అచ్ఛే దిన్ కనుచూపు మేరలో లేవు -మూడీస్

ప్రధాన మంత్రి మోడీ హామీ ఇఛ్చిన అచ్ఛే దిన్ ఎప్పటికి సాకారం అవుతాయని భారత ప్రజలు మాత్రమే అడగడం లేదు. అంతర్జాతీయ రేటింగ్ కంపెనీలు కూడా అదే మాట అడుగుతున్నాయి. 

అయితే భారత ప్రజలు కోరే మంచి దినాలు, రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు ఒకటి కావు. పైగా పరస్పర విరుద్ధం. రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు వస్తేనేమో అవి ప్రజలకు చెందిన ఖనిజ, నీటి, మానవ వనరులను అన్నింటిని దోచి విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పగిస్తాయి. భారత జనానికి మంచి దినాలు వస్తేనేమో వనరులు జనానికి ఉపయోగపెడతాయి. అనగా ప్రభుత్వ కంపెనీలు పెరుగుతాయి; ఉద్యోగాలు పెరుగుతాయి; ప్రయివేటీకరణ వెనక్కి వెళుతుంది; ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీలు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్ధలు పెరుగుతాయి.

క్రెడిట్ సుయిస్, స్విట్జర్లాండ్ కి చెందిన రేటింగ్ కంపెనీ. దాని పని బహుళజాతి కంపెనీలకు, ముఖ్యంగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు, కంపెనీలకు, బ్యాంకులకు, ద్రవ్య సంస్ధలకు రేటింగులు ఇవ్వడం. ఇతర ద్రవ్య వ్యాపారాలు కూడా ఆ సంస్ధ నిర్వహిస్తుంది గాని రేటింగ్ కి అది పేరు పొందింది. మంగళవారం ఒక నివేదిక వెలువరిస్తూ  ఆ కంపెనీ మోడీ హామీ ఇఛ్చిన సంస్కరణలు పని చేయడం మొదలయిందని పేర్కొంది. కానీ మూడీస్ దానిని నిరాకరించింది.  

ఆర్ధిక సంస్కరణలను లేదా నూతన ఆర్ధిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేదని కదా అమెరికా, పశ్చిమ దేశాలు మోడీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది! ఇప్పుడు అవి మోడీ పైన కూడా పెదవి విరిచేస్తున్నాయి. 

మూడీస్ కంపెనీ మంగళవారం మరో నివేదిక వెలువరించింది. ఓ రోజు క్రితం బ్యాంకుల పరిస్ధితి మెరుగు పడుతున్నదని చెప్పిన మూడీస్, ఆర్ధిక వ్యవస్ధ రేటింగ్ పెంచాలి అంటే మరో ఏడు లేదా ఏడున్నర ఆగాలన్నది. నెగిటివ్ గా చెప్పకుండా నెగిటివ్ సందేశం ఇచ్చిందన్నట్లు! “ఇండియా ఆరోగ్యకరమైన వృద్ధి నమోదు చేయాలంటే మరిన్ని బలహీనతలను అధిగమించాల్సి ఉన్నది” అన్న ముక్క మాత్రం స్పష్టంగా చెప్పింది.

క్రెడిట్ సుయిస్ కంపెనీ కాస్త అనుకూలంగా చెప్పింది. “మోడీ విధానాలు ఖాళి వాగ్దానాలు కాదు. వాటిని అమలు చేసేందుకు గట్టి కృషి జరుగుతోంది. ఎట్టకేలకు ఇండియా ఫైరింగ్ మొదలు పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి” అని క్రెడిట్ సుయిస్ నివేదిక తెలిపింది. “కంపెనీలు ప్రభుత్వం నుండి సానుకూల అంశాలు చూస్తున్నాయి. (స్వదేశీ) పక్షపాతం లేకుండా ‘లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్’ ను విదేశీ కంపెనీలకు ఇస్తున్నారు. స్పష్టమైన విధానాలు అమలు చేస్తున్నారు. మంత్రిత్వ శాఖలు త్వరితగతిన తమను తాము రుజువు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు” అని సదరు నివేదిక పేర్కొంది. 

మూడీస్ ఇందుకు విరుద్ధంగా పేర్కొంది.   

“ఆర్ధిక వ్యవస్ధలో బలహీనత కొనసాగుతోంది. ప్రభుత్వ సావరిన్ రేటింగ్ (ప్రభుత్వం తీసుకునే అప్పుల రేటింగ్) పెంచాలంటే మరింత పురోగతి కావాలి. మరిన్ని సాక్షాలు కావాలి. వచ్ఛే ఒకటి, రెండు ఏళ్లలో అవి కనపడాలి” అని మూడీస్ కంపెనీ అధికారి మేరీ డిరోన్, ఓ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేసింది. 

