సంక్షోభాన్ని దాటుతున్న భారత బ్యాంకులు -మూడీస్

భారత బ్యాంకింగ్ రంగం ఎన్‌పి‌ఏ సంక్షోభాన్ని అధిగమించే క్రమంలో పురోగమన బాటలో వెళుతోందని అంతర్జాతీయ రేటింగ్ కంపెనీ మూడిస్ చెప్పింది.

రఘురాం రాజన్ నేతృత్వం లోని ఆర్‌బి‌ఐ బ్యాంకులపై విధించిన కొత్త నిబంధనతో బ్యాలన్స్ షీట్ల నుండి మాయం అయిన మొండి బాకీలన్నీ ప్రత్యక్షం తిరిగి పుస్తకాల్లో అయ్యాయి. దానితో భారతీయ బ్యాంకులు అమాంతం మొండి బాకీల సంక్షోభంలో పడినట్లు లోకానికి తెలిసి వచ్చింది.

గతంలో మొండి బాకీలను లేదా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ను బ్యాలన్స్ షీట్ లో చూపించకుండా దాచి పెట్టే వెసులుబాటు ఉండేది. దానివల్ల మొండి బాకీలను బ్యాలన్స్ షీట్ లో చూపేవారు కాదు. ఫలితంగా బ్యాంకు బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తోందని చూపించేవారు. మొండి బాకీ కాస్తో కూస్తో వసూలైతే అప్పుడే లాభంగా పుస్తకంలో చూపేవారు.

ఈ వెసులుబాటు రుణాల ఎగవేతదారులకు గొప్ప వరం అయింది. (అసలు వాళ్ళకు వరం ఇవ్వడం కోసమే బాకీలు దాచిపెట్టే దారుణాన్ని ప్రారంభించారన్న ఆరోపణలూ ఉన్నాయి.) పుస్తకాలలో కనపడని బాకీలు వసూలు చేయాలన్న ధ్యాసే ఉండేది కాదు. పొరబాటున వసూలు అయినవి పోగా మిగిలిన మొండి బాకీలను కొన్నేళ్ళ తర్వాత రద్దు చేసేసేవాళ్ళు. అప్పు రద్దు చేస్తే బాకీదారులకు వరమే కదా!

రఘురాం రాజన్ ఈ వెసులుబాటు లేకుండా చేశారు. ఎన్‌పి‌ఏ లు అన్నింటినీ పుస్తకాల్లో చూపాల్సిందే అని నిబంధన విధించారు. దానితో ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నీ ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి. భారత బ్యాంకుల సంక్షోభం గురించి పశ్చిమ పత్రికలు కూడా మాట్లాడటం మొదలెట్టాయి.

రఘురాం రాజన్ చర్య ఫలితాన్ని తెలుసుకోవాలంటే ఒక అంశాన్ని చూడొచ్చు. 2015 మార్చి నాటికి మొత్తం రుణాల్లో మొండి బాకీలు 4.6 శాతం ఉండేవి. కొత్త నిబంధన విధించాక అది ఈ యేడు జూన్ నాటికి అమాంతం 8.7 శాతానికి పెరిగింది (ఆర్‌బి‌ఐ).  దాదాపు రెట్టింపు అయిందన్నమాట!

రీ షెడ్యూల్ చేసిన రుణాలు, వాయిదా వేసిన రుణాలు కూడా కలిపితే మొత్తం బాకిల్లో మొండి బాకీలు, ఈ యేడు జూన్ చివరి నాటికి, 12 శాతంగా తేలాయి.

ఈ సంక్షోభం నుండి భారతీయ బ్యాంకులు బైట పడుతున్నాయని మూడిస్ ‘సర్టిఫికేట్’ ఇచ్చింది. బ్యాంకుల రేటింగ్ ని ‘నెగిటివ్’ నుండి ‘స్టేబుల్’ కి మార్చినట్లు ప్రకటించింది. ఈ రేటింగు వచ్చే 12 నుండి 18 నెలల దాకా ఉంటుందని హామీ ఇచ్చింది.

ఈ కాలంలో మొండి బాకీల పరిణామం పెరగడం కొనసాగినప్పటికీ, పెరుగుదల రేటు గతం కంటే తక్కువ ఉంటుందని మూడీస్ అంచనా వేసింది. అందుకే రేటింగ్ ని పెంచింది.

BIS in Switzerland
BIS in Switzerland

బేసెల్ III స్టాండర్డ్ ని చేరుకోవడానికి ఇండియన్ బ్యాంకులు 2019 లోపల మరో 1.2 ట్రిలియన్ రూపాయలు (ట్రిలియన్ = లక్ష కోట్లు) లేదా 18 బిలియన్ డాలర్లు సమీకరించాల్సి ఉంటుందని మూడీస్ తేల్చింది.

బేసెల్ అనేది స్విట్జర్లాండ్ లో ఓ నగరం. ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలు బేసెల్ నగరం వద్ద కలుస్తాయి.  ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులకు ప్రమాణాలను నిర్దేశించే ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ ఈ నగరంలోనే ఉన్నది.

2008-09 నాటి ద్రవ్య ఆర్ధిక సంక్షోభం తర్వాత అటువంటి పరిస్ధితి మళ్ళీ రాకుండా ఉండేందుకు అని చెబుతూ ఈ బి‌ఐ‌ఎస్ సరికొత్త ప్రమాణాలను నిర్దేశించింది. ఆ ప్రమాణాల కలయికని బేసెల్ III గా పిలుస్తారు.
ఈ ప్రమాణాలు సంక్షోభాల నివారణకు అని చెప్పడం పూర్తి వాస్తవం కాదు. వాస్తవం ఏమిటి అంటే ఈ ప్రమాణాల అసలు లక్ష్యం ప్రపంచ వ్యాపిత ద్రవ్య వనరులను ఒక పద్ధతి ప్రకారం సమీకరించి అంతర్జాతీయ ఫైనాన్స్ కేపిటల్ కు సేవ చేసేదిగా మార్చడం. మూడో ప్రపంచ దేశాల ద్రవ్య వ్యవస్ధలు ఈ తరహా సేవ చేయటానికి వీలు లేకుండా వెనకబడి ఉన్నాయి. తమకు అందుబాటులో ఉండటానికి వీలుగా మూడో ప్రపంచ దేశాల ద్రవ్య మార్కెట్ ను రూపొందించుకోవటానికి పశ్చిమ ఫైనాన్స్ కేపిటల్ బేసెల్ III ప్రమాణాలను రూపొందించింది.

బేసెల్ III ప్రమాణాలకు అనుగుణంగా బ్యాంకింగ్ వ్యవస్ధను మార్చేందుకు మొదట 2015 గడువుగా విధించారు. అది సాధ్యం కాదని 2017 కి జరిపారు. అదీ కుదరదని గ్రహించి మార్చి 2019కి జరిపారు. మూడిస్ చెబుతున్న 2019 మార్చి లక్ష్యం ఈ కోణంలో నుండి చూడాలి.