ఎట్టకేలకు చమురు ఉత్పత్తి కోతకు ఒపెక్ నిర్ణయం!

చమురు ఉత్పత్తిలో కోత పెట్టుకునేందుకు చమురు ఉత్పత్తి – ఎగుమతి దేశాల కూటమి OPEC (ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్ పోర్టింగ్ కంట్రీస్)  నిర్ణయించింది. కూటమి నిర్ణయించిన కోత పరిమాణం స్వల్పమే అయినప్పటికీ ఉత్పత్తి తగ్గించేందుకు ఇన్నాళ్లు సౌదీ అరేబియా నిరాకరించిన నేపథ్యంలో ఈ చర్య తదుపరి చర్యలకు ప్రారంభం అవుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. 

గత నాలుగైదు ఏళ్లుగా చమురు ధరలు అత్యంత అధమ స్ధాయిలో కొనసాగుతున్నాయి. ధరలు ఎంతగా తగ్గినప్పటికీ ఆ తగ్గుదల భారత దేశం లాంటి చోట్ల ప్రజలకు అందకుండా ఆయా కేంద్ర ప్రభుత్వాలే అడ్డు పడ్డాయి. చమురు ధరలు తగ్గిన మేర కస్టమ్స్ సుంకాలు, ఇంకా అనేక తరహా పన్నులు జనం నుండి వసూలు చేశాయి. ఇండియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు పన్నులు మోది ధరల తగ్గుదల కాస్త కూడా జనానికి అందకుండా చేశాయి. 

చమురు ధరలు భారీ మొత్తంలో తెగ్గోయడానికి కారణం భౌగోళిక ఆధిపత్య రాజకీయాలు. మధ్య ప్రాచ్యం (పశ్చిమాసియా) లో తన ఆధిపత్య, సామ్రాజ్యవాద విస్తరణ యుద్ధాలకు, ఎత్తులకు అడుగడుగునా అడ్డు పడుతున్న రష్యా, అమెరికా ల ఆర్ధిక వ్యవస్ధలను నష్టపరిచేందుకు, దక్షిణ అమెరికాలో తన ఆధిపత్యానికి సవాలుగా అవతరించిన వెనిజులా, ఈక్వడార్ తదితర దేశాల ఆర్ధిక వ్యవస్ధలను నాశనం చేసేందుకు సౌదీ అరేబియా, అమెరికా దేశాలు అత్యధిక మొత్తంలో చమురు ఉత్పత్తి మొదలు పెట్టాయి. అమెరికా తన భూభాగంపై షేల్ గ్యాస్ తవ్వకాలు జరుపుతూ మార్కెట్ ని ముంచెత్తింది. దానితో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. రష్యా ఒపెక్ దేశం కానప్పటికీ ఆ ప్రభావాన్ని అనివార్యంగా ఎదుర్కొంటుంది. 

అమెరికా ఆశించినట్లుగానే రష్యా, వెనిజులా, ఈక్వడార్ లు తీవ్ర ఆర్ధిక సమస్య ఎదుర్కొన్నాయి. చైనాతో భారీ చమురు, గ్యాస్ సరఫరా ఒప్పొందాలు చేసుకోవడం ద్వారా రష్యా ఆర్ధిక సమస్యలను అధిగమించే ప్రయత్నం చేసింది. కానీ అమెరికా ఆసించినట్లుగా మధ్య ప్రాచ్యంలో (సిరియా, టర్కీ) గాని, ఉక్రెయిన్ లో గాని అమెరికా అదిలింపులకు లొంగలేదు. వెనిజులా మాత్రం ఇప్పటికీ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజల ఆదాయాలు పడిపోయి, దిగుమతులు తగ్గి, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయి ప్రజలను అమెరికా అనుకూల ప్రతిపక్షాలు అల్లర్లకు రెచ్చగొట్టే వరకు పరిస్ధితి వెళ్ళింది. 

చమురు ఉత్పత్తి తగ్గితే ఆ మేరకు ధరలు పెరుగుతాయి. తద్వారా రష్యా, వెనిజులా తదితర దేశాల ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయంతో దిగుమతులు పెంచుకుని సరుకుల కొరత (వెనిజులా) తీర్చుకునే అవకాశం ఉన్నది. కానీ ఇప్పుడు ప్రకటించిన ఉత్పత్తి కోత అంత ఎక్కువేమీ కాదు. రోజుకు 700,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని మాత్రమే తగ్గిస్తారు. ప్రస్తుత ఉత్పత్తి అంచనా 33.24 మిలియన్ బ్యారెళ్లతో పోల్చితే ఈ తగ్గింపు చాలా తక్కువ. 33.24 మిలియన్ బ్యారెళ్ల నుండి 32.5 మిలియన్ బ్యారెళ్లకు ఉత్పత్తి తగ్గిస్తామని ఒపెక్ కూటమి ప్రకటించింది. 

 

ఉత్పత్తి తగ్గుదలకు ఉన్న మరో ఆటంకం సౌదీ అరేబియా – ఇరాన్ ల మధ్య విభేదాలు. అమెరికా, ఇరాన్ ల మధ్య కుదిరిన ఒప్పందం రీత్యా అంతర్జాతీయ మార్కెట్ లో సాపేక్షికంగా స్వేచ్ఛగా ప్రవేశించే అవకాశం ఇరాన్ కు లభించింది. ఇది సౌదీకి ఇష్టం లేదు. ప్రాంతీయంగా ఇరాన్ ను పోటీదారుగా పరిగణించే సౌదీ అరేబియా ఇజ్రాయెల్, యూరప్, అమెరికాలతో కలిసి ఇన్నాళ్లు కుట్రలు చేసింది. చమురు ఉత్పత్తి తగ్గించాలంటే అది సౌదీ అరేబియా చేయాలని ఇరాన్, కాదు ఇరాన్ చేయాలని సౌదీ పోటీ పెట్టుకున్నాయి. ఈ కారణం కూడా చమురు ధరల్లో, ఉత్పత్తి తగ్గింపులో ప్రతిష్టంభన ఏర్పడేందుకు దారి తీసింది. 

ఒక ఒప్పందానికి వచ్చినప్పటికీ ఏ దేశం ఎంత తగ్గించాలి అన్నది ఇంకా నిర్ణయించలేదు. వచ్చే నవంబర్ లో మరో సారి సమావేశమై నిర్ణయిస్తామని కూటమి దేశాలు చెబుతున్నాయి. 

చమురు ధరలు పెరిగితే ఇండియా లాంటి చోట్ల ధరలు ఇంకా పెరుగుతాయా? లెక్క ప్రకారం చుస్తే ధరలు పెరిగినంత మేర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన పన్నులను తగ్గించి వినియోగదారులకు ధరల్లో తేడా రాకుండా చూడాలి. అలా కాకుండా ధరలు పెంచడానికే మోడీ, బాబు ప్రభుత్వాలు నిర్ణయిస్తే ఈసారి పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కడం ఖాయం. పెట్రోలు ధర లీటర్ కి రు 100 దాటినా ఆశ్చర్యం లేదు. 

ఒపెక్ ప్రకటనతో చమురు ధరలు ఇప్పటికి 5 శాతం పెరిగి బ్యారెల్ కు 48 డాలర్లకు చేరింది. ఒపెక్ దేశాలు ఒక ఒప్పందానికి రావడం పట్ల వాణిజ్య కంపెనీలు సంతోషం ప్రకటిస్తున్నాయి. 8 సం.ల తర్వాత ఒపెక్ కూటమి ఒక మాట మీదికి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారి సంతోషం ధరలు పెరిగేందుకు దోహదం చేసింది. ఇరాన్, లిబియా, నైజిరియాలు వాటి గరిష్ట సామర్ధ్యం మేరకు ఉత్పత్తి చేసేందుకు అనుమతిస్తామని సౌదీ ఎనర్జీ మంత్రి ప్రకటించడంతో మార్కెట్ మరింత ఉత్సాహాన్ని పుంజుకుంది. 