“వేగవంతమైన ఫిస్కల్ విధానాలు అమలు చేస్తున్నట్లు మరింత సాక్షం కావాలి. మరిన్ని స్పష్టమైన సంస్కరణలు, బ్యాంకింగ్ రంగం ఆస్తుల క్వాలిటీ మెరుగుపరుస్తామన్న నిశ్చయం కావాలి” అని ఆమె పేర్కొంది.   

“సంస్కరణల అమలులో ప్రగతి కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రయివేటు రంగం పెట్టుబడులు ఇంకా బలహీనంగా ఉన్నందున రేటింగ్ అప్ గ్రేడ్ చేయాలంటే ఇంకా ఆగాలి. బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గుర్తించడం మొదటి అడుగు. కానీ గుర్తించినంతనే సరిపోదు. వాటిని మెరుగుపరచాలి” అని మూడీస్ అధికారి పేర్కొంది.   

ఇతర స్వతంత్ర పరిశీలకులు కూడా మూడీస్ తో ఏకీభవిస్తున్నారు. Frontline పత్రికకు కాలమ్ రాసే సి పి చంద్ర శేఖర్ “గతం కంటే పరిస్ధితి మెరుగుపడింది అనడానికి కారణాలు ఏమి లేవు. జీడీపీ డేటా పైన ఇప్పటికి అనుమానాలు ఉన్నాయి. బ్యాంకుల్లో భారీ నిరర్ధక ఆస్తులు రుణాల స్వీకరణను దెబ్బ తీస్తాయి. ఫలితంగా డిమాండ్ పడిపోతుంది” అని చెప్పారు. 

“అలాగే, ద్రవ్యోల్బణం ఎప్పుడూ పరిమిత రేంజిలో లేదు. గ్లోబల్ ఆర్ధిక వ్యవస్ధ మందగించడం వలన మన ఎగుమతులు పడిపోతున్నాయి. దిగుమతులు కూడా పడిపోతున్నందున అది కనిపించడం లేదంతే” అని తెలిపారు చంద్ర శేఖర్. 

మోడీ విధానాలు పని చేస్తున్నాయని చెప్పే స్వతంత్ర పరిశీలకులు కూడా ఉన్నారు. అయితే వారి పరిశీలన కంపెనీలకు అనుకూలం కాగా, సి పి చంద్ర శేఖర్ పరిశీలనలో కాస్త ప్రజల పక్షపాతం వున్నది. 

క్రెడిట్ సుయిస్ చెప్పినట్లు  అచ్ఛే దిన్ వచ్ఛేసినా ప్రజలకు గడ్డు కాలమే. మూడీస్ కొన్నేళ్లు ఆగాలని చెప్పినా దానర్ధం ‘ముందుంది ముసళ్ల పండగ’ అనే అర్ధం. విదేశీ కంపెనీలు ‘శెభాష్’ అంటే ప్రోత్సాహం ఇఛ్చినట్లు! ‘ప్చ్!’ అని పెదవి విరిస్తే “ఇంకా చేయాలి’ అని హెచచరించినట్లు! వాళ్ళు ఏ మాట చెప్పినా జనానికి మాత్రం మూడినట్లే అర్ధం!  

సంక్షోభాన్ని దాటుతున్న భారత బ్యాంకులు -మూడీస్

భారత బ్యాంకింగ్ రంగం ఎన్‌పి‌ఏ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో పురోగమన బాటలో వెళుతోందని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ మూడిస్ చెప్పింది.

రఘురాం రాజన్ నేతృత్వం లోని ఆర్‌బి‌ఐ బ్యాంకులపై విధించిన కొత్త నిబంధనతో బ్యాలన్స్ షీట్ల నుండి మాయం అయిన మొండి బాకీలన్నీ ప్రత్యక్షం తిరిగి పుస్తకాల్లో అయ్యాయి. దానితో భారతీయ బ్యాంకులు అమాంతం మొండి బాకీల సంక్షోభంలో పడినట్లు లోకానికి తెలిసి వచ్చింది.

గతంలో మొండి బాకీలను లేదా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ను బ్యాలన్స్ షీట్ లో చూపించకుండా దాచి పెట్టే వెసులుబాటు ఉండేది. దానివల్ల మొండి బాకీలను బ్యాలన్స్ షీట్ లో చూపేవారు కాదు. ఫలితంగా బ్యాంకు బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తోందని చూపించేవారు. మొండి బాకీ కాస్తో కూస్తో వసూలైతే అప్పుడే లాభంగా పుస్తకంలో చూపేవారు.

ఈ వెసులుబాటు రుణాల ఎగవేతదారులకు గొప్ప వరం అయింది. (అసలు వాళ్ళకు వరం ఇవ్వడం కోసమే బాకీలు దాచిపెట్టే దారుణాన్ని ప్రారంభించారన్న ఆరోపణలూ ఉన్నాయి.) పుస్తకాలలో కనపడని బాకీలు వసూలు చేయాలన్న ధ్యాసే ఉండేది కాదు. పొరబాటున వసూలు అయినవి పోగా మిగిలిన మొండి బాకీలను కొన్నేళ్ళ తర్వాత రద్దు చేసేసేవాళ్ళు. అప్పు రద్దు చేస్తే బాకీదారులకు వరమే కదా!

రఘురాం రాజన్ ఈ వెసులుబాటు లేకుండా చేశారు. ఎన్‌పి‌ఏ లు అన్నింటినీ పుస్తకాల్లో చూపాల్సిందే అని నిబంధన విధించారు. దానితో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. భారత బ్యాంకుల సంక్షోభం గురించి పశ్చిమ పత్రికలు కూడా మాట్లాడటం మొదలెట్టాయి.

రఘురాం రాజన్ చర్య ఫలితాన్ని తెలుసుకోవాలంటే ఒక అంశాన్ని చూడొచ్చు. 2015 మార్చి నాటికి మొత్తం రుణాల్లో మొండి బాకీలు 4.6 శాతం ఉండేవి. కొత్త నిబంధన విధించాక అది ఈ యేడు జూన్ నాటికి అమాంతం 8.7 శాతానికి పెరిగింది (ఆర్‌బి‌ఐ).  దాదాపు రెట్టింపు అయిందన్నమాట!

రీ షెడ్యూల్ చేసిన రుణాలు, వాయిదా వేసిన రుణాలు కూడా కలిపితే మొత్తం బాకిల్లో మొండి బాకీలు, ఈ యేడు జూన్ చివరి నాటికి, 12 శాతంగా తేలాయి.

ఈ సంక్షోభం నుండి భారతీయ బ్యాంకులు బైట పడుతున్నాయని మూడిస్ ‘సర్టిఫికేట్’ ఇచ్చింది. బ్యాంకుల రేటింగ్ ని ‘నెగిటివ్’ నుండి ‘స్టేబుల్’ కి మార్చినట్లు ప్రకటించింది. ఈ రేటింగు వచ్చే 12 నుండి 18 నెలల దాకా ఉంటుందని హామీ ఇచ్చింది.

ఈ కాలంలో మొండి బాకీల పరిణామం పెరగడం కొనసాగినప్పటికీ, పెరుగుదల రేటు గతం కంటే తక్కువ ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. అందుకే రేటింగ్ ని పెంచింది.

BIS in Switzerland
BIS in Switzerland

బేసెల్ III స్టాండర్డ్ ని చేరుకోవడానికి ఇండియన్ బ్యాంకులు 2019 లోపల మరో 1.2 ట్రిలియన్ రూపాయలు (ట్రిలియన్ = లక్ష కోట్లు) లేదా 18 బిలియన్ డాలర్లు సమీకరించాల్సి ఉంటుందని మూడీస్ తేల్చింది.

బేసెల్ అనేది స్విట్జర్లాండ్ లో ఓ నగరం. ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు బేసెల్ నగరం వద్ద కలుస్తాయి.  ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులకు ప్రమాణాలను నిర్దేశించే ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఈ నగరంలోనే ఉన్నది.

2008-09 నాటి ద్రవ్య ఆర్ధిక సంక్షోభం తర్వాత అటువంటి పరిస్ధితి మళ్ళీ రాకుండా ఉండేందుకు అని చెబుతూ ఈ బి‌ఐ‌ఎస్ సరికొత్త ప్రమాణాలను నిర్దేశించింది. ఆ ప్రమాణాల కలయికని బేసెల్ III గా పిలుస్తారు.
ఈ ప్రమాణాలు సంక్షోభాల నివారణకు అని చెప్పడం పూర్తి వాస్తవం కాదు. వాస్తవం ఏమిటి అంటే ఈ ప్రమాణాల అసలు లక్ష్యం ప్రపంచ వ్యాపిత ద్రవ్య వనరులను ఒక పద్ధతి ప్రకారం సమీకరించి అంతర్జాతీయ ఫైనాన్స్ కేపిటల్ కు సేవ చేసేదిగా మార్చడం. మూడో ప్రపంచ దేశాల ద్రవ్య వ్యవస్ధలు ఈ తరహా సేవ చేయటానికి వీలు లేకుండా వెనకబడి ఉన్నాయి. తమకు అందుబాటులో ఉండటానికి వీలుగా మూడో ప్రపంచ దేశాల ద్రవ్య మార్కెట్ ను రూపొందించుకోవటానికి పశ్చిమ ఫైనాన్స్ కేపిటల్ బేసెల్ III ప్రమాణాలను రూపొందించింది.

బేసెల్ III ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్ధను మార్చేందుకు మొదట 2015 గడువుగా విధించారు. అది సాధ్యం కాదని 2017 కి జరిపారు. అదీ కుదరదని గ్రహించి మార్చి 2019కి జరిపారు. మూడిస్ చెబుతున్న 2019 మార్చి లక్ష్యం ఈ కోణంలో నుండి చూడాలి.