నోట్ల రద్దు: ఇండియా వృద్ధి రేటు తగ్గించిన ఐ‌ఎం‌ఎఫ్

ప్రపంచ కాబూలీవాలా కూడా ఒప్పేసుకున్నాడు. డీమానిటైజేషన్ వల్ల ఇండియా జి‌డి‌పి వృద్ధి రేటు అంచనాను ఐ‌ఎం‌ఎఫ్ కూడా తగ్గించేసుకుంది. 2016-17 ఆర్ధిక సంవత్సరంలో భారత్ జి‌డి‌పి 7.6 శాతం వృద్ధి చెందుతుందని గతంలో అంచనా వేసిన ఐ‌ఎం‌ఎఫ్ ఇప్పుడు దాన్ని 6.6 శాతానికి తగ్గించుకుంది.

“ఇండియాలో ప్రస్తుత సంవత్సరానికి (2016-17) మరియు ఆ తర్వాత సంవత్సరానికి వృద్ధి రేటు అంచనాను వరుసగా 1 శాతం మరియు 0.4 శాతం మేరకు తగ్గిస్తున్నాము. దీనికి ప్రధాన కారణం ఇటీవల ప్రవేశపెట్టిన (పెద్ద) కరెన్సీ నోట్ల ఉపసంహరణ మరియు (నగదు రహిత) మారకం వైపుగా తీసుకున్న చొరవ. వీటి వల్ల వినియోగంలో ప్రతికూల (నెగిటివ్) షాక్ చొప్పించబడింది. చెల్లింపుల్లో ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి”

అని ఐ‌ఎం‌ఎఫ్ ప్రచురించిన “వరల్డ్ ఎకనమిక్ ఔట్ లుక్” నివేదిక పేర్కొంది.

ఆ విధంగా “ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్ధలలో ఒకటి గా మన దేశం ప్రసిద్ధి చెందింది” అని ఇన్నాళ్లూ దేనినైతే ప్రధాని మోడి పదే పదే చెప్పుకుని సంతోషపడుతూ, మనల్నీ సంతోషపడమన్నారో ఆ గొప్ప కిరీటాన్ని దభెల్ మని తానే కిందకు విసిరి కొట్టారు.

ఇండియా వృద్ధి 6.6% నమోదు కావటం అంటే అది చైనా (6.7%) తక్కువ వేగంగా వృద్ధి చెందినట్లే. “చైనా కంటే కూడా మనమే వేగంగా వృద్ధి సాధిస్తున్నాం. ప్రపంచం అంతా దీనిని అంగీకరిస్తోంది” అని కూడా ప్రధాని మోడి అనేకసార్లు చెప్పుకున్నారు. భారత జనానికి చెప్పారు. డీమానిటైజేషన్ పుణ్యమాని ఆ గొప్ప కూడా దక్కకపోవచ్చని ఐ‌ఎం‌ఎఫ్ చెబుతోంది.

చైనా జి‌డి‌పి 2016లో 6.7 శాతం, 2017లో 6.5 శాతం వృద్ధి చెందుతుందని ఐ‌ఎం‌ఎఫ్ తాజా అంచనాలో పేర్కొంది. 2015లో చైనా  జి‌డి‌పి 11 ట్రిలియన్ డాలర్లు. ఇండియా జి‌డి‌పి 2 ట్రిలియన్ డాలర్లు. జి‌డి‌పి పరిణామం పెరిగేకొందీ జి‌డి‌పి వృద్ధి రేటు సహజంగానే తగ్గుతూ ఉంటుంది.

ఎందుకంటే వృద్ధి రేటును లెక్కగట్టే మూల సంఖ్య తక్కువగా ఉంటే వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుంది. మూల సంఖ్య పెద్దదిగా ఉంటే వృద్ధి రేటు తక్కువగా ఉంటుంది. ఇది గణిత శాస్త్రంలో ఇమిడి ఉండే అంతర్గత వాస్తవం.

