో కేంద్ర ప్రభుత్వం చొరబడిందని చెప్పవచ్చని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

“దొంగ నోట్లు, నల్ల డబ్బు, టెర్రరిజం ఫైనాన్సింగ్ లను అరికట్టేందుకుకే డీమానిటైజేషన్ ప్రక్రియ చేపట్టారని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు” అని RBI గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఇది వింత ప్రకటన. RBI గవర్నర్ చెప్పవలసింది తాము చేపట్టిన డీమానిటైజేషన్ చర్యకు కారణాలు ఏమిటన్నది గాని ప్రజలు ఏమనుకుంటున్నారన్నది కాదు. జనం ఏమి అనుకుంటున్నారో జనానికి చెప్పాల్సిన బాధ్యత RBI గవర్నర్ కి ఎవరు అప్పజెప్పారు? 

ఆయన బ్యూరోక్రాట్ అధికారి. చట్టబద్ధంగా ఆయన కొన్ని విధులు నిర్వర్తించాలి. అంతవరకే ఆయన ప్రకటన పరిమితం కావాలి. జనం మదిలోని భావాలను కనిపెట్టి ద్రవ్య సమీక్షా విధానంలో ప్రకటించటం ఆయన విధి కాదు. అయినా ఆయన జనం గురించి చెప్పారంటే అది రాజకీయ నాయకులు ప్రేరేపించిన ప్రకటనను విడుదల చేశారని అర్ధం అవుతున్నది.    

రాజకీయ నాయకులు లేదా కేంద్ర ప్రభుత్వమూ మరియు మంత్రులు RBI విధుల్లోకి చొరబడి ఆ సంస్ధ ప్రకటనలను కూడా ప్రభావితం చేయడం దేశ ఆర్ధిక వ్యవస్ధకు ఎంతమాత్రం మంచిది కాదు. ప్రజలకు అసలే మంచిది కాదు.