ఉత్పత్తి తగ్గింపు సౌదీ అరేబియా ను కూడా నష్టపరిచింది. సౌదీ ఆర్ధిక వ్యవస్ధ స్తంభనకు గురి కాగా 98 బిలియన్ డాలర్ల మేర బడ్జెట్ లోటు ఎదుర్కొంటున్నది. సౌదీ చమురు సంపదలు సౌదీ రాజు సొంతం. దానితో బడ్జెట్ లోటును పూర్తిగా ప్రజల మీదికి నిర్నిరోధంగా తరలిస్తున్నారు. ఉద్యోగుల వేతనాలు సైతం తగ్గించేశారు. రాజు మాత్రం నష్టాన్ని భరించడం లేదు. కొన్ని విదేశీ ఆస్తుల్ని అమ్మినప్పటికీ వాటిని పూడ్చుకోవటం సౌదీ రాజుకు పెద్ద సమస్య కాదు.  

పాక్ పై ఇండియా ఎకనమిక్ వార్!

యూరి దాడికి ప్రతీకారంగా ఇండియా, పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది; భౌతిక మిలటరీ యుద్ధం కాదు, ఆర్ధిక యుద్ధం! అమెరికా నుండి భారత ప్రధాని నరేంద్ర మోడీ బాగానే పాఠాలు నేర్చుకుంటున్నారు సుమీ!

ఎకనమిక్ వార్ అని భారత ప్రభుత్వం సూచిస్తున్న చర్యలలో కొన్ని అంశాలు: 

1. సాప్తా ఒప్పందం కింద ఇచ్చిన రాయితీలను ఉపసంహరించడం: సాప్తా (SAPTA ) అంటే దక్షిణాసియా స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతం అని అర్ధం. సార్క్ కూటమి దేశాలు (ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు) తమ దేశాల పరిధుల్ని స్వేచ్ఛా వాణిజ్య మండలంగా ప్రకటించాయి. దీని కింద కొన్ని పన్నులు, దిగుమతి సుంకాల పైన రాయితీ ఇవ్వబడుతుంది. 

2. MFN స్టేటస్ పైన WTO కు ఫిర్యాదు చేయటం: MFN అంటే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ -అత్యంత సానుకూల దేశం- అని అర్ధం. ఒక దేశం మరొక దేశానికి ఈ స్టేటస్ ఇస్తే, ఇచ్చిన దేశంలో ఇవ్వబడిన దేశానికి కొన్ని రాయితీలు సిద్ధిస్తాయి. ఈ స్టేటస్ ని ఇండియా పాకిస్తాన్ కి ఇచ్చింది గానీ, పాకిస్తాన్ ఇండియాకు ఇవ్వలేదు. ఈ స్టేటస్ గురించిన వివాదాలపై WTO కు ఫిర్యాదు చేసి తీర్పు కోరవచ్చు. 

ఎకనామిక్ వార్ లో భాగంగా MFN స్టేటస్ ని ఇండియా ఉపసంహరించవచ్చు. కానీ మోడీ ప్రభుత్వం అలా చేయటం లేదు. అది కొనసాగనిస్తు  తమకు అదే స్టేటస్ ఇవ్వకపోవటం గురించి WTO కు ఫిర్యాదు చేయాలని తలపెడుతున్నది. ఇది నిజానికి ఎకనామిక్ వార్ కాజాలదు. పాక్ కి తాము ఇస్తున్న బెనిఫిట్స్ మాకు ఇప్పించాలని ఫిర్యాదు చేయటం వార్ ఎందుకు అవుతుంది? 

సిమెంటు కంపెనీలు పాక్ నుండి దిగుమతి అవుతున్న సిమెంటు ఆగిపోవాలని కోరుకుంటాయి. యూరి దాడి అవకాశంగా సిమెంటు దిగుమతులు నిలిపేయాలని అవి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. ‘ఇల్లు కాలితే చుట్టకి నిప్పు దొరికిందని సంతోషించడం’ అన్నమాట! దీనిని ఎకనామిక్ వార్ లో కలిపేస్తున్నారు. 

3. IWT ని తిరగదోడటం: IWT అంటే ఇండస్ వాటర్ ట్రీటీ అని. ఈ ఒప్పందం ద్వారా నది జలాలను ఇరు దేశాలు పంపిణి చేసుకుంటున్నాయి. ఈ ఒప్పందం లేకపోతె పాక్ కే ఎక్కువ నష్టం అని భారత ప్రభుత్వం భావిస్తున్నది. కాబట్టి ట్రీటీని పాటించడం మానేస్తే పాక్ దారికి వస్తుందని వారు భావిస్తున్నారు. దీనివల్ల పాక్ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకోవడం తధ్యం. అందుకే నిన్ననో మొన్ననో ప్రధాని మోడీ పాక్ పాలకులు ఎంత చెడ్డవాళ్ళో పాక్ జనానికి చెబుతున్నారు. తద్వారా “పాపం మోడిదేమి తప్పు లేదు, మన పాలకులే తప్పులు చేస్తూ మనకి ఈ దుర్గతి తెచ్చి పెడుతున్నారు” అని అనుకోవాలని ప్రధాని ఆశ కావచ్చు. అది గొప్ప స్ట్రేటజీ అని మనము అనుకోవాలి. 

ఈ వార్ వల్ల ఏ మాత్రం ఫలితం ఉంటుంది?       

2014-15 లో ఇరు దేశాల వాణిజ్యం కేవలం 2.35 బిలియన్ డాలర్లు. అది 2015-16 లో 11 శాతం పెరిగి 2.61 బిలియన్లకు చేరుకుంది. ఇది తక్కువే అయినా పాక్ పైన పట్టు బిగించడానికి ఇది చాలు అని ప్రభుత్వ పెద్దల నమ్మకం. 

అయితే కొన్ని అంశాలు గుర్తించాలి. WTO నిబంధనల ప్రకారం, ఒక దేశం మరొక దేశానికి MFN స్టేటస్ ఇస్తే ఇచ్చిన దేశం ఒక సరుకు పైన సుంకం తగ్గిస్తే అవతలి దేశం కూడా ఆ స్ధాయికి తగ్గించాలి. ఈ నిబంధన ప్రకారం WTO కి ఫిర్యాదు చేస్తే మనం లాభ పడతామని భావిస్తున్నారు. 

కానీ MFN స్టేటస్ ఇవ్వకుండా తప్పించుకోగల నిబంధన కూడా ఉన్నది. భద్రతా (సెక్యూరిటీ) కారణాల రీత్యా MFN స్టేటస్ ఇవ్వకుండా నిరాకరించవచ్చు. కనుక ఆఫ్ఘనిస్తాన్ పక్కనే ఉన్న తమ దేశ పరిస్ధితుల రీత్యా స్టేటస్ ఇవ్వలేమని, సుంకాలు తగ్గించలేమని పాక్ వాదించవచ్చుఁ. దానితో భారత్ తలపెట్టిన వార్ పదును కోల్పోతుంది. 

సాప్తా రాయితీలు ఇవ్వకుండా నిలిపివేయాలంటే అది సార్క్ దేశాలన్నీ అనుకోవాలి. ఏ ఒక్క దేశం నిరాకరించినా భారత్ చర్యకు ఆమోదం దక్కదు. సార్క్ దేశాలు ఇటీవల ఇండియాకు మద్దతు రావటం నిజమే గానీ సాప్తా రాయితీల ఉపసంహరణ వరకు వారి మద్దతు వస్తుందా అన్నది అనుమానం.

కాబట్టి మోడీ ప్రభుత్వం తలపెట్టిన ‘ఎకనమిక్ వార్’ వాస్తవంలో ఆచరణకు రాకపోయినా, ఆశించిన ఫలితాలు చూపలేకపోయినా ఆశ్చర్యం లేదు. విఫలం అయితే తలవంపులు తప్పవు. అసలు ఒక దేశ పాలకులు చేసే చర్యలకు ఆ దేశ ప్రజలను బలి చేస్తామనడం దుర్నీతి. నాగరిక ప్రపంచం దానికి ఒప్పుకోదు. అమెరికా అనాగరిక పాలకుల చేతుల్లో ఉన్నది గనుకనే అది ఎన్ని దుర్నీతులకైనా పాల్పడుతుంది. దాని సరసన చేరాలని అంత కోరికగా ఉంటే ముందుకు వెళ్ళవచ్చు. కానీ అందుకు పాక్ ప్రజల నుండి మద్దతు ఉంటుంది అనుకుంటే పొరపాటు. భారత ప్రజలు కూడా ఇలాంటి వెర్రి మొర్రి ఎత్తులను వ్యతిరేకించాలి.

వీసా పోటీ: ఐరోపాకు విస్తరిస్తున్న రష్యా చెల్లింపు వ్యవస్ధ

రష్యా ఎలక్ట్రానిక్ చెల్లింపు వ్యవస్ధ ఐరోపాకు విస్తరించడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తున్నది. పశ్చిమ దేశాలకు ఈ రంగంలో ఇప్పటి వరకు ఆధిపత్యంలో ఉండడంతో అమెరికా, ఐరోపాలు ఆడింది ఆటగా చెల్లిపోయింది. ఈ పరిస్ధితిని మార్చే లక్ష్యంతో రష్యా, చైనాలు మొదలు పెట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చాయి. 

మిర్ నేషనల్ పేమెంట్ సిస్టం (మిర్ జాతీయ చెల్లింపుల వ్యవస్ధ) పేరుతొ రష్యా తన సొంత జాతీయ మరియు అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్ధను గత ఏడు ప్రారంభించింది. ఏప్రిల్ 1, 2015 తేదిన రష్యాలో ప్రారంభం అయిన ఈ వ్యవస్ధ ఇప్పుడు అంతర్జాతీయ చెల్లింపులకు కూడా విస్తరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ మేరకు వీసా, మాస్టర్ కార్డు లతో చర్చలు జరుగుతున్నాయని నేషనల్ కార్డు పేమెంట్ సిస్టం (NSPK) అధిపతి వ్లాదిమిర్ కొమ్లెవ్ తెలిపాడు. 

ఉక్రెయిన్ లో అమెరికా, ఈయూ ప్రవేశ పెట్టిన  కృత్రిమ తిరుగుబాటుకు సహకరించడానికి రష్యా నిరాకరించడంతో పాటు క్రిమియా రిఫరెండంను గౌరవించి రష్యాలో కలిపేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చర్యపై అమెరికా, ఈయూ లు ఆగ్రహించాయి. రష్యాపై ఆంక్షలు ప్రకటించి అమలు చేశాయి. ఆంక్షలలో భాగంగా అంతర్జాతీయ ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్ధలో రష్యా వాణిజ్య చెల్లింపులను కొనసాగకుండా నిరోధించింది. ఫలితంగా రష్యా, తన సొంత ఎలక్ట్రానిక్ చెల్లింపుల వ్యవస్ధను అభివృద్ధి చేసుకోవడం ప్రారంభించింది. రష్యాను కష్ట పెట్టి నష్టం తలపెట్టిన అమెరికా చివరికి రష్యాకు మేలు చేసింది. ఇప్పుడిక అంతర్జాతీయ ఆంక్షలతో రష్యా వాణిజ్యానికి నష్టం తెస్తానని అమెరికా బెదిరించేందుకు -ఒక కోణంలో- అవకాశం లేకుండా పోయింది. 

అమెరికా ఆంక్షలతో రష్యా వాణిజ్య చెల్లింపులను సాగకుండా నిరోధించిన పశ్చిమ చెల్లింపుల వ్యవస్ధలు వీసా, మాస్టర్ కార్డు తదితర వ్యవస్ధలు ఇప్పుడు తామే స్వయంగా రష్యన్ NSPK వ్యవస్ధతో సంబంధాలు పెట్టుకోవడానికి ముందుకు వస్తుండటం గమనార్హం. 

“మేము వీసా తో చర్చలు జరుపుతున్నాము. ప్రపంచ చెల్లింపుల వ్యవస్ధలు ఇప్పటికే మమ్ములను ఆకర్షణీయ భాగస్వాములుగా గుర్తిస్తున్నాయి. ఒక సంవత్సర కాలంలోనే మా కార్డు విస్తృతమైన నెట్ వర్క్ కలిగిన కార్డుగా అవతరించడం దానికి కారణం. ఇప్పుడు మూడు పెద్ద యూరోపియన్ ప్రాసెసర్ కంపెనీలు, ఉదాహరణకి ఫ్రాన్స్, జర్మనీలు, NSPK తో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వారంతట వారే మమ్మల్ని సంప్రతించారు. యూరోపియన్ రిటైలర్ కంపెనీలు NSPK ద్వారా రష్యన్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని కొమ్లెవ్ పత్రికలతో మాట్లాడుతూ చెప్పారు (-ఇజ్వేస్తియా). 

NSPK ఇప్పటికే మాస్టర్ కార్డు, జేసీబీ, ఆమెక్స్, యూనియన్ పే తదితర చెల్లింపు వ్యవస్ధలతో ఒప్పందానికి వఛ్చినట్లు తెలుస్తున్నది. కేవలం రిటైలర్ కంపెనీల వరకే కాకుండా రిటైలర్ కంపెనీలతో కార్యకలాపాలు నిర్వహించే భారీ అగ్రిగేటర్ కంపెనీలతో కూడా కార్యకలాపాలు నిర్వహించే దశకు NSPK చేరుకున్నది. 

రష్యాపై ఆంక్షలను సంజ్ఞగా/సందేశంగా స్వీకరించిన చైనా సైతం తన సొంత చెల్లింపుల వ్యవస్ధను -CIPS (చైనా ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టం) – అభివృద్ధి చేస్తున్నది. ఈ వ్యవస్ధ దన్నుతో స్వేచ్ఛా మార్కెట్ ఆర్ధిక వ్యవస్ధగా తనను రుజువు చేసుకునేందుకు చైనా ప్రయత్నం చేసి సఫలం అవుతున్నది. అందులో భాగంగా IMF నిర్వహించే వివిధ అంతర్జాతీయ కరెన్సీల బాస్కెట్ లో ఒకటిగా చైనా కరెన్సీ రెన్ మిన్ బి / యువాన్ ను IMF గుర్తించింది.

వచ్చే అక్టోబర్ 1 నుండి IMF నిర్వహించే SDR బాస్కెట్ లో యువాన్ ఉనికిలోకి రానున్నది. SDR అంటే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని అర్ధం. వీటిని అత్యంత భద్రమైన లిక్విడ్ ఆస్తులుగా ప్రపంచ దేశాలు గుర్తిస్తాయి. ఆయా దేశాల విదేశీ మారక ద్రవ్య నిల్వలలో ఇవి కూడా కలిసి ఉంటాయి. కాబట్టి యువాన్ SDR లో భాగం కావటం చైనా సాధించిన ఆర్ధిక విజయం. కాగా ఈ విజయం చైనా ప్రజల ప్రయోజనాలను, కార్మికవర్గం హక్కులను ఫణంగా పెట్టడం ద్వారా మాత్రమే సాధ్యం అయింది.

కస్టమర్ డేటా అమ్మేస్తున్న రిలయన్స్ జియో -ఎనోనిమస్

వచ్చే డిసెంబర్ చివరి వరకు ఉచిత డేటా ఆఫర్ తో 4G మార్కెట్ లో తొక్కిసలాట సృష్టించిన రిలయన్స్ జియో తన అప్లికేషన్స్ ద్వారా సేకరించే యూజర్ (కస్టమర్ల) డేటాను ప్రకటనల కంపెనీలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నట్లుగా హ్యాకర్ గ్రూఫు హ్యాక్టివిస్ట్ సంస్ధ ‘ఎనోనిమస్’ ప్రకటించి సంచలనం సృష్టించింది. 

గూగుల్ కంపెనీ లాగానే భారీ మొత్తంలో ఉచిత సేవలు, ఉచిత యాప్స్ ను యూజర్స్ కు ఇవ్వజూపుతున్న రిలయన్స్ కంపెనీ తన ఉచిత సేవలు వాస్తవానికి మరింత లాభాలు సంపాదించేందుకేనని, తన కస్టమర్ల ప్రయివసీని తాకట్టు పెట్టి మరి అధిక లాభాలు సంపాదించడమే దాని లక్ష్యమని హ్యాక్టివిస్ట్ గ్రూపు వెల్లడి చేసిన వాస్తవాల ద్వారా స్పష్టం అవుతున్నది. 

దేశ వ్యాపితంగా 4G స్పెక్ట్రంలో అత్యధిక భాగాన్ని వేలంలో కొనుగోలు చేసిన రిలయన్స్ కంపెనీ ఇటీవలనే చాలా ఆలస్యంగా 4G కంయూనికేషన్, డేటా సేవలను ప్రారంభించింది. వచ్చి రావడంతోనే కస్టమర్లకు భారీ బొనాంజా ఇస్తున్నట్లు  ప్రకటించింది. ప్రత్యర్థి కంపెనీలు గుక్క తిప్పుకోకుండా చేసింది. రిలయన్స్ జియో ప్రకటించిన పధకంలో మూడు ముఖ్యాంశాలు ఉన్నాయి. 

  1. జీవితాంతం ఉచిత వాయిస్, SMS సేవలు
  2. డిసెంబర్ 31, 2016 వరకు అన్ని సేవలు ఉచితం
  3. జనవరి 1, 2017 నుండి ఇతర కంపెనీల బేస్ డేటా రేటులో జియో డేటా బేస్ రేటు 10 శాతం (1GB = రు. 50/-)

ఈ మూడు అంశాల ప్రధాన లక్ష్యం ఇతర కంపెనీల నుండి కస్టమర్లను భారీ ఎత్తున ఆకర్షించడమే అని చూడగానే అర్ధం అవుతుంది. అనేక థర్డ్ పార్టీ అప్లికేషన్లు  (యాండ్రాయిడ్, యాపిల్ స్టార్ రెండింటి లోను) ఇప్పటికే వాయిస్, SMS సేవలు ఇచితంగా అందిస్తున్నాయి. కేవలం డేటా ప్రవాహానికి మాత్రమే డబ్బు వసూలు చేస్తున్నాయి. అయితే వాయిస్, SMS సేవలను డేటా మార్కెట్ కు అనుసంధానం చేయడం ద్వారా తమ రెవిన్యూ వసూళ్లు తగ్గకుండా కంపెనీలు జాగ్రత్త పడుతున్నాయి. 

థర్డ్ పార్టీ అప్లికేషన్లు  ప్రపంచ వ్యాపితంగా ఉచిత వాయిస్, SMS సేవలు అందిస్తున్న దృష్ట్యా మొబైల్ మార్కెట్ అనివార్యంగా ఆ దిశలోనే నడుస్తున్నది. అనగా ఇండియాలో అధికారిక సర్వీసులు కూడా రేపో, మాపో వాయిస్, SMS లను ఉచితంగా అందించాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ రోజుని ముందుకు జరపడం మాత్రమే రిలయన్స్ జియో చేస్తున్నది తప్ప అది కొత్తగా వినియోగదారులకు చేస్తున్న మేలు ఏమి లేదు. 

ఈ ఉచిత తొక్కిసలాటలో అసలు విషయం మరుగున పడుతోంది. అది: ఉచిత సర్వీసుల మాటున కాటికి వెళ్లిపోతున్న వినియోగదారుల ప్రయివసీ. ఉచితం అని చేప్పేవి ఏవి వాస్తవానికి ఉచితం కాదు. కాకపొతే ఆ డబ్బును కంపెనీలు ఇతర రూపాల్లో వసూలు చేయడం కంపెనీలు, ముఖ్యంగా ఇంటర్నెట్ కంపెనీలు అనుసరిస్తున్న ఎత్తుగడ. 

ఇంటర్నెట్ సేవలు పొందడానికి తప్పనిసరి అవసరం అన్న నమ్మకంతో వినియోగదారులు కంపెనీలు/అప్లికేషన్లు  ఏ వివరం అడిగినా వెనకా ముందు చూడకుండా ఇచ్ఛేస్తున్నారు. T&C పేరుతొ వినియోగదారులు చదవవలసి వచ్చే అనేక పేజీల ప్రయివసీ ఒప్పందాన్ని చదవ లేక దానిని చదవకుండానే యాప్స్ అడిగే అనుమతులు అన్నింటికి వినియోగదారులు ఓ కె చెప్పేస్తున్నారు. దీనినే కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. 

ఈ అనుమతుల్లోనే వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు కూడా యాప్స్ అనుమతి తీసుకుంటున్నాయి. వినియోగదారుల వ్యక్తిగత వివరాలు మూడో వ్యక్తికీ / సంస్ధకు / కంపెనీకి ఇవ్వబోమని యాప్స్ గట్టి హామీ కూడా ఇస్తాయి. కానీ వాస్తవంలో అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకే, వాటితో వ్యాపారం చేసేందుకే యాప్స్ లేదా కంపెనీలు వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్న సంగతిని అడపా దడపా హ్యాకర్లు, విజిల్ బ్లోయర్లు, ప్రయివసీ కార్యకర్తలు వెల్లడి చేస్తూనే ఉన్నారు. 

ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ కంపెనీ కూడా ఇదే పని చేస్తున్నాడని హ్యాక్టివిస్ట్ అనే హ్యాకర్ల సంస్ధ ‘ఎనోనిమస్’ వెల్లడి చేసిన సమాచారం తెలియజేస్తున్నది. రిలయన్స్ జియో కంపెనీ నిర్వహిస్తున్న అప్లికేషన్లు  (యాప్స్) ‘మై జియో’ ‘జియో డయలర్’. ఈ రెండు యాప్స్ సేకరించే వినియోగదారుల వ్యక్తిగత వివరాలను అమెరికా, సింగపూర్ లలోని ప్రకటనల కంపెనీలకు రిలయన్స్ కంపెనీ అమ్మేస్తున్నాడని అనానిమస్ తెలిపింది. ఇండియాలో ఎనోనిమస్ సంస్ధ @redteamin అనే పేరు గల ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా కార్యకలాపాలు ప్రకటిస్తుంది. 

అనానిమస్ హ్యాకర్లను తాము ఈ-మెయిల్ ద్వారా సంప్రదించి వివరాలు కనుక్కున్నామని, సంస్ధ ప్రకటించిన వివరాలను ధృవీకరించుకున్నామని ద హిందూ బిజినెస్ లైన్ పత్రిక తెలిపింది. “RJio వెబ్ సైట్ ను హ్యాక్ చేసి మేము ఈ వివరాలు తెలుసుకున్నాము. టార్గెటెడ్ అడ్వర్టైజింగ్ కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలకు వినియోగదారుల వివరాలు రిలయన్స్ కంపెనీ అమ్మేస్తున్నది” అని ఎనోనిమస్ సంస్ధ తెలిపిందని బిజినెస్ లైన్ వివరించింది. 

RJio  కంపెనీ వినియోగదారుల వివరాలను ఏ విధంగా అమ్ముతున్నది తెలియజేస్తూ ఎనోనిమస్ సంస్ధ ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా వివరంగా తెలియజేసింది పత్రిక తెలిపింది. వెబ్ సైట్ ను హ్యాక్ చేసే పధ్ధతి గురించి కూడా బ్లాగ్ పోస్ట్ ద్వారా సంస్ధ వివరించినట్లు  తెలుస్తున్నది. 

ఎనోనిమస్ వెల్లడి చేసిన అంశాన్ని రిలయన్స్ కంపెనీ తిరస్కరించింది. తాము అలాంటిది ఏమి చేయడం లేదని తెలిపింది. ఎనోనిమస్ ప్రకటనను ఖండించింది. “వినియోగదారుల వివరాల భద్రతకు, వారి ప్రయివసీకి తాము అత్యంత భద్రతా, ప్రాధాన్యత ఇస్తాము” అని యధావిధి ప్రకటన చేసింది. కంపెనీ అంతకంటే గొప్పగా చెప్పేది ఏమి ఉండదు. వాళ్ళు నిజం చెబుతారని ఆశించడమే దండగ!

రిలయన్స్ జియో అందజేస్తున్న ఉచిత తాయిలాలు చూసి ఆశపడుతున్న వినియోగదారులు ఈ అంశాన్ని గమనంలో ఉంచుకోవాలి. ఒక్క జియో మాత్రమే కాదు, ఎయిర్ టెల్, ఐడియా, టెలినార్ తదితర ఇతర ప్రయివేటు కంపెనీలు కూడా ఇంతకంటే భిన్నంగా వ్యవహరిస్తామని ఆశించలేము. మనం ఇచ్ఛే వివరాలు సాధ్యమైనంత క్లుప్తంగా ఉంటేనే మేలు. తప్పుడు వివరాలు ఇవ్వగలిగితే ఇంకా మంచిది.

రాఫెలే ఫైటర్: ఫ్రాన్స్ తో ఒప్పందం ఖరారు!

36 రాఫెలే ఫైటర్ జెట్ లను కొనుగోలు చేసేందుకు శుక్రవారం ఫ్రాన్స్ తో ఇండియా ఒప్పందం ఖరారు చేసుకుంది. యూ‌పి‌ఏ హయాంలోనే కుదిరిన ఈ ఒప్పందాన్ని మోడి ప్రభుత్వం ఖరారు చేసింది.

7.87 బిలియన్ యూరోలు చెల్లించి 36 రాఫెలే ఫైటర్ జెట్ యుద్ధ విమానాలని ఇండియా కొనుగోలు చేస్తుంది. మన కరెన్సీలో ఇది రమారమి 58.94 వేల కోట్లకు రూపాయలకు సమానం.

రాఫెలే జెట్, MMRCA తరహా యుద్ధ విమానం. అనగా మీడియం మల్టీ-రోల్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అని అర్ధం. రాఫెలేతో నాలుగు ఐరోపా దేశాల (జర్మనీ, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ) ఉమ్మడి ఉత్పత్తి అయిన యూరో ఫైటర్ టైఫూన్, బోయింగ్ (అమెరికా) కంపెనీకి చెందిన సూపర్ హార్నెట్, లాక్ హిడ్ మార్టిన్ (అమెరికా) కు చెందిన F-16 ఫాల్కన్, రష్యాకు చెందిన MiG-35, స్వీడన్ కు చెందిన సాబ్ జే‌ఏ‌ఎస్ 39 గ్రిపెన్ లు పోటీ పడ్డాయి.

ఇండియా, యూ‌పి‌ఏ హయాం లోనే, యూరో ఫైటర్, డసాల్ట్ రాఫెలే లను షార్ట్ లిస్ట్ చేసింది. అంతిమంగా రాఫెలే ను ఎంపిక చేసుకుంది. అమెరికా కంపెనీలు రెండింటినీ తప్పించినప్పుడు అమెరికా మండిపడటం కూడా జరిగింది. కానీ ఇండియన్ ఆర్మీ రాఫెలే వైపే మొగ్గు చూపడంతో అదే కాంట్రాక్టు గెలుచుకుంది.

Multi Role of Rafale
Multi Role of Rafale

ఫ్రెంచి రక్షణ మంత్రి జీన్ వేస్ ల డ్రియాన్, భారత రక్షణ మంత్రి మనోహర పరికర్ లు ఒప్పందం పైన ఢిల్లీలో సంతకాలు చేసారు. డసాల్ట్ కంపెనీ సి‌ఈ‌ఓ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఒప్పందంలో 36 ఫైటర్ జెట్ లు, ఆయుధాలు, విడిభాగాలు, మద్దతు మరియు నిర్వహణ… అన్నీ భాగంగా ఉంటాయి.

ప్రస్తుతం జరిగింది ప్రభుత్వాల మధ్య ఒప్పందం మాత్రమే. అసలు కాంట్రాక్టు పైన సంతకాలు జరగాల్సి ఉన్నది. కాంట్రాక్టు సంతకం అయిన 3 యేళ్లకు మొదటి జెట్ మనకు అందుతుంది. 30 నెలల లోపు చివరి ఫైటర్ జెట్ అందాలి. ఒప్పందం ప్రకారం, విమానాల సరఫరా పూర్తయ్యాక, ఏ సమయంలో నైనా కనీసం 75 శాతం విమానాలు (27) ఆపరేషన్ కు సిద్ధంగా ఉండాలి.

అలాగే కాంట్రాక్టు మొత్తంలో సగం విలువని తిరిగి ఇండియాలో పెట్టుబడిగా పెట్టాలని మరో షరతు. దీని అర్ధం సగం వెనక్కి ఇవ్వడం కాదు. కనీసం 30 వేల కోట్ల మేర ఇండియాలో ఎఫ్‌డి‌ఐలు గా రావాలని అర్ధం. ఎఫ్‌డి‌ఐల మోజు ఉన్నోళ్ళకి ఇది గొప్పగా కనిపిస్తుంది. ఎఫ్‌డి‌ఐలు దేశానికి చేస్తున్న నష్టం తెలిసిన వాళ్ళకి మన వేలితో మన కంటినే పొడుచుకోవడంగా అర్ధం అవుతుంది.

ఆరంభంలో 126 ఫైటర్ జెట్ ల కొనుగోలుకి (2007లో) టెండర్ లు ఆహ్వానించారు. చర్చలు వివిధ కారణాలతో కొనసాగుతూ పోవడంతో మోడి ప్రభుత్వం వచ్చిన తోడనే 36 జెట్ లను నేరుగా కొనుగోలు చేయడానికి నిర్ణయించింది. మిగిలిన 90 జెట్ ల కొనుగోలుని ఇండియాలో తయారు చేయాలన్న షరతుతో కొత్త టెండర్ ఆహ్వానానికి మోడి ప్రభుత్వం సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది.

 

ఇటలీ: యూరోని వదిలేస్తే తప్ప ఆర్ధిక వృద్ధి అసాధ్యం!

 

బ్రెగ్జిట్ రిఫరెండం అనంతరం ఈయూ సభ్య దేశాలలో క్రమంగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. యూరో జోన్ నుండి బైట పడాలని కొన్ని దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తుంటే అసలు యూరోపియన్ యూనియన్ నుండే బైట పడాలని మరికొన్ని సభ్య దేశాలలోని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. 

యూరో జోన్ నుండి బైట పడడం అంటే ఉమ్మడి కరెన్సీ యూరోని జాతీయ కరెన్సీగా త్యజించడం. యూరోపియన్ యూనియన్ నుండి బైట పడటం అంటే అసలు మొత్తంగా యూరోపియన్ ప్రాజెక్టు నుండి బయట పడటం. బ్రిటన్ తన సొంత కరెన్సీని కొనసాగిస్తూ  ఈయూ లో చేరింది. అనగా అది యూరో జోన్ లోని దేశంగా ఎన్నడూ లేదు. బ్రెగ్జిట్ రిఫరెండం ఈయూ నుండే బైటకు రావాలని నిర్దేశించింది. 

ఇటలీ యూరో జోన్ దేశం. తన సొంత జాతీయ కరెన్సీ ‘లీరా’ ను వదులుకుని 1999 లో యూరో జోన్ లో భాగం అయింది. ఈయూ సభ్య దేశమే యూరో జోన్ లో చేరగలదు. కనుక ఇటలీ ఈయూ సభ్య దేశం కూడా. ఇటలీ బ్యాంకులు కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని యూరోపియన్ బ్యాంకింగ్ అధారిటీ గత ఆగస్టులో నిర్వహించిన స్ట్రెస్ టెస్ట్ ఫలితంగా వెల్లడి కావటంతో అప్పటి నుండి యూరో వ్యతిరేక సెంటిమెంట్లు  ఆ దేశంలో విస్తృతం అయ్యాయి. 

ఇటలీకి 360 బిలియన్ యూరోల మేర చెడ్డ రుణాలు ఉన్నాయని స్విట్జర్లాండ్ లోని బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (BIS) తెలిపింది. ఇటలీ యొక్క మొత్తం రుణాలలో ఇది 20 శాతంగా తెలుస్తున్నది. ఇందులో 200 బిలియన్ యూరోలు వసూలుకు అస్సలు సాధ్యం కాని రుణాలేనని స్ట్రెస్ టెస్ట్ లో తేలింది. విదేశాలలో ఇటలీ బ్యాంకులకు 550 బిలియన్ యూరోలు రుణాలున్నాయని BIS గణాంకాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో రుణాలు వసూలు కాక ఒక్క బ్యాంకు మూత పడినా ఆ ప్రభావం చేయిం రియాక్షన్ తరహాలో ఇతర బ్యాంకులకు వ్యాపిస్తుంది. ఫలితంగా ఇటలీ ద్రవ్య వ్యవస్ధ కూలిపోయి ఆర్ధిక సంక్షోభంగా బద్దలు అవుతుంది. ఈ ప్రభావం ఒక్క ఇటలీకె పరిమితం కాబోదు. ఇతర ఈయూ, యూరోజోన్ దేశాలకు వ్యాపిస్తుంది. 

ఉదాహరణకి ఇటలీ రుణాలలో 200 బిలియన్ యూరోలు ఫ్రెంచి బ్యాంకులవి కాగా 90 బిలియన్ యూరోలు జర్మనీ బ్యాంకులవి. కాబట్టి ఇటలీ బ్యాంకులు కూలిపోతే ఫ్రాన్స్ పైన తీవ్రంగా పడుతుంది. ఇటలీ బ్యాంకుల్లో ఫ్రాన్స్ కంటే తక్కువ రుణాలు కలిగిన జర్మనీ పైన ఇటలీ దివాళా వాళ్ళ కలిగే ప్రభావం గ్రీసు దివాళా వాళ్ళ కలిగే ప్రభావం కంటే 30 రెట్లు ఎక్కువగా ఉంటుందని BIS అంచనాల వేసింది. దానిని బట్టి ఫ్రాన్స్ పై కలిగే ప్రభావం ఏ పరిణామంలో ఉంటుందో గ్రహించవచ్చుఁ. ఇది అంతిమంగా మళ్ళీ ప్రపంచ ఆర్ధిక సంక్షోభంగా పరిణామం చెందడానికి ఎన్నో రోజులు అవసరం లేదు. 

 

ఈ నేపథ్యంలో యూరో జోన్ నుండి బైటికి వస్తే తప్ప లేదా యూరో కరెన్సీని రద్దు చేసుకుని పాత జాతీయ కరెన్సీ లీరా ను పునరుద్ధరిస్తే తప్ప ఇటలీకి ఆర్ధిక వృద్ధి నమోదు చేయడం దుస్సాధ్యం అని లీగా నార్డ్ (నార్తరన్ లీగ్) పార్టీ నేత క్లాడియో బోర్గి హెచ్చరిస్తున్నారు. యూరో జోన్ ని వదిలించుకుంటే ఇటలీ ఆర్ధిక వ్యవస్ధకు మంచి రోజులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. ఇటలీ ఆర్ధిక సార్వభౌమత్వం తిరిగి సంపాదించుకోవచ్చని స్పష్టం చేశారు. స్పుత్నిక్ న్యూస్ కు ఇంటర్వ్యూ ఇస్తూ  ఆయన ఈ మాటలు చెప్పారు. 

ఒక దేశ కరెన్సీ ఆ దేశంలో ఉత్పత్తి అయ్యే ఉత్పత్తి విలువను -ఇతర దేశాలతో పోల్చితే- తెలిపే సాధనమని చెబుతూ ఆయన ఇలా చెప్పారు, “ఒక దేశ ఆర్ధిక అవకాశాలతో పోల్చితే ఆ దేశ కరెన్సీ విలువ మరీ అధికంగా ఉంటే ఆ దేశ ఉత్పత్తులు, సేవలు ఖరీదుగా మారి ఆ ఆర్ధిక వ్యవస్ధ కుప్ప కూలుతుంది. ఇది అందరికి తెలిసిన సత్యమే” అని బోర్గి చెప్పారు. 

బోర్గి ఉద్దేశం తమది కాని ఉమ్మడి కరెన్సీ వలన ఇటలీ సరుకుల విలువ అంతర్జాతీయంగా అసలు విలువ కంటే ఎక్కువ అయిందని దానితో అంతర్జాతీయ మార్కెట్ లో పోటీకి నిలబడ లేక ఎగుమతులు పడిపోతున్నాయని, దానితో ఉత్పత్తి పడిపోయి జీడీపీ వృద్ధి రేటు తగ్గుతున్నదని. 

ఇదే కారణం వలన 1999 లో అర్జెంటీనా ఆర్ధిక వ్యవస్ధ కుప్ప కూలిందని బోర్గి గుర్తు చేశారు. అర్జెంటీనా ఆ నాడు తన కరెన్సీని డాలర్ కు సమానంగా నిర్ధారించుకున్నది. కొద్దీ కాలం పాటు బాగానే ఉన్నా త్వరలోనే ఆర్ధిక వ్యవస్ధ కుప్ప కూలింది. ద్రవ్యోల్బణం అవధులు దాటింది. అల్లర్లు చెల్లరేగాయి. రుణాలు తడిసి మోపెడు అయ్యాయి. ఆనాటి రుణాలు చెల్లించలేక ఇప్పటికి ఆ దేశం సతమతం అవుతున్నది. రుణాలు రైట్-ఆఫ్ చేయాలని కోరుతున్నది.   

కాబట్టి యూరో జోన్ నుండి బయటపడితే తమ సరుకుల ధరలు తామే నిర్ణయించుకునే సార్వభౌమాధికారం వస్తుందని కనుక యూరో ను వదిలి పెట్టాలని బోర్గ్ కోరుతున్నారు. ఈ అవగాహన ఇటలీ లో అనేకులు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని రెంజి మాత్రం అప్పుల భారాన్ని ప్రజలపై వేసి సంక్షోభం నుండి బైట పడాలని ప్రభోదిస్తున్నాడు. ఇది యూరో జోన్ సూత్రాలకు విరుద్ధం. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత చివరికి ఈయూ ఉనికికే ఎసరు తెస్తుందని జర్మనీ భయం. కనుక జర్మనీ అందుకు సుతరామూ ఒప్పుకోదు. 

ఈ ఘర్షణ మునుముందు మరింత తీవ్రం అవుతుంది. అప్పుడు కూడా ఈయూ ఉనికి ఎసరు రాక మానదు. అది ఎంత దూరంలో ఉందన్నదే అసలు సంగతి!

అచ్ఛే దిన్ కనుచూపు మేరలో లేవు -మూడీస్

ప్రధాన మంత్రి మోడీ హామీ ఇఛ్చిన అచ్ఛే దిన్ ఎప్పటికి సాకారం అవుతాయని భారత ప్రజలు మాత్రమే అడగడం లేదు. అంతర్జాతీయ రేటింగ్ కంపెనీలు కూడా అదే మాట అడుగుతున్నాయి. 

అయితే భారత ప్రజలు కోరే మంచి దినాలు, రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు ఒకటి కావు. పైగా పరస్పర విరుద్ధం. రేటింగ్ కంపెనీలు కోరే మంచి దినాలు వస్తేనేమో అవి ప్రజలకు చెందిన ఖనిజ, నీటి, మానవ వనరులను అన్నింటిని దోచి విదేశీ బహుళజాతి కంపెనీలకు అప్పగిస్తాయి. భారత జనానికి మంచి దినాలు వస్తేనేమో వనరులు జనానికి ఉపయోగపెడతాయి. అనగా ప్రభుత్వ కంపెనీలు పెరుగుతాయి; ఉద్యోగాలు పెరుగుతాయి; ప్రయివేటీకరణ వెనక్కి వెళుతుంది; ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీలు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్ధలు పెరుగుతాయి.

క్రెడిట్ సుయిస్, స్విట్జర్లాండ్ కి చెందిన రేటింగ్ కంపెనీ. దాని పని బహుళజాతి కంపెనీలకు, ముఖ్యంగా పశ్చిమ బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా ప్రపంచ దేశాల ఆర్ధిక వ్యవస్ధలకు, కంపెనీలకు, బ్యాంకులకు, ద్రవ్య సంస్ధలకు రేటింగులు ఇవ్వడం. ఇతర ద్రవ్య వ్యాపారాలు కూడా ఆ సంస్ధ నిర్వహిస్తుంది గాని రేటింగ్ కి అది పేరు పొందింది. మంగళవారం ఒక నివేదిక వెలువరిస్తూ  ఆ కంపెనీ మోడీ హామీ ఇఛ్చిన సంస్కరణలు పని చేయడం మొదలయిందని పేర్కొంది. కానీ మూడీస్ దానిని నిరాకరించింది.  

ఆర్ధిక సంస్కరణలను లేదా నూతన ఆర్ధిక విధానాలను కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా అమలు చేయలేదని కదా అమెరికా, పశ్చిమ దేశాలు మోడీ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నది! ఇప్పుడు అవి మోడీ పైన కూడా పెదవి విరిచేస్తున్నాయి. 

మూడీస్ కంపెనీ మంగళవారం మరో నివేదిక వెలువరించింది. ఓ రోజు క్రితం బ్యాంకుల పరిస్ధితి మెరుగు పడుతున్నదని చెప్పిన మూడీస్, ఆర్ధిక వ్యవస్ధ రేటింగ్ పెంచాలి అంటే మరో ఏడు లేదా ఏడున్నర ఆగాలన్నది. నెగిటివ్ గా చెప్పకుండా నెగిటివ్ సందేశం ఇచ్చిందన్నట్లు! “ఇండియా ఆరోగ్యకరమైన వృద్ధి నమోదు చేయాలంటే మరిన్ని బలహీనతలను అధిగమించాల్సి ఉన్నది” అన్న ముక్క మాత్రం స్పష్టంగా చెప్పింది.

క్రెడిట్ సుయిస్ కంపెనీ కాస్త అనుకూలంగా చెప్పింది. “మోడీ విధానాలు ఖాళి వాగ్దానాలు కాదు. వాటిని అమలు చేసేందుకు గట్టి కృషి జరుగుతోంది. ఎట్టకేలకు ఇండియా ఫైరింగ్ మొదలు పెట్టిన సూచనలు కనిపిస్తున్నాయి” అని క్రెడిట్ సుయిస్ నివేదిక తెలిపింది. “కంపెనీలు ప్రభుత్వం నుండి సానుకూల అంశాలు చూస్తున్నాయి. (స్వదేశీ) పక్షపాతం లేకుండా ‘లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్’ ను విదేశీ కంపెనీలకు ఇస్తున్నారు. స్పష్టమైన విధానాలు అమలు చేస్తున్నారు. మంత్రిత్వ శాఖలు త్వరితగతిన తమను తాము రుజువు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు” అని సదరు నివేదిక పేర్కొంది. 

మూడీస్ ఇందుకు విరుద్ధంగా పేర్కొంది.   

“ఆర్ధిక వ్యవస్ధలో బలహీనత కొనసాగుతోంది. ప్రభుత్వ సావరిన్ రేటింగ్ (ప్రభుత్వం తీసుకునే అప్పుల రేటింగ్) పెంచాలంటే మరింత పురోగతి కావాలి. మరిన్ని సాక్షాలు కావాలి. వచ్ఛే ఒకటి, రెండు ఏళ్లలో అవి కనపడాలి” అని మూడీస్ కంపెనీ అధికారి మేరీ డిరోన్, ఓ విలేఖరుల సమావేశంలో స్పష్టం చేసింది. 

“వేగవంతమైన ఫిస్కల్ విధానాలు అమలు చేస్తున్నట్లు మరింత సాక్షం కావాలి. మరిన్ని స్పష్టమైన సంస్కరణలు, బ్యాంకింగ్ రంగం ఆస్తుల క్వాలిటీ మెరుగుపరుస్తామన్న నిశ్చయం కావాలి” అని ఆమె పేర్కొంది.   

“సంస్కరణల అమలులో ప్రగతి కనిపిస్తోంది. అయినప్పటికీ ప్రయివేటు రంగం పెట్టుబడులు ఇంకా బలహీనంగా ఉన్నందున రేటింగ్ అప్ గ్రేడ్ చేయాలంటే ఇంకా ఆగాలి. బ్యాంకుల్లో నిరర్ధక ఆస్తులు గుర్తించడం మొదటి అడుగు. కానీ గుర్తించినంతనే సరిపోదు. వాటిని మెరుగుపరచాలి” అని మూడీస్ అధికారి పేర్కొంది.   

ఇతర స్వతంత్ర పరిశీలకులు కూడా మూడీస్ తో ఏకీభవిస్తున్నారు. Frontline పత్రికకు కాలమ్ రాసే సి పి చంద్ర శేఖర్ “గతం కంటే పరిస్ధితి మెరుగుపడింది అనడానికి కారణాలు ఏమి లేవు. జీడీపీ డేటా పైన ఇప్పటికి అనుమానాలు ఉన్నాయి. బ్యాంకుల్లో భారీ నిరర్ధక ఆస్తులు రుణాల స్వీకరణను దెబ్బ తీస్తాయి. ఫలితంగా డిమాండ్ పడిపోతుంది” అని చెప్పారు. 

“అలాగే, ద్రవ్యోల్బణం ఎప్పుడూ పరిమిత రేంజిలో లేదు. గ్లోబల్ ఆర్ధిక వ్యవస్ధ మందగించడం వలన మన ఎగుమతులు పడిపోతున్నాయి. దిగుమతులు కూడా పడిపోతున్నందున అది కనిపించడం లేదంతే” అని తెలిపారు చంద్ర శేఖర్. 

మోడీ విధానాలు పని చేస్తున్నాయని చెప్పే స్వతంత్ర పరిశీలకులు కూడా ఉన్నారు. అయితే వారి పరిశీలన కంపెనీలకు అనుకూలం కాగా, సి పి చంద్ర శేఖర్ పరిశీలనలో కాస్త ప్రజల పక్షపాతం వున్నది. 

క్రెడిట్ సుయిస్ చెప్పినట్లు  అచ్ఛే దిన్ వచ్ఛేసినా ప్రజలకు గడ్డు కాలమే. మూడీస్ కొన్నేళ్లు ఆగాలని చెప్పినా దానర్ధం ‘ముందుంది ముసళ్ల పండగ’ అనే అర్ధం. విదేశీ కంపెనీలు ‘శెభాష్’ అంటే ప్రోత్సాహం ఇఛ్చినట్లు! ‘ప్చ్!’ అని పెదవి విరిస్తే “ఇంకా చేయాలి’ అని హెచచరించినట్లు! వాళ్ళు ఏ మాట చెప్పినా జనానికి మాత్రం మూడినట్లే అర్ధం!  

స్మార్ట్ సిటీ: ఇంతవరకు ఒక్క పైసా రాలింది లేదు!

మోడి ప్రభుత్వం మరో విడత స్మార్ట్ సిటీల జాబితా ప్రకటించింది. స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు ఎంపిక అయిన నగరాలను కేంద్రం ప్రకటించడం ఇది మూడోసారి. ఇన్నిసార్లు ప్రకటించినప్పటికీ ఈ రెండేళ్ల మోడి పాలనలో విదేశీ పెట్టుబడి ఒక్క రూపాయి కూడా (విదేశీ పెట్టుబడి కాబట్టి ఒక్క డాలర్ కూడా అందాం పోనీ) దేశంలోకి, స్మార్ట్ సిటీల్లోకి రాలేదు.

మొదటి విడత 20 నగరాల జాబితా విడుదల చేయగా రెండో విడత 13 నగరాల పేర్లను ప్రకటించారు. ఈసారి అత్యధికంగా 27 నగరాల పేర్లను విడుదల చేశారు. మూడో విడత నగరాలలో ప్రధాన మంత్రి నియోజకవర్గం వారణాసి కూడా ఉన్నది.

100 స్మార్ట్ సిటీలు అంటూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడి ఒకటే ఊదరగొట్టడమే గానీ అలా అనడంలో అర్ధం ఏమిటో చెప్పినవారు లేరు. స్మార్ట్ సిటీ పధకం నిజానికి అమెరికాకు చెందిన స్మార్ట్ సిటీ కౌన్సిల్ బ్రెయిన్ చైల్డ్ అన్న సంగతి తెలిసిన వాళ్లు కూడా చాలా తక్కువ మందే.

స్మార్ట్ సిటీగా ఎంపిక అయిన నగరాలకు సంవత్సరానికి 100 కోట్ల చొప్పున అయిదేళ్ళ పాటు కేంద్రం ఇస్తుందని చెప్పారు. అంటే అయిదేళ్లలో 500 కోట్లు! ఈ డబ్బుతో కొత్తగా సౌకర్యాలు అభివృద్ధి చేస్తారా అంటే సమాధానం అవును/కాదు అని చెప్పాల్సి ఉంటుంది.

ఎందుకంటే అప్పటికే నిర్దిష్ట స్ధాయికి సౌకర్యాలు అభివృద్ధి అయితేనే స్మార్ట్ సిటీగా నిధులు పొందడానికి అర్హత సాధిస్తాయి.

గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మూడే మూడు రెసిడెన్షియల్ పాఠశాలల్ని (మూడు ప్రాంతాలకు ఒక్కోటి చొ.న) రాష్ట్ర ప్రభుత్వం నడిపేది. రాష్ట్ర వ్యాపితంగా తెలివిగల విద్యార్ధులను సమీకరించి వారికి మరింత శిక్షణ ఇచ్చి మరింత తెలివిమంతులుగా తయారు చేయడం ప్రకటిత లక్ష్యం.

“ఆల్రెడీ తెలివి గల వాళ్ళకి వాళ్ళు ఇచ్చేదేంటి శిక్షణ? అలాంటి వాళ్ళని మాకు అప్పజెపితే వాళ్ళకు రాష్ట్ర ర్యాంకులు వచ్చేలా మేమూ చేయలేమా?” అని ఆగ్రహంగా ప్రశ్నించేవాళ్లు సాధారణ ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు. స్మార్ట్ సిటీల వ్యవహారం కూడా అలానే తగలడింది.

ఎంపిక కావాలంటే: ఈ-గవర్నెన్స్, ఆన్ లైన్ సమస్యల పరిష్కార వ్యవస్ధ అభివృద్ధి చేసి ఉండాలి; ఈ-న్యూస్ లెటర్ ప్రింట్ అవుతూ ఉండాలి; జనానికి ప్రభుత్వ చెల్లింపులు అన్నీ ఆన్ లైన్ లో జరుగుతూ ఉండాలి; 2011 నాటికంటే కనీసం 5 శాతం పెచ్చు లెట్రిన్ లు నిర్మించి ఉండాలి; ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా చెల్లిస్తున్న రికార్డు ఉండాలి; పట్టణ సంస్కరణలు, పౌరుల పాత్ర అమలు అవుతూ ఉండాలి.

ఇవన్నీ ఈ దేశంలో ప్రతి ఒక్క పట్టణానికి, ప్రతి ఒక్క గ్రామానికి అవసరం కాదా? స్మార్ట్ సిటీలేనా, స్మార్ట్ విలేజ్ లు అవసరం లేదా? అసలు అభివృద్ధికి నోచుకోని పట్టణాలు, గ్రామాలు ఎంపిక చేసి స్మార్ట్ సిటీలు, స్మార్ట్ విలేజ్ లుగా మార్చాలి గాని అప్పటికే అభివృద్ధి అయిన సిటీలని స్మార్ట్ సిటీలుగా చేస్తే అది గొప్ప ఎలా అవుతుంది.

పై సౌకర్యాలు కల్పించాక/స్మార్ట్ సిటీగా ఎంపిక అయ్యాక కేంద్రం ఏం చేస్తుంది? గ్యారంటీ నీటి-విద్యుత్ సరఫరా అయేలా చూస్తుంది; పరిశుభ్రత, వృధా నిర్వహణ చక్కగా జరిగేలా చూస్తుంది; సమర్ధ ప్రజా రవాణా అభివృద్ధి చేస్తుంది; బ్రహ్మాండమైన ఐ.టి కనెక్టివిటీ (హై స్పీడ్ బ్రాడ్ బ్యాండ్, వైఫై, 4G, 5G ఉంటే అదీ కూడా) కల్పిస్తుంది; పౌరులకు రక్షణ, భద్రతలు కల్పిస్తుంది.

అలాగే ఈ సౌకర్యాలకు స్మార్ట్ వసతులు జత చేస్తుంది. ప్రజలకు సమాచారం, సమస్యల సత్వర పరిష్కారం, సేవలను ఎలక్ట్రానికల్ అందజేయడం, వృధా నుండి విద్యుత్ & ఎరువులు తయారు చేయడం; వృధా నీటిని 100 శాతం ట్రీట్ చేయడం; స్మార్ట్ మీటర్లు & నిర్వహణ, నీటి శుభ్రత నిర్వహణ, సమర్ధవంతమైన పచ్చని గృహ నిర్మాణం, స్మార్ట్ పార్కింగ్, తెలివైన ట్రాఫిక్ నిర్వహణ…. ఇలా అనేకం.

ఇవన్నీ స్మార్ట్ సిటీలుగా ఎంపిక కానీ నగరాలకు వద్దా? అసలు గ్రామాలు ఏం పాపం చేసుకున్నాయి? పాలకులు ఎప్పుడూ వల్లించే ‘ఇంక్లూజివ్ గ్రోత్’ సంగతి ఏమిటి? బహిరంగంగానే, అధికారికంగానే పట్టణాల మధ్య ఇంత తేడా చూపించే ప్రభుత్వం పల్లెల పైన శీత కన్ను వేయదంటే ఎలా నమ్మటం?

ఒక్క డాలర్ కూడా…!

అదంతా ఒక ఎత్తైతే స్మార్ట్ సిటీల నిర్మాణాన్ని తీసుకెళ్లి విదేశీ కంపెనీలకు అప్పగించడం. చెప్పడానికి పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్షిప్ అంటున్నారు గాని విధి విధానాలు అన్నీ అమెరికా కంపెనీయే చూస్తోందని తెలుస్తున్నది. స్మార్ట్ సిటీల కోసం దరఖాస్తులు స్వీకరించడం, ‘సిటీ ఛాలెంజ్’ అంటూ పోటీ పెట్టడం, ఎంపిక చేయడం అన్నీ అమెరికా కంపెనీ చేతుల మీదుగా నడుస్తోంది. మంత్రులు, అధికారులూ ఉంటారు గానీ వారి పాత్ర ఎంతవరకు అన్నది అనుమానం.

కాగా ఈ నెల ఆరంభంలో ద హిందు పత్రిక ఒక ఆర్‌టి‌ఐ అప్లికేషన్ పెట్టింది. ఇంతవరకు ఎంత విదేశీ పెట్టుబడి స్మార్ట్ సిటీ ల నిర్మాణం లోకి ప్రవహించింది, అని అడుగుతూ. ‘ఇప్పటికీ అసలేమీ రాలేదు’ అని తిరుగు టపాలో పట్టణాభివృద్ధి శాఖ నుండి సమాధానం వచ్చింది. వెంకయ్య నాయుడు ఈ శాఖకు మంత్రివర్యులు.

ప్రత్యేకంగా స్మార్ట్ సిటీల కోసమే వెంకయ్య నాయుడు గారు పలు మార్లు విదేశాలు వెళ్ళి ‘పెట్టుబడులు తెండి ప్లీజ్’ అని బతిమాలుకున్నారు. ఆయన వెళ్ళిన చోటల్లా వాగ్దానాల సిరులు తప్ప ఒక్క డాలర్ చుక్కా రాలి పడలేదు. విదేశాలు వెల్లడమే కాకుండా విదేశాల నుండి ఏ చిన్న అధికారి గానీ, మంత్రి గానీ వచ్చినప్పుడు కూడా నాయుడు గారు టంచనుగా హాజరు వేసుకుని పెట్టుబడి అడుగుతున్నారు.

ఎంత పెట్టుబడి వస్తుందని ఆశిస్తున్నారు అని అడిగితే దానిపైన ఇంకా అధ్యయనం చేయలేదని మంత్రి నుండి సమాధానం వచ్చింది. అంటే ఎలాంటి అధ్యయనాలు చేయకుండా 60 స్మార్ట్ సిటీల కోసం 66,883 కోట్ల నిధులు అయిదేళ్ళ పాటు ఇస్తామని కేంద్రం ఎలా చెబుతుందో తెలియకుంది.

స్వర్ణ చతుర్భుజి అనీ, ఎక్స్ ప్రెస్ హైవేలు అనీ నాలుగు, ఆరు లైన్ల రోడ్లను, ఎక్కడంటే అక్కడ ఓవర్ బ్రిడ్జిలను నిర్మించారు. పి‌పి‌పి కింద నిర్మించిన ఈ రోడ్ల పైన ఎక్కడంటే అక్కడ టోల్ ప్లాజాలు కట్టి ప్రైవేటు కంపెనీలు కోట్లు గుంజుతున్నాయి.

ఇదే తరహాలో పి‌పి‌పి కింద నిర్మించే స్మార్ట్ సిటీలలో ఎన్నెన్ని ఫీజులు జనం చెల్లించుకోవలో ఊహకు కూడా అందడం లేదు. ‘ఆ సౌకర్యం కల్పిస్తాం, ఈ సౌకర్యం కల్పిస్తాం’ అని ప్రభుత్వాలు చెప్పినంత మాత్రాన అవన్నీ వచ్చేస్తాయని భ్రమ పడనవసరం లేదు. ఓ శుభ ముహూర్తాన మనకు తెలియకుండానే మనం నివసించే నగరం ‘స్మార్ట్ సిటీ’ అయిపోయిందని ప్రకటన విడుదల అయితే ఆశ్చర్యపోవద్దు. ఏవో కొన్ని కొత్త నిర్మాణాలు కనపడతాయి గానీ ఆ పేరుతో వీర బాదుడు ఫీజులు వసూలు చేస్తారని మరవకూడదు.

ఆ ఫీజుల్లో ప్రైవేటు కంపెనీలకు, వాటి వెనుక ఉన్న విదేశీ ఫైనాన్స్ పెట్టుబడికి సింహభాగం వెళ్లిపోతుందని ప్రత్యేకంగా చెప్పాలా?