గత యేడు జి‌డి‌పిని మూల సంఖ్యగా తీసుకుని వృద్ధి రేటును లెక్కిస్తారు. ఉదాహరణకి 2015లో చైనా జి‌డి‌పి 10$ ట్రిలియన్లు, ఇండియా జి‌డి‌పి 2$ ట్రి అనుకుందాం. 2016లో ఇండియా 10% వృద్ధి చెందాలంటే 2.2 ట్రిలియన్ల జి‌డి‌పి నమోదు కావాలి. అనగా 0.2 ట్రిలియన్లు అదనంగా 2016 లో ఉత్పత్తి జరగాలి. అదే చైనా అంతే వృద్ధి రేటు (10%) నమోదు చేయాలంటే 2016లో 11 ట్రిలియన్లకు ఉత్పత్తి పెరగాలి.

అనగా 10% వృద్ధి కోసం ఇండియా జి‌డి‌పి 0.2 ట్రి పెరిగితే సరిపోతుంది. కానీ చైనా జి‌డి‌పి అందుకు 5 రెట్లు (1 ట్రిలియన్) పెరగాలి. మూల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల ఈ అడ్వాంటేజీ ఉంటుంది.

అందువలన “చైనా కంటే మనమే వేగంగా వృద్ధి చెందుతున్నాం” అని గొప్పలు చెప్పుకోవడంలో ఏ మాత్రం రేషనాలిటీ లేదని అర్ధం చేసుకోవచ్చు. వృద్ధి రేటు ప్రజా జీవనం మెరుగుదలలో ప్రతిబింబించినప్పుడే దాని గురించి గొప్పలు చెప్పుకోవడంలో అర్ధం ఉంటుంది. కానీ వాస్తవం అందుకు విరుద్ధం. వృద్ధి రేటుకూ, ప్రజల జీవితాలకు అసలే సంబంధం ఉండదు. ఎందుకంటే జరుగుతున్న వృద్ధి అంతా ధనిక వర్గాలకు చెందినదే గనుక.

కాబట్టి ప్రజలకు సంబంధించినంతవరకు జి‌డి‌పి, వృద్ధి రేటు లెక్కలే ఉత్త అసంబద్ధం. ఆ అసంబద్ధ లెక్కల్లో కూడా డీమానిటైజేషన్ ద్వారా మోడి ప్రభుత్వం ఇండియా పనితనాన్ని దెబ్బ కొట్టింది.

ఎమర్జింగ్ ఎకానమీలు కలిగి ఉన్న దేశాలు అనేక ప్రమాదాలు ఎదుర్కొంటున్నాయని ఐ‌ఎం‌ఎఫ్ పేర్కొంది.

  • అధిక కార్పొరేట్ రుణాలు
  • లాభదాయకత తగ్గుదల
  • బ్యాంకుల బలహీన బ్యాలన్స్ షీట్లు
  • పలుచని విధానపర మద్దతు

ఈ ప్రమాదాల వల్ల ఎమర్జింగ్ ఎకానమీలు ప్రతికూల పరిణామాలు ఎదుర్కొంటున్నాయి. అవి:

  • ఇరుకైన గ్లోబల్ ద్రవ్య పరిస్ధితులు
  • పెట్టుబడి ప్రవాహం వెనక్కి మళ్లింపు
  • బ్యాలన్స్ షీట్ల బలహీనం ఫలితంగా తీవ్ర స్ధాయి విలువ కోత (depreciation)

ఎమర్జింగ్ ఎకానమీలలో ఇండియా కూడా ఒకటి. ప్రముఖమైనది కూడా. పైన పేర్కొన్న ప్రమాదాలు, పరిణామాలు అన్నీ ఇండియాకు వర్తిస్తాయి. అవి ఇప్పటికే కనిపిస్తున్నాయి కూడా.

ఉదాహరణకి భారత కార్పొరేట్ రుణాలు పేరుకుపోయాయి. అవి బ్యాంకుల్లో ఎన్‌పి‌ఏల పెరుగుదలగా, మాల్యాల ఎగవేతలుగా, విదేశాలకు పారిపోవడంగా, ఎన్‌పి‌ఏల రద్దుగా మనకు కనిపిస్తున్నాయి. ఎన్‌పి‌ఏ లు పెరగడం వల్ల బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు ఖరాబు అయ్యాయి. అమెరికా బ్యాంకు రేటు (మన రెపో రేటు) ను వేగంగా పెంచడానికి ఫెడరల్ రిజర్వ్ నిర్ణయించడంతో ఇండియా నుండి ఎఫ్‌ఐ‌ఐలు తరలిపోతున్నాయి. అనగా పెట్టుబడులు వెనక్కి ప్రవహిస్తున్నాయి. ఎఫ్‌డి‌ఐలు ఉరికి పడటం అటుంచి మామూలుగా వస్తున్న దాఖలా కూడా లేదు. వస్తున్నాయని చెబుతున్న ఎఫ్‌డి‌ఐలలో అధిక భాగం మన వాళ్ళు విదేశాల్లో దాచిన నల్ల డబ్బు మారిషస్ రూట్ లో తెల్లధనంగా వస్తున్నదే అని నిపుణులు చెబుతున్నారు. ఇవన్నీ ఐ‌ఎం‌ఎఫ్ పేర్కొన్న ప్రమాదాలు, పరిణామాలే అని గమనించవచ్చు.

మోడి చెప్పే గొప్పలు ‘కింద పడ్డా పై చేయి నాదే’ అని చూపేందుకు పడుతున్న తిప్పలే.

Q4 జి‌డి‌పి 4% కు పతనం -అధికారులు

డీమానిటైజేషన్ / పెద్ద నోట్ల రద్దు ప్రభావం పెద్దగా ఉండదని కేంద్ర మంత్రులు ఇప్పటి వరకు చెప్పారు. జి‌డి‌పి మహా అయితే అర శాతం లేకుంటే అంతకంటే తక్కువ మాత్రమే తగ్గుతుందని ఆర్ధిక మంత్రి జైట్లీ నమ్మబలికారు. ప్రతిపక్షాలు, బి‌జే‌పి వ్యతిరేక ఆర్ధికవేత్తలు చెబుతున్నట్లు ఉత్పత్తి భారీగా పడిపోదని హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంచనా వేసినట్లు 2% పతనం కావడం జరగనే జరగదన్నారు.

కానీ కేంద్ర ప్రభుత్వ అధికారుల మాట ఇప్పుడు అందుకు విరుద్ధంగా ధ్వనిస్తున్నది. లేదా కేంద్ర మంత్రులే (ప్రధాని, ఆర్ధిక మంత్రి మొ.వారు) అధికారుల ద్వారా చిన్నగా ఉప్పు అందిస్తున్నారు. నిన్నటి దాకా “అబ్బే, తగ్గే సమస్యే లేదు” అని ఠలాయించిన జైట్లీ ఇప్పుడు హఠాత్తుగా “ప్చ్! తగ్గుతుంది” అని చెబితే విపక్షాలకు ఆయన విందు భోజనం అవుతారు. పత్రికలకు ‘పుల్కాలో చికెన్’ అయిపోతారు. అందుకని చిన్నగా అధికారుల చేత చెప్పించి చిన్న జి‌డి‌పి అంకెకు ఇప్పటి నుండే పత్రికలను, విశ్లేషకులను, కాస్తో కూస్తో పట్టించుకునే జనాన్ని అలవాటు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

రాయిటర్స్ వార్తా సంస్ధతో పేరు చెప్పకుండా మాట్లాడినా ప్రభుత్వ అధికారుల ప్రకారం 2016-17 ఆర్ధిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (Q4 – జనవరి, ఫిబ్రవరి, మార్చి) లో భారత దేశ జి‌డి‌పి 4 శాతానికి పడిపోతుంది. మొదటి త్రైమాసికంలో వార్షిక వృద్ధి రేటు 7.1 శాతం నమోదు కాగా, రెండవ త్రైమాసికంలో వార్షిక వృద్ధి రేటు (వాస్తవ త్రైమాసిక వృద్ధి రేటును 4 తో హెచ్చిస్తే అది ఆ త్రైమాసిక కాలానికి వార్షిక వృద్ధి రేటు అవుతుంది) 7.3 శాతం నమోదయింది. మూడో త్రైమాసికంలో ఇది భారీగా పతనమై 3.5 % నమోదు కావచ్చని రాయిటర్స్ వార్తా సంస్ధ నవంబర్ 29 తేదీన ప్రచురించిన విశ్లేషణలో అంచనా వేసింది.

కాగా జనవరి నుండి మార్చి వరకు విస్తరించే నాలుగో త్రైమాసికంలో వృద్ధి రేటు కేవలం 4 శాతం మాత్రమే నమోదు కావచ్చని ప్రభుత్వమే అంచనా వేస్తున్నట్లుగా కేంద్ర ప్రభుత్వ అధికారులను ఉటంకిస్తూ రాయిటర్స్ తెలిపింది. ఫలితంగా ఫిబ్రవరి 1 తేదీన ప్రతిపాదించనున్న కేంద్ర బడ్జెట్ లో పాపులిస్టు చర్యలు ప్రకటించడానికి ప్రధాని మోడీకి అవకాశాలు లేవని వారు సెలవిచ్చారు.

“రైతులకు రుణాల మాఫీ, పేద ప్రజల ఖాతాల లోకి డబ్బు జమ చేయడం లాంటి బిగ్-టికెట్ ఖర్చులకు బడ్జెట్ లో అవకాశం ఉండదు” అని అధికారులు చెప్పారని రాయిటర్స్ తెలిపింది.

అయితే జి‌డి‌పి లో బడ్జెట్ లోటు వాటా టార్గెట్ అయిన 3.5 శాతం లక్ష్యాన్ని చేరడానికి వీలుగా పెట్టుబడులకు, మౌలిక నిర్మాణాలకు ఖర్చులు కొనసాగించే అవకాశం ఉన్నదని అధికారులు చెప్పారు. 2018 మార్చి నాటికి బడ్జెట్ లోటు జి‌డి‌పి లో 3% ఉండేలా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యం. మార్చి 2017 నాటికి బడ్జెట్ లోటు జి‌డి‌పిలో 3.5 శాతానికి తగ్గించాలని మోడి ప్రభుత్వం లక్ష్యం. ఈ లక్ష్యం సిద్ధించాలంటే పేద ప్రజల జన్ ధన్ ఖాతాలకు ఎంతో కొంత డబ్బు జమ చేసే లక్ష్యానికి తిలోదకాలు ఇస్తున్నారని కేంద్ర అధికారులు చెబుతున్నారు.

డీమానిటైజేషన్ ద్వారా 3 లక్షల కోట్ల నల్ల ధనాన్ని ఆదా చేసి జన్ ధన్ ఖాతాలలో కనీసం 50 వేలు జమ చేయాలని, తద్వారా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూకుమ్మడిగా ఓట్లు కుమ్ముకోవాలని మోడి పధకం వేశారు. (డీమానిటైజేషన్ – రీమానిటైజేషన్ లు ముగిశాక ఒక్కో జన్ ధన్ ఖాతాలో 50 వేల నుండి లక్ష వరకు మోడి జమ చేస్తారని ఉత్తర ప్రదేశ్ లో బి‌జే‌పి-ఆర్‌ఎస్‌ఎస్ తదితర హిందూత్వ కార్యకర్తలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. -ఫ్రంట్ లైన్)

కానీ రద్దయిన 1000/- 500/- నోట్లు మొత్తం 15.4 లక్షల కోట్లకు గాను ఇప్పటికే 14.6 కోట్లు జమ అయ్యాయని ఆర్‌బి‌ఐ నిర్ధారించినట్లుగా కొన్ని పత్రికలు చెప్పాయి. పాత నోట్ల డిపాజిట్ కు ఎన్‌ఆర్‌ఐ లకు జూన్ 2017 వరకు గడువు ఇచ్చారు కనుక ఇది ఇంకా పెరగవచ్చు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వానికి డీమానిటైజేషన్ ద్వారా కేవలం 50 వేల కోట్లు మాత్రమే గిట్టనున్నాయని అధికారులను ఉటంకిస్తూ పత్రికలు చెప్పాయి. ఇంత హడావుడి చేసి, జనాన్ని నానా అగచాట్లకు గురి చేసి మోడి కూడగట్టిన నల్ల ధనం కేవలం 50 వేల కొట్లే అని అధికారికంగా తెలిసాక జనం స్పందన ఏమిటో చూడవలసే ఉన్నది.

నిజానికి 50 వేల కోట్లు కూడా మిగల కూడదు. కేష్ రిజర్వ్ రేషియో కింద ఆర్‌బి‌ఐ వద్ద ఉన్న డబ్బు కూడా కలిపితే 15.4 లక్షల కోట్ల కంటే ఇంకా ఎక్కువే రద్దయిన నోట్లు జమ అయినట్లు తేలాలి. కానీ ఈ లెక్కలను కేంద్రం బైటికి రానివ్వడం లేదు. ప్రతి వారం ఆర్‌బి‌ఐ చేత జమ అయిన పాత నోట్ల మొత్తానికి లెక్క చెప్పించిన కేంద్రం జమలు  ఎక్కువ కావడంతో లెక్కలు చెప్పడం మానిపించింది. అనగా లెక్కలను తారుమారు చేసేపనిలో పెద్దలు మునిగి ఉన్నారని స్పష్టం అవుతోంది. ఎంత తారుమారు చేసినా 14.6 లక్షల కోట్లు జమ అయినట్లు చెప్పక తప్పలేదులా ఉంది.

ఈ 50 వేల కోట్లు బడ్జెట్ లోటు తగ్గించుకోవడానికి జమ చేసి, కొంత డబ్బు పెరిగిన పన్నుల ఆదాయంగా చూపించి (ఈ మేరకు పన్నుల ఆదాయం పెరిగిందని జైట్లీ ఇప్పటికే ప్రకటించారు. ఎంత పెరిగిందో మాత్రం చెప్పలేదు) మొత్తం మీద జనానికి ఇస్తానన్న దానిని హుళక్కి చేసేస్తున్నారు.

కనుక మోడి ప్రభుత్వం బడ్జెట్ లోటును అనుకున్నట్లుగా తగ్గించేసి ఐ‌ఎం‌ఎఫ్, బహుళజాతి ఫైనాన్స్, రేటింగ్ కంపెనీలను సంతృప్తిపరచడానికే ప్రాధాన్యత ఇస్తున్నది తప్ప పేద ప్రజలకు కాస్తయినా సహాయం చేసే ఉద్దేశం ఏ మాత్రం లేదన్నమాట!

 

15 లక్షలు ఇస్తామని రు. 245 కి దిగారు!

నల్ల డబ్బుకి సంబంధించి ఎన్నికల్లో నరేంద్ర మోడి ఇచ్చిన వాగ్దానం గుర్తుందా?

అధికారం లోకి రావడం తోటే విదేశాల్లో ఉన్న నల్ల డబ్బు వెనక్కి తెప్పిస్తాం అన్నారు. అలా తెప్పించిన డబ్బుని ఉపయోగ పెట్టి ఒక్కో పౌరుడి బ్యాంకు ఖాతాలో రు 15 లక్షలు జత చేస్తాం అన్నారు. అనగా రు. 18 కోట్ల కోట్లు మేర భారతీయులు దాచిన నల్ల ధనం విదేశాల్లో మూలుగుతోంది అని చెప్పారు.

ఇంతదాకా ఆ డబ్బు వెనక్కి తెచ్చే సరైన కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటీ మొదలు పెట్టలేదు. ఆరంభంలో ఓ కమిటీ వేసి చేతులు దులుపుకున్నారు, అంతే. మళ్ళీ అటువైపు చూస్తే ఒట్టు! అసలా హామీ ఆయనకు గుర్తుందో లేదో?!

ఈ రోజు ఆర్ధిక మంత్రి ఓ ప్రకటన చేశారు. తాము ప్రకటించిన ‘(రహస్య) ఆదాయ ప్రకటన పధకం’ (Income Declaration Scheme) కింద ఇప్పటి వరకు 65,250 కోట్ల మేర ఆస్తులను ప్రకటించారని ఆయన చెప్పారు. 64,275 మంది లెక్కలు చూపని నల్ల ఆదాయాన్ని ప్రకటించారని చెప్పారు. అంటే ఒక్కొక్కరు సగటున రు కోటికి కాస్త పైనే నల్ల డబ్బు ప్రకటించారు.

కేవలం ఒక కోటి నల్ల డబ్బు ఉన్నవాళ్ళు “స్వచ్ఛందంగా” ప్రకటించిన నల్ల డబ్బే 65 వేల కోట్లు దాటింది. అది కూడా విదేశాల్లో దాచిన డబ్బు కాదు, ఇండియాలో దాచిన డబ్బు. ఇక వందలు, వేల కోట్ల నల్ల డబ్బు దాచిన వాళ్ళు కూడా ప్రకటిస్తే? దానికి విదేశాల్లో దాచిన డబ్బుని కూడా జత చేస్తే?! ఊహించడం కూడా సాధ్యం కావటం లేదు సుమా!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి లెక్క తప్ప లేదన్నమాట! ఆయన చెప్పిన లెక్క ఏదో నోటి దురదతో చెప్పింది కాదన్నమాట! నిజంగా నిపుణులను కనుక్కుని, విదేశాల్లో నల్ల డబ్బు ఎంత ఉంటుందో అంచనా వేయించే ఆ లెక్క చెప్పారన్నమాట!

జన్ ధన్ పధకం ప్రకటించిన ప్రధాని ప్రతి ఒక్కరికీ ఉచితంగా బ్యాంకు ఖాతా ఉండేలా చేశారు. ఇక ఆయన నల్ల డబ్బు వెనక్కి తెచ్చి ఒక్కో ఖాతాలో రు 10 లక్షలు వేయడమే మిగిలింది. మరి ఆ విదేశీ నల్ల డబ్బు ఎప్పుడు వెనక్కి తెస్తారు?

ఆ మధ్య ఇంటర్నేషనల్ కన్సార్టియమ్ ఆఫ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్స్ పేరుతో పనామా పేపర్లు లీక్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ పేపర్లలో కొందరు భారతీయుల పేర్లు కూడా బైటికి వచ్చాయి. ఆ పేపర్లను మన వాళ్ళు కూడా వెతికారట. వాటిలో 9,000 కోట్ల భారతీయ నల్ల ధనం ఉన్నట్లు తెలిసిందని, ఆ ఖాతాలకు సంబంధించి 50 కేసులు కూడా పెట్టామని అరుణ్ జైట్లీ ప్రకటించారు. అంటే, ఎవరో లీక్ చేస్తే మన వాళ్ళు వెతుకుతారు తప్ప మన ప్రయత్నాలు ఏవీ ఉండవా?

స్విట్జర్లాండ్ బ్యాంకు HSBC మనకి భారతీయుల ఖాతాల పేర్ల జాబితా ఇచ్చింది. యూ‌పి‌ఏ హయాంలోనే ఆ జాబితా మనకు అందింది. దాన్ని బైట పెట్టడానికి యూ‌పి‌ఏ ప్రభుత్వం ఒప్పుకోకపోతే బి‌జే‌పి విమర్శించింది. బి‌జే‌పి ప్రభుత్వం వచ్చింది. అందునా అవినీతి పట్ల చండశాసనుడైన మోడి ప్రధాని అయ్యారు. అయినా వారి పేర్లు బైటపడవేల? బైట పెట్టమని సుప్రీం కోర్టు కోరినా ఎందుకు ఒగ్గడం లేదు?

ఇంతకీ, ఇప్పుడు నల్ల ఆదాయం ప్రకటించిన 64,275 మంది పేర్లు కూడా జైట్లీ గారు ఎవరికీ చెప్పరట! వారి పేర్లు రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు గనక దానిని పాటిస్తామని చెప్పారు. మరి రు 15 లక్షలు ఖాతాలో వేస్తామని ఇచ్చిన హామీ మాట ఏమిటి?

జనానికి ఇచ్చిన హామీలనేమో గంగలో కలిపేస్తారా? కోటీశ్వరులకి ఇచ్చిన హామీలనేమో భద్రంగా నెరవేర్చుతారా? ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వం అనవచ్చునా?

ప్రకటించిన నల్ల ఆదాయాన్ని లెక్కించే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని జైట్లీ చెప్పారు. కాబట్టి ప్రకటించిన మొత్తానికి మరింత డబ్బు జత చేరుతుందని ఆయన సంతోషంగా చెప్పారు.

ఈ మొత్తాన్ని ప్రభుత్వం వసూలు చేస్తుందా? అబ్బే, అదేం లేదు. ప్రకటించిన ఆదాయం పైన పన్ను, అపరాధ రుసుము వసూలు చేసి మిగిలింది ప్రకటించిన వాళ్ళకి ఇచ్చేస్తారు. పన్ను, రుసుము కలిపి 45% వసూలు అవుతుంది. ఆ లెక్కన రు 29,000 కోట్ల పై చిలుకు కేంద్రం బొక్కసంలో చేరుతుంది. దీనిని 120 కోట్ల మందికి పంచితే ఒక్కొక్కరికి జన్ ధన్ ఖాతాలో రు 245/- చేరుతుంది.

కానీ అలా జనం ఖాతాలో వెయ్యడం లేదు. ఆ డబ్బుని ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని జైట్లీ ఘనంగా ప్రకటించారు. కానీ ఆ ప్రజా సంక్షేమం ఏమిటో నిర్దిష్టంగా చెప్పరు. అది రహస్యం! ఇంతోసి దానికి ప్రధాని గారు జైట్లీకి (ట్విట్టర్ లో) కంగ్రాట్స్ చెప్పడం కూడానా?

జనానికి ఇవ్వకపోతే పోయే, ప్రజా సంక్షేమానికి నిజంగా ఖర్చు పెట్టకపోతే మానే. కనీసం ఇక నుండైనా పెట్రోలు రేటు పెరగకుండా చూస్తారా? ఉల్లి, కంది తదితర పప్పులు, వేరు శనగ.. ఇత్యాది రేట్లు పెరగకుండా చూస్తారా? విదేశీ కంపెనీల కోసం మరిన్ని ప్రభుత్వ కంపెనీలని అమ్మకుండా ఉంచి ఉద్యోగాలని ప్రజల కోసం కాపాడతారా? ఎల్‌ఐ‌సి, బ్యాంకులు, పెన్షన్, గ్రాట్యుటీ నిధుల్ని విదేశీ కంపెనీలకి అప్పగించే ఆలోచనల్ని మానేస్తారా?

అబ్బే, అది కుదరదు. కుదరదంటే కుదరదు! కుదరదు గాక కుదరదు!!

కుదరనప్పుడు ‘ప్రజా సంక్షేమానికి ఖర్చు చేస్తాం’ అంటూ ఉత్తుత్తి కబుర్లు ఎందుకు, సొల్లు కాకపోతే